మెట్పల్లి రూరల్, జూన్ 26: మెట్పల్లి మం డలంలో మేజర్ గ్రామపంచాయతీగా కొనసాగుతున్న బండలింగాపూర్ను పది రెవెన్యూ గ్రామాలతో నూతన మండలంగా ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో సంస్థాన కేంద్రంగా పాలన సాగించిన బండలింగాపూర్ను మండలంగా ఏర్పాటు చేయాలని గ్రామస్తులు, ప్రజాప్రతినిధులు డిమాండ్ చేస్తూ వస్తున్నారు. గతంలో నిరసన కార్యక్రమాలు చే పట్టారు. దీంతో గత డిసెంబర్ 7న జగిత్యాలలో జరిగిన బహిరంగ సభలో సీఎం కేసీఆర్ బండలింగాపూర్ గ్రామాన్ని నూతన మండలంగా ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ఈ మేరకు రెవెన్యూ గ్రామాలైన బండలింగాపూర్, రాజేశ్వర్రావుపేట, మేడిపల్లి, రామచంద్రంపేట, విట్టంపేట, మెట్లచిట్టాపూర్, జగ్గసాగర్, రామలచ్చక్కపేట, రంగారావుపేట, ఆత్మకూర్తో కొత్త మండలం ఏర్పాటుకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. కాగా, రెవెన్యూ గ్రామాల పరిధిలోని ఆత్మనగర్, పాటిమీది, ఏఎస్సార్, కేసీఆర్ తండాలు, చెర్లకొండాపూర్ గ్రామాలు సైతం కొత్త మం డలంలో కలవనున్నాయి. అలాగే 15 రోజుల్లోగా అభ్యంతరాలు, వినతులకు గడువు ఇస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నవీన్ మిట్టల్ సోమవారం ప్రాథమిక నోటిఫికేషన్ జారీచేశారు.
మేజర్ జీపీ నుంచి మండల కేంద్రంగా..
5,922 జనాభాతో మేజర్ గ్రామపంచాయతీగా కొనసాగుతున్న బండలింగాపూర్లో 2,9 29 పురుషులు, 2,993 మహిళలు ఉన్నారు. మొత్తం ఓటర్లు 4,343 కాగా, పురుషులు 2,039, మహిళలు 2,304 ఉన్నారు. గ్రామం లో మొత్తం 14 వార్డులున్నాయి. విస్తీర్ణం 3,500 ఎకరాలు కాగా, మూడు చెరువులు, మూడు కుంటలున్నాయి. ఇబ్రహీంపట్నం మండలంలో మేజర్ గ్రామపంచాయతీగా కొనసాగిన బండలింగాపూర్ జిల్లాల పునర్విభజనలో భాగంగా మెట్పల్లి మండలంలో కలిసింది. మెట్పల్లి మండలంలో మేజర్ గ్రామంగా కొనసాగుతున్న బండలింగాపూర్ ప్రభుత్వ నోటిఫికేషన్తో మండల కేంద్రంగా అవతరించేందుకు సిద్ధంగా ఉంది.