Kalvasrirampur | కాల్వశ్రీరాంపూర్, ఏప్రిల్ 16 : కార్పొరేట్కు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో సకల సౌకర్యాలతో పాటు మౌళిక సదుపాయాలు ఉన్నాయని ఎంఈవో సిరిమల్ల మహేశ్ అన్నారు. శ్రీరాంపూర్ మండలంలోని పెగడపల్లిలో గురువారం బడిబాట కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో ర్యాలీగా తిరుగుతూ ప్రయివేటు పాఠశాలలకు వెళ్తున్న విద్యార్థుల ఇంటికి వెళ్లి, మీ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని తల్లిదండ్రులను కోరారు.
ప్రభుత్వ పాఠశాలల్లో గుణాత్మక విద్య అందించడంతో పాటు, సాంకేతిక పరిజ్ఞాణాన్ని వినియోగిస్తూ కార్పొరేట్ కు దీటుగా విద్యాబోధన అందిస్తున్నామన్నారు. రాబోవు విద్యా సంవత్సరంలో ప్రతీ ఒక్కరూ తమ పిల్లలను ప్రభుత్వపాఠశాలలో చేర్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ అరెల్లి రమేశ్, ఉప సర్పంచ్ పత్తి శ్రీనివాస్ రెడ్డి, హెచ్ఎం జగదీశ్వరాచారి, సీఆర్పీ చందర్, ఉపాధ్యాయులు, వార్డు సభ్యులు పాల్గొన్నారు.