Senior citizen cards | కలెక్టరేట్, ఫిబ్రవరి 10 : సీనియర్ సిటిజన్లు ఈ రాష్ట్రానికి మార్గదర్శకులు. వారి సేవలు అమూల్యం మలిదశలో వారికవసరమైన సేవలందించటంలో తమ ప్రభుత్వం ముందుంటుంది అంటూ సీఎం రేవంత్రెడ్డి ఆర్నెల్ల క్రితం చేసిన వ్యాఖ్యలు కాగితాలకే అన్నట్లుగా మారాయనే విమర్శలు వస్తున్నాయి. వివిధ అవసరాల కోసం వారి వయసును నిర్ధారిస్తూ, అందజేస్తున్న సీనియర్ సిటిజన్ కార్డులకు కొద్దినెలలుగా మంగళం పాడిన ప్రభుత్వం, వారికి సంక్షేమ ఫలాలు కూడా సక్రమంగా అందజేయటం లేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
60 ఏళ్ళు దాటిన వారిని ప్రత్యేకంగా గుర్తించి, వారికి వర్తింపజేస్తున్న పలు సౌకర్యాలు సద్వినియోగం చేసుకునేందుకు ప్రభుత్వం గుర్తింపు కార్డులు మంజూరు చేసేది. వాటి ద్వారా సీనియర్ సిటిజన్లుగా నమోదైన వారంతా ప్రధానంగా రైల్వేల్లో ఉచితంగా ప్రయాణించటం, బస్సుల్లో సీట్లు కేటాయించటం, రాయితీ ద్వారా విమాన టికెట్లు పొందటం, న్యాయస్థానాల్లో వీరి కేసులకు ప్రాధాన్యత ఇవ్వటంతో పాటు దైవ దర్శనాల్లో కూడా ప్రాధాన్యత లభించేది. అలాగే, ఇతర సంక్షేమ పథకాల లబ్ధికి ఇవి ఉపయోగపడేవి. 2006 నుంచి ప్రారంభమైన ఈ కార్డుల మంజూరీ కరోనా వరకు నిరంతరాయంగా కొనసాగింది. అనంతరం వీటి ద్వారా కలిగే ప్రయోజనాలు నిలిపివేయటంతో వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అందజేస్తున్న ఈ కార్డులు పంపిణీ కూడా అంతంతమాత్రంగానే జరిగినట్లు తెలుస్తోంది.
ఈకార్డులతో పొందే ప్రయోజనాలపై అవగాహన ఉన్న సీనియర్ సిటిజన్లు మాత్రం సంబంధిత కార్యాలయానికి వెళ్లి దరఖాస్తులు చేసుకుంటూనే ఉన్నారు.
అయితే, గత నాలుగైదు నెలల నుంచి వీటిని పూర్తిగా నిలిపివేసినట్లు వెల్లడిస్తుండగా, కార్డుల కోసం దరఖాస్తుదారులు నిత్యం జిల్లా సంక్షేమశాఖ కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. తమకు గుర్తింపు కార్డులు మంజూరీ చేయాలని వేడుకుంటుండగా, ప్రస్తుతానికి నిలిపేసామంటూ చావు కబురు చల్లగా చెబుతున్నారని దరఖాస్తుదారులు. పేర్కొంటున్నారు. ఓవైపు సీనియర్ సిటిజన్ల సంక్షేమంపై సానుకూల ధోరణితో ఉన్నామంటూ ప్రకటనలు చేస్తూనే, మరోవైపు వారికి కనీసం గుర్తింపుకార్డులు కూడా ఇవ్వకపోవటం పట్ల మండిపడుతున్నారు. జిల్లాలో సుమారు 13వేల వరకు వివిధ ఉద్యోగాల్లో పదవీ విరమణ పొంది, పెన్షన్ పొందుతున్న వారుండగా, 52,900 మంది వృద్ధాప్య పెన్షన్లు పొందుతున్న వారు ఉన్నారు. వీరిలో కొద్ది మంది మాత్రమే సీనియర్ సిటిజన్ కార్డులు పొందినవారు ఉన్నారు. మిగతా వారిలో 20 శాతానికి పైగా మంది దరఖాస్తులు చేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే, వీరికి కార్డులు మంజూరు కాలేదని సమాచారం. ఏళ్లకేళ్లుగా వివిధ ప్రభుత్వ విభాగాల్లో సేవలందించిన విశ్రాంత ఉద్యోగుల సమస్యలు పెండింగ్లోనే ఉంచగా, వృద్ధాప్య పెన్షన్లు కూడా కొత్తగా మంజూరు చేయకుండా, పెన్షన్లు పెంచకుండా జాప్యం ప్రదర్శిస్తోందనే అసంతృప్తి పెల్లుబికుతోంది.
కార్డులు పునరుద్దరించాలి : చందుపట్ల జనార్ధన్, ఆల్ పెన్షనర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు
సీనియర్ సిటిజన్లకు గుర్తింపు కార్డులు పునరుద్దరించాలి. ప్రభుత్వ సంక్షేమ పథకాలతో సంబంధం లేకుండా అత్యవసర పరిస్థితుల్లో ఇవి ఎంతగానో ఉపయోగపడుతాయి. దేవాలయాలు, ఇతర చోట్ల వీటిని తమ గుర్తింపు కోసం ప్రదర్శించే అవకాశముంటుంది ఎలాంటి ఇబ్బందులు పెట్టకుండా అధికారులు వెంటనే కార్డుల పంపిణీ చేపట్టేలా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయాలి.