ధర్మారం, ఫిబ్రవరి 6: రాష్ట్ర సర్కారు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘మన ఊరు – మన బడి’ కింద విద్యావ్యవస్థకు కొత్తరూపు వచ్చిందని, పాఠశాలల్లో సమూల మార్పులు చేస్తున్నామని మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. కార్పొరేట్కు దీటుగా సకల వసతులతో ప్రభుత్వ బడులను తీర్చిదిద్దుతున్నామని స్పష్టం చేశారు. మంగళవారం ధర్మారం మండలంలో మంత్రి విస్తృతంగా పర్యటించారు. పత్తిపాకలోని జడ్పీ ఉన్నత పాఠశాలలో ‘మన ఊరు-మన బడి’ కింద 24 లక్షలు, ఎన్ఆర్జీఎస్ కింద 61 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించిన డైనింగ్ హాల్, డిజిటల్ తరగతి గదులు, క్రీడా ప్రాంగణాన్ని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ సంగీత సత్యనారాయణ, డీఈవో మాధవితో కలిసి ప్రారంభించారు. అనంతరం ధర్మారంలో న్యాక్ సెంటర్ను ప్రారంభించారు. ఆ తర్వాత మండల పరిషత్ కార్యాలయం ఆవరణలో కల్యాణ లక్ష్మి, సీఎంఆర్ఎఫ్ చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. అనంతరం పత్తిపాక జడ్పీ ఉన్నత పాఠశాల ఆవరణలో జరిగిన సమావేశంలో పాల్గొన్నారు.
అలాగే పెగడపల్లిలోని రైతు వేదిక భవనంలో కలెక్టర్ యాస్మిన్ బాషాతో కలిసి లబ్ధిదారులకు కొత్తగా మంజూరైన ఆసరా పెన్షన్ పత్రాలు, కల్యాణలక్ష్మి, సీఎంఆర్ఎఫ్ చెక్కులను మంత్రి అందజేశారు. ఆయా కార్యక్రమాల్లో అమాత్యుడు మాట్లాడారు. ప్రభుత్వ బడుల్లో సమూల మార్పులు చేసేందుకు సీఎం కేసీఆర్ సాహసోపేత నిర్ణయం తీసుకున్నారని, మన ఊరు- మన బడి కింద రాష్ట్రంలోని 20వేల స్కూళ్లు కార్పొరేట్కు దీటుగా మారుతున్నాయని చెప్పారు. ఒక్కటేమిటి పాఠశాలల్లో కొత్త తరగతి గదులు, డైనింగ్ హాళ్లు, ఫర్నిచర్, డిజిటల్ తరగతి గదులు, డ్యుయెల్ డెస్క్లు, విద్యుద్దీకరణ, తాగు నీటి వసతి, మరుగుదొడ్ల నిర్మాణం, ప్రహరీలు నిర్మిస్తున్నారని చెప్పారు. ఇక నిరుపేద విద్యార్థులకు నుంచి సర్కారు బడుల్లో నాణ్యమైన విద్య అందనుందని పేర్కొన్నారు. హైస్కూల్ స్థాయిలో డిజిటల్ బోధన, ప్రాథమిక స్థాయిలో డిజిటల్ లైబ్రరీలు అందుబాటులోకి వస్తాయని చెప్పారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల విద్యార్థుల కోసం గురుకులాలు నాణ్యమైన బోధనతో అన్ని రంగాలలో పోటీ పడుతున్నాయని, అందులో చదివే పిల్లలు నీట్, ఐఐటీల్లో సీట్లు సాధిస్తుండడం విప్లవాత్మకమైన మార్పుగా మంత్రి అభివర్ణించారు.
పత్తిపాక జడ్పీ ఉన్నత పాఠశాల నిర్వహణ భేష్ అని కితాబిచ్చిన మంత్రి, గుట్టపై రాక్ గార్డెన్ అద్భుతంగా తీర్చిదిద్దిన హెచ్ఎం పీఎం షేక్ను, ఉపాధ్యాయులను అభినందించారు. పది పరీక్షల్లో వంద శాతం ఫలితాలు సాధించడం హర్షనీయమే అయినప్పటికీ విద్యార్థులు అన్ని సబ్జెక్ట్ల్లో 60 శాతం మార్కులు సాధించేలా ఉపాధ్యాయులు ప్రణాళికతో బోధించాలని సూచించారు. బడికి సీసీ రహదారికి నిధులు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. పెద్దపల్లి కలెక్టర్ సంగీత సత్యనారాయణ మాట్లాడుతూ, మన ఊరు – మన బడి కింద జిల్లాలో 191 స్కూళ్లు ఎంపికయ్యాయని, 12 రకాల అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు చెప్పారు. విద్యార్థుల్లో విద్యా ప్రమాణాలు పెంచేందుకు అమలు చేస్తున్న ‘తొలిమెట్టు’తో సత్ఫలితాలు వస్తున్నాయని చెప్పారు. ఈ సందర్భంగా విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమానికి హెచ్ఎం పీఎం షేక్ అధ్యక్షత వహించగా, స్థానిక సంస్థల అడిషనల్ కలెక్టర్ కుమార్ దీపక్, డీఈవో మాధవి, ఎంపీపీ ముత్యాల కరుణశ్రీ, జడ్పీటీసీ పూస్కూరు పద్మజ, సర్పంచ్ బద్దం సుజాత, ప్యాక్స్ చైర్మన్లు ముత్యాల బలరాంరెడ్డి, నోముల వెంకట్ రెడ్డి, ఏఎంసీ చైర్మన్ కోమటిరెడ్డి బుచ్చిరెడ్డి, ఎంపీటీసీ బద్దం అజయ్పాల్ రెడ్డి, ఎంఈవో పినుమల్ల ఛాయాదేవి, ఎంపీడీవో బీ జయశీల, తహసీల్దార్ డీ శ్రీనివాస్, ఎస్ఎంసీ చైర్మన్ జోగుల అంజయ్య, సింగిల్ విండో డైరెక్టర్ బద్దం రవీందర్ రెడ్డి ఉన్నారు.