బడుగు బలహీన వర్గాల పిల్లలకు నాణ్యమైన విద్యను అందించేందుకు ఎస్సీ, ఎస్టీ, బీసీ గురుకుల పాఠశాలల్లో ఆడ్మిషన్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 9న నోటిఫికేషన్ విడుదల చేసింది. 2023-24 విద్యా సంవత్సరానికి ఐదో తరగతిలో ప్రవేశాల కోసం ఆన్లైన్లో దరఖాస్తు ప్రక్రియ ప్రారంభించింది. మార్చి ఆరో తేదీ గడువు విధించగా, దరఖాస్తు చేసుకొన్న అర్హులైన విద్యార్థులకు ఏప్రిల్ 23న ఉమ్మడి ప్రవేశ పరీక్ష నిర్వహించి, ప్రవేశాలకు అవకాశం కల్పించనున్నది.
– సిరిసిల్ల, ఫిబ్రవరి 12
రాష్ట్ర ప్రభుత్వం గురుకులాల్లో ఐదో తరగతికి ప్రవేశాల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నది. ఈ నెల 9న ఆన్లైన్లో దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభించగా, వచ్చే నెల 6వ తేదీ వరకు కొనసాగనున్నది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఆరు ఎస్సీ, 8 బీసీ, నాలుగు ఎస్టీ చొప్పున మొత్తం 18 గురుకులాలు ఉండగా, ఒక్కో పాఠశాలలో 80 సీట్ల చొప్పున కేటాయించారు. ఏప్రిల్ 23న ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు కేటాయించిన పరీక్ష కేంద్రాల్లో ప్రవేశ పరీక్షలు నిర్వహించనున్నారు.
ఈ నెల 9 నుంచి మార్చి 6 వరకు ఆన్లైన్లో అర్హులైన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు కోసం రూ.100లు చెల్లించాలి.
ఒక ఫోన్ నంబర్తో ఒక దరఖాస్తు మాత్రమే చేసుకొనే వీలున్నది.
దరఖాస్తు చేసుకొన్న విద్యార్థులకు ఉమ్మడి జిల్లాలోనే పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేస్తారు.
ప్రవేశపరీక్షలో వచ్చిన మార్కుల ఆధారంగా సీట్ల కేటాయింపు ఉంటుంది.
విద్యార్థుల ఎంపిక పాత జిల్లా యూనిట్గానే పరిగణిస్తారు.
సమర్థులు, సుదీర్ఘ అనుభవం గల ఉపాధ్యాయులతో బోధన. ఐఐటీ, ఎన్ఐటీ, నీట్, ఎంసెట్ వంటి జాతీయ పోటీ పరీక్షకు శిక్షణ ఇస్తారు. సెంట్రల్, అజీజ్ ప్రేమ్జీ, ఢిల్లీ వంటి ప్రతిష్టాత్మకమైన విశ్వవిద్యాలయాల్లో ప్రవేశానికి శిక్షణ అందిస్తారు. విద్యార్థుల సమస్యలు తెలుసుకొనేందుకు హౌస్ మాస్టర్, ఆస్పిరెంట్ విధానం ఉంటుంది. విద్యా బోధనతో పాటు క్రీడలు, కోడింగ్, ఫైన్ ఆర్ట్స్ వంటి కోర్సులపై ప్రత్యేక శిక్షణ. శారీరక విద్య, యోగాలో శిక్షణ
తెలుగు, ఆంగ్లం, గణితం, మెంటల్ ఎబిలిటీ(మానసిక సామర్థ్యం) పరిసరాల విజ్ఞానంలో 3, 4వ తరగతి స్థాయిలో ప్రశ్నలు ఉంటాయి. మొత్తం మార్కులు 100, అబ్జెటివ్ టైప్లో పరీక్ష పత్రం ఉంటుంది. తెలుగు-20, ఆంగ్లం-25, పరిసరాల విజ్ఞానం -20, గణితం 25, మెంటల్ ఎబిలిటీ-10 చొప్పున మార్కులు ఉంటాయి.
ఓఎంఆర్ షీట్లో జవాబులు గుర్తించాలి. పరీక్షా పత్రం తెలుగు, ఇంగ్లిషు మీడియంలో ఉంటుంది.
విద్యార్థుల భోజనానికి సన్నబియ్యంతో పాటు అన్ని పోషక విలువలు ఉన్న రుచికరమైన ఆహారం అందిస్తారు. ఉచితంగా పాఠ్యపుస్తకాలు, నోటు పుస్తకాలు, స్టేషనరీ అందజేస్తారు. మూడు జతల పాఠశాల యూనిఫాంలు, ట్రంక్ బాక్స్లు ఇస్తారు. ప్రతి విద్యార్థికి పీటీ డ్రెస్, ట్రాక్ సూట్, స్పోర్ట్స్ షూ, సాక్స్, నైట్ డ్రెస్, ప్లేట్, గ్లాస్, బెడ్షీట్, బ్లాంకెట్, పరుపులు కేటాయిస్తారు. సబ్బుల కొనుగోలుకు డబ్బులు చెల్లిస్తారు. నెలకు నాలుగు సార్లు చికెన్, రెండు సార్లు మటన్తో భోజనం ఉంటుంది.