కరీంనగర్, ఏప్రిల్ 1 (నమస్తే తెలంగాణ): యాసంగిలో ధాన్యం కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి.చొప్పదండి మండలం వెదురుగట్టలో సోమవారం కలెక్టర్ పమేలా సత్పతి లాంఛనంగా ప్రారంభించారు. వారం తర్వాతనే కొనుగోళ్లు ముమ్మరం కానున్నాయని అధికారులు చెబుతున్నారు. జిల్లాలో 3.64 లక్షల మెట్రిక్ టన్నుల సేకరణ లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందుకు 341 కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. సోమవారం జిల్లా వ్యాప్తంగా వివిధ మండలాల్లో 20 కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. అయితే నీళ్లు లేక పంటలు ఎండిపోతున్న నేపథ్యంలో ఆశించిన దిగుబడి వచ్చే అవకాశాలు కనిపించడం లేదు.
జిల్లాలో యాసంగిలో 2.67 లక్షల ఎకరాల్లో వరి సాగు చేశారు. మంచి దిగుబడి వస్తే 6.35 లక్షల మెట్రిక్ టన్నుల వరకు ధాన్యం వచ్చే అవకాశం ఉంటుంది. కానీ, సాగు నీరందక అనేక మండలాల్లో వేలాది ఎకరాల్లో వరి ఎండిపోయింది. గంగాధర, రామడుగు, చిగురుమామిడి, తిమ్మాపూర్, కరీంనగర్ రూరల్, కొత్తపల్లి, తదితర మండలాల్లో పెద్ద మొత్తంలో పంటలు ఎండిపోతున్నాయి. ఈ నేపథ్యంలో ఆశించిన దిగుబడి రాకపోవచ్చు. అయితే అధికారులు మాత్రం సాగైన విస్తీర్ణంపై వచ్చే దిగుబడిని అంచనా వేస్తున్నారు.
వారి గణాంకాల ప్రకారం చూస్తే విత్తనోత్పత్తి, రైతులు కుటుంబ అవసరాలు అట్టిపెట్టుకునే ధాన్యం పోనూ 2.35 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు కేంద్రాలకు రావచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే, గత రెండు, మూడు సీజన్ల నుంచి ప్రైవేట్ వ్యాపారులు కూడా ధాన్యం పెద్ద మొత్తంలో కొనుగోలు చేస్తున్నారు. ఇతర జిల్లాల వ్యాపారులు కూడా ఇక్కడికి వచ్చి కొనుగోళ్లు జరుపుతున్నారు. ఈ నేపథ్యంలో అధికారుల అంచనాల మేరకు ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వస్తుందనే నమ్మకం కనిపించడం లేదు.
జిల్లాలో ఇప్పుడిప్పుడే కోతలు ప్రారంభిస్తున్నారు. ముందుగా నాట్లు వేసిన రైతులు కోతలు నిర్వహించుకుంటున్నారు. వీరికి అందుబాటులో కేంద్రాలు ఉంచాలని భావిస్తున్న అధికారులు సోమవారం 20 గ్రామాల్లో కేంద్రాలను ప్రారంభించారు. చొప్పదండి మండలం వెదురుగట్టలో కలెక్టర్ పమేలా సత్పతితో పాటు ఇతర అధికారులు ప్రారంభించారు. ముందుగా కోతకు వచ్చే హుజూరాబాద్లో 5, జమ్మికుంటలో 2, చిగురుమామిడి, గంగాధర, గన్నేరువరం, ఇల్లందకుంట, కరీంనగర్ రూరల్, కొత్తపల్లి, మానకొండూర్, రామడుగు, శంకరపట్నం,
తిమ్మాపూర్, సైదాపూర్, వీణవంక మండలాల్లో ఒక్కో కేంద్రాన్ని ప్రారంభించారు. మిగతా కేంద్రాలను డిమాండ్ను బట్టి ప్రారంభించనున్నారు. జిల్లాలో మొత్తం 341 కేంద్రాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించిన అధికారులు ఐకేపీ ద్వారా 50, సహకార సంఘాల ద్వారా 238, డీసీఎంఎస్ ద్వారా 47, హాకా ద్వారా 6 కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. ఏ గ్రేడ్ ధాన్యం క్వింటాల్కు రూ. 2,203, సాధారణ రకానికి రూ. 2,183 చెల్లిస్తున్నట్లు సివిల్ సప్లయిస్ కార్పొరేషన్ డీఎం రజినీకాంత్ తెలిపారు. రైతులు నాణ్యతా ప్రమాణాలు పాటించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.