ప్రాణాంతక కిడ్నీ ఫెయిల్యూర్తో బాధపడుతూ, దేవుడిపైనే భారం వేస్తూ జీవితాలు నెట్టుకొస్తున్న కిడ్నీ బాధితులకు రాష్ట్ర సర్కా రు పునర్జీవం పోస్తున్నది. కొన్నేళ్లుగా హైదరాబాద్లాంటి మహా నగరాలకే పరిమితమైన డయాలసిస్ సేవలను నియోజకవర్గ కేంద్రా ల్ల్లో అందుబాటులోకి తెస్తున్నది. కిడ్నీ ఫెయిల్యూరైనవారు వారానికి మూడు సార్లు రక్త శుద్ధి చేసుకోవాల్సి ఉండడం, అది ప్రైవేట్లో అత్యంత ఖర్చుతో కూడుకున్న చికిత్స కాగా, గోదావరిఖని దవాఖానలో ఏర్పాటు చేసిన కేంద్రం ఐదేండ్లుగా దిగ్విజయంగా సేవలందిస్తున్నది. ఇప్పటివరకు 25వేల మందికి పై వేట్లో బాధితులకు ఊపిరిపోసి, ఆయుష్షు పెంచింది. సేవలను మరింత విస్తృతం చేసేందుకు తాజాగా పెద్దపల్లి జిల్లా దవాఖానలో సెంటర్ను ప్రారంభించింది. త్వరలోనే మం థని దవాఖానలో సెంటర్ ఏర్పాటు చేయబోతుండగా, బాధితులకు ఆర్థిక, దూరభారం తప్పనున్నది.
– పెద్దపల్లి, జూలై 7(నమస్తే తెలంగాణ)
పెద్దపల్లి, జూలై 7(నమస్తే తెలంగాణ): మూత్ర పిండాల వ్యాధి గ్రస్తులకు గోదావరిఖని డయాలసిస్ కేంద్రం వరంగా మారింది. రెండు కిడ్నీలు చె డిపోయిన రోగికి వారంలో మూడు సార్లు రక్త శుద్ధి చేయాలంటే ప్రైవేట్లో రూ.20వేల ఖర్చవుతుంది. వరంగల్, హైదరాబాద్లాంటి నగరాలకు వెళ్లలేక ఇబ్బంది పడుతున్న రోగులకు అందుబాటులో ఉండేలా ప్రభుత్వం ఏరియా దవాఖానలో ఐదేండ్ల కింద రక్తశుద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేయ గా, దిగ్విజయంగా నడుస్తున్నది. పైసా ఖర్చులేకుండా వేలాది రూపాయల చికిత్సను అందిస్తుండగా, రోగికి ఆయుర్ధాయం కొంత పెరుగుతున్నది.
ప్రాణాంతకంగా కిడ్నీఫెయిల్యూర్
తలనొప్పి లాంటి సమస్యలు, ఆహార అలవాట్లు, రక్తపోటు, అతిగా పెయిన్ కిల్లర్ల వాడకం వల్ల మూత్ర పిండాలు దెబ్బతింటున్నాయి. కిడ్నీలు పాడైన రోగుల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతున్నది. ఖరీదైన వైద్యం చేయించుకునే స్థోమతలేక, సకాలంలో మెరుగైన వైద్యం అందక మృత్యువాత పడుతున్నారు. రక్తాన్ని శుద్ధి చేయించుకునేందుకు కిడ్నీ బాధితులు గతంలో వరంగల్, హైదరాబాద్కు వెళ్లాల్సి వచ్చేది. 140 కిలోమీటర్ల దూరం వెళ్లాలంటే రాను పోను సమయమంతా ప్రయాణానికే సరిపోయేది. తీరా అక్కడికి వెళ్లాక బెడ్డు ఖాళీలేకుంటే మరోరోజు వేచి ఉండాల్సిన పరిస్థితి. సమయానికి డయాలసిస్ చేయించుకోకుంటే ప్రాణానికే ప్రమాదం. ఇలా కిడ్నీ బా ధితుల ఇబ్బందులను తొలగించేందుకు ప్రభుత్వం గతంలోనే జిల్లాకో డయాలసిస్ కేంద్రా న్ని ఏర్పాటు చేసింది. ఇందులో భాగంగా గోదావరిఖని ఏరియా దవాఖానలో ఐదు పడకలతో యూనిట్ను ఏర్పాటు చేసింది.
ఇప్పటికే 25,279మందికి డయాలసిస్..
రామగుండం ఏరియా దవాఖానలో 2018 లో డీసీడీసీ కిడ్నీ కేర్ అనే సంస్థ ద్వారా దాదాపు రూ.కోటితో డయాలసిస్ సెంటర్ను ఏర్పాటు చే యగా, దిగ్విజయంగా నడుస్తున్నది. కాగా, కేం ద్రంలో ఒక్కో పేషెంట్కు నాలుగు గంటల సమ యం పడుతుంది. జిల్లా నుంచే కాకుండా ఇతర జిల్లాల నుంచి కూడా ఇక్కడికి వచ్చి చికిత్స చే యించుకుంటుండగా ఆరోగ్యశ్రీ పథకం కింద సేవలందిస్తున్నారు. రోజుకు 20 మంది చొప్పున 24 గంటలపాటు ఈ ఐదేండ్లలో 25,279 మంది కి డయాలసిస్ చేశారు. వీరందరికి రూ.కోట్లలో రక్త శుద్ధి, మందులు ఉచితంగా ఇచ్చారు.
