Karimnagar | కమాన్ చౌరస్తా, జూన్ 15 : అద్విత ఇంటర్నేషనల్ స్కూల్కు చెందిన తొమ్మిదో తరగతి విద్యార్థిని వి నందిని కరీంనగర్ జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ (కేడీబీఏ) ఆధ్వర్యంలో నిర్వహించిన కరీంనగర్ జిల్లా బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్- 2026లో అండర్-15 విభాగంలో ప్రథమ స్థానం సాధించి స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. నందిని తన అద్భుతమైన ఆటతీరుతో, కృషి, పట్టుదల, క్రీడా నైపుణ్యాన్ని చాటుతూ ఈ ఘన విజయాన్ని అందుకోగా పాఠశాల డైరెక్టర్ అనుదీప్ సౌగాని నందినికి స్వర్ణ పతకాన్ని అందజేసి అభినందించారు.
ఈ సందర్భంగా అనుదీప్ సౌగాని మాట్లాడుతూ విద్యార్థులు విద్యతో పాటు క్రీడల్లోనూ రాణించాలని, నందిని సాధించిన విజయం అందరికీ ఆదర్శమని తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్, వైస్ ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.