కరీంనగర్, జనవరి 21 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): కొత్తపల్లిలోని రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థకు చెందిన ఐదెకరాల విస్తీర్ణంలో ఉన్న స్థలాన్ని ప్రభుత్వ మెడికల్ కాలేజీ కోసం ప్రతిపాదించినందున.. అందుకు ప్రత్యామ్నాయం గా కరీంనగర్ జిల్లాలో మరో చోట 50 ఎకరాల భూమిని కేటాయించాలని రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు, మేనేజింగ్ డైరెక్టర్ కేశవులు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు వారు రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ను హైదరాబాద్లోని ఆయన నివాసంలో కలిసి సమావేశమయ్యారు.
మెడికల్ కాలేజీ కోసం స్థలాన్ని ప్రతిపాదించిన నేపథ్యంలో మరో చోట 50 ఎకరాలు కేటాయిస్తే అక్కడ సీడ్ ఫామ్ హౌస్, గోదాములు, శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పారు. తోటపల్లి, రుక్మాపూర్, బెజ్జంకి ప్రాంతాల్లో ప్రభుత్వ భూమి అందుబాటులో ఉందని, ప్రత్యామ్నాయంగా అక్కడ రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థకు భూమిని కేటాయించే అవకాశముందని కలెక్టర్ ఆర్వీ కర్ణన్ నివేదించారని వినోద్ తెలిపారు. రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖల మంత్రి గంగుల కమలాకర్తో కలిసి ఈ విషయాన్ని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తామని రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్, ఎండీకి హామీనిచ్చారు.