పెద్దపల్లిలో అందుబాటులోకి..
ఖనిలో సెంటర్ విజయవంతంగా నడుస్తుండగా, ఈ నెల 1న పెద్దపల్లి దవాఖానలో కేంద్రాన్ని ప్రారంభించారు. రూ.1.50కోట్లతో ఐదు బెడ్లతో కూడిన సెంటర్ను ఏర్పాటు చేశారు. దీనిని వర్చువల్ విధానంలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు ప్రారంభించగా, రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్, జడ్పీ చైర్మన్ మధూకర్, ఎమ్మె ల్యే దాసరి నేరుగా వచ్చి అంకురార్పణ చేయగా, సేవలు అందుబాటులోకి వచ్చాయి. అయితే మంథనిలో సివిల్ ఆసుపత్రికి సైతం ఐదు పడకలతో కూడిన డయాలసిస్ కేంద్రాన్ని మంత్రి హరీశ్రావు మంజూరు చేయగా త్వరలోనే ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మంథని దవాఖా న ఆవరణలోని పూర్వపు సీమాంక్ సెంటర్లో ఈ డయాలసిస్ కేంద్రాన్ని ప్రారంభించనున్నారు.
రోజుకు 15-20మందికి డయాలసిస్ చేస్తున్నాం..
జూన్ 2018లో రామగుండంలో డయాలసిస్ కేంద్రాన్ని ప్రారంభించుకున్నాం. అన్ని సౌకర్యాలు, ఐదు పడకలతో డయాలసిస్ చేస్తున్నాం. అప్పటి నుంచి ప్రతి రోజూ 15-20మందికి డయాలసిస్ చేస్తున్నాం. పెద్దపల్లి జిల్లాతో పాటుగా మంచిర్యాల జిల్లా, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల నుంచి కూడా కిడ్నీ బాధితులు వచ్చి ఇక్కడ ఉచితంగా సేవలు పొందుతున్నారు.
-డా. టీపీ దయాల్సింగ్, మెడికల్ సూపరింటెండెంట్ రామగుండం
ఇప్పడిప్పుడే వస్తున్నారు..
పెద్దపల్లి జిల్లా దవాఖానలో ఈ నెల 1న డయాలసిస్ కేంద్రం ప్రారంభమైంది. స్థానికంగానే డయాలసిస్ ఉందని తెలుస్తుండడంతో పెద్ద సంఖ్యలో వస్తున్నారు. ఇప్పటి వరకు 12మంది వరకు డయాలసిస్ చేశాం. క్రమంగా వారి సంఖ్య పెరుగుతుంది. పెద్దపల్లి నియోకవర్గంలోని కిడ్నీ బాధితులందరికీ, సమీప గ్రామాలకు సంబంధించిన వారందరికీ ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది.
-డా. నెలపాటి శౌరయ్య, మెడికల్ సూపరింటెండెంట్ పెద్దపల్లి.
గోదావరిఖనిలోనే చేయించుకుంటున్నా..
నాపేరు ఇండ్ల రజిత. మాది జయశంకర్ భూపాలపల్లి జిల్లా మల్హర్రావు మండలం ఎడ్లపల్లి. నా భర్త వ్యవసాయం చేస్తడు. నేను కూడా వ్యవసాయమే చేసేదాన్ని. ఐదేండ్ల నుంచి రెండు కిడ్నీలు పాడైనయి. అప్పటి నుంచి గోదావరిఖనిలోని డయాలసిస్ సెంటర్కు వచ్చి చికిత్స తీసుకుంటున్న. వారానికి ఒక సారి చేయించుకుంటున్న. ప్రతి వారం ఇక్కడికి వచ్చుడు.. పోవుడు అంటే బస్ కిరాయిలకు చానా కష్టమయ్యేది. కానీ కేసీఆర్ సార్ ప్రతి నెలా ఇస్తున్న రూ. 2016 పింఛన్ నాకు ఎంతగానో ఉపయోగపడుతున్నది.
– ఇండ్ల రజిత, కిడ్నీ బాధితురాలు, ఎడ్లపల్లి, మల్హర్ మండలం జయశంకర్ భూపాలపల్లిజిల్లా.
దూరంపోయే బాధ తప్పింది..
మాది రామగుండం. ఏడాదిన్నరగా డయాలసిస్కు వస్తున్న. ఇక్కడ డయాలసిస్ లేకుంటే కరీంనగర్కు వెళ్లాల్సి వస్తుండే. ఇక్కడే ఉండడం వల్ల పెద్దగా ఇబ్బంది అనిపించడం లేదు. కిడ్నీ బాధితులకు సర్కార్ గొప్ప సాయం చేస్తున్నది. ఇటు డయాలసిస్ కేంద్రాలను పెడుతున్నది. అటు పింఛన్లు సైతం ఇస్తున్నది. నాకు వచ్చిన ఈ కష్టానికి ప్రభుత్వం కొంత ఉపశమనం కలిగిస్తున్నది.
– వెంకటేశ్వర్లు, కిడ్నీ బాధితుడు, రామగుండం.