కేసీఆర్ పాలనలో ప్రజలకు మెరుగైన వైద్యం అందించిన మెట్పల్లి సామాజిక దవాఖానలో ప్రస్తుత కాంగ్రెస్ మూడు నెలల పాలనలోనే మృగ్యమయ్యాయి. అప్పటి సర్కారు కేసీఆర్ కిట్లను ప్రవేశపెట్టడం, సకల సౌకర్యాలు కల్పించడంతో ప్రతినెలా ప్రసవాల కోసం వచ్చే గర్భిణులతో కళకళలాడేది. కానీ, ఇప్పటి సర్కారు వైద్యసేవలందించడం, వసతుల కల్పనలో నిర్లక్ష్యం, కేసీఆర్ కిట్లకు మంగళంపాడడంతో ప్రసవాల సంఖ్య గణనీయంగా తగ్గిపోతున్నది. వెరసి మెట్పల్లి ప్రభుత్వ వైద్యశాలలో మళ్లీ ఉమ్మడి రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు రావడం ఆందోళన కలిగిస్తున్నది.
-మెట్పల్లి, ఏప్రిల్ 14
తెలంగాణ ఏర్పాటు తర్వాత కేసీఆర్ ప్రభుత్వం సర్కారు దవాఖానల అభివృద్ధిపై దృష్టిపెట్టింది. నిరుపేదలకు మెరుగైన సేవలందించేందుకు విరివిగా నిధులు వెచ్చించి మౌలిక వసతులు కల్పించింది. వైద్యులు, సిబ్బందిని నియమించి 24 గంటలు సేవలందించింది. ప్రసవాల సంఖ్య పెంపునకు తెచ్చిన కేసీఆర్ కిట్ పథకం సత్ఫలితాలనిచ్చింది. అయితే నాలుగు నెలల క్రితం అధికారం చేపట్టిన రేవంత్ సర్కారు ప్రభుత్వ వైద్యంపై అలక్ష్యం చేస్తున్నది. ఇటీవల కాలంలో దవాఖానలో నమోదైన ప్రసవాల సంఖ్యను చూస్తే వచ్చిన ‘మార్పు’ ఇట్టే అవగతమవుతున్నది. గడిచిన జనవరి, ఫిబ్రవరి నెలలో నమోదైన ప్రసవాల సంఖ్య రెండంకెలు దాటలేదు.
2023 జనవరిలో 130, ఫిబ్రవరిలో 129, మార్చిలో 116, ఏప్రిల్లో 99, మేలో 118, జూన్లో 109, జులైలో 123, ఆగస్టులో 121, సెప్టెంబర్లో 121, అక్టోబర్లో 132, నవంబర్లో 91, డిసెంబర్లో 116 ప్రసవాలు జరగగా ఏప్రిల్, నవంబర్ నెలలో వందలోపు మాత్రమే ప్రసవాలు జరిగాయి. ఈ ఏడాది జనవరిలో 93, ఫిబ్రవరిలో 92, మార్చిలో 101 ప్రసవాలు జరిగాయి. గతేడాదిలో జరిగిన ప్రసవాలు, ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరి, మార్చిలో జరిగిన ప్రసవాల సంఖ్యను పోల్చి చూస్తే మూడు నెలల్లో ప్రసవాల సంఖ్య తగ్గుముఖం పడుతున్నట్లు స్పష్టమవుతున్నది.
నమోదైన ప్రసవాల సంఖ్యను బట్టి చూస్తే ప్రభుత్వ దవాఖాన ప్రజల ఆదరణను కోల్పోతుందా? లేదా ప్రసవాలపై సరైన అవగాహన కల్పించడంలో గాని, గర్భిణులను దవాఖాన వరకు తీసుకరావడంలో గాని, వచ్చిన గర్భిణులకు సరైన వైద్య సేవలు అందించడంలో గాని, వసతుల కల్పనలో సంబంధిత యంత్రాంగం విఫలమవుతుందా? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. దవాఖానలో గైనకాలజిస్టులు ముగ్గురికి గాను ఒకరికి కాంట్రాక్ట్ గడువు ముగియడంతో కొంత కాలంగా ఇద్దరు మాత్రమే పనిచేస్తున్నారు. ఏది ఏమైనా ప్రభుత్వం స్పందించి ప్రసవాల సంఖ్యను పెంపుపై దృష్టిపెట్టాలని ప్రజలు కోరుతున్నారు.