అత్యధిక ఓటర్లున్న కరీంనగర్ శాసనసభ నియోజకవర్గ గడ్డపై గంగుల కమలాకర్ చరిత్ర సృష్టించారు. ఈ నియోజకవర్గం నుంచి వరుసగా నాలుగు సార్లు గెలిచిన మొదటి ఎమ్మెల్యేగా రికార్డు సొంతం చేసుకున్నారు. గతంలో స్వర్గీయ జువ్వాడి చొక్కారావు మూడు సార్లు ఎన్నికైనా.. ఆయన రెండు సార్లు మాత్రమే వరుసగా గెలుపొందారు. కానీ, గంగుల మాత్రం 2018లోనే హ్యాట్రిక్ సాధించారు. తాజా, ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి బండి సంజయ్పై విజయం సాధించి, నాలుగోసారి జయకేతనం ఎగురవేశారు.
2000 సంవత్సరంలో మున్సిపల్ కౌన్సిలర్గా రాజకీయ జీవితం ప్రారంభించిన ఆయన, 23 ఏండ్ల కాలంలో ఓటమి ఎరుగని నేతగా ఎదిగారు. నాటి నుంచి నేటి వరకు ప్రతి ఎన్నికలోనూ విజయం అందుకుంటున్నారు. ఆయనను ఓడించేందుకు ఎన్నికల సమయంలో ప్రతిపక్ష పార్టీలు సోషల్ మీడియా వేదికగా లేనిపోని ఆరోపణలు చేస్తున్నా.. కుట్రలు, కుతంత్రాలు చేస్తూ విషం చిమ్ముతున్నా.. ప్రజలు మాత్రం గంగులకే పట్టం కడుతున్నారు. అతి పెద్ద నియోజకవర్గమైన కరీంనగర్ గడ్డపై వరుస విజయాలు అందుకోవడం అంతా ఆషామాషీకాదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రజా సేవ, పని తీరే ఆయనకు అండగా నిలుస్తున్నాయని చెబుతున్నారు.
కరీంనగర్, డిసెంబర్ 5 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : రాజకీయ జీవితంలో గెలుపోటములు సహజం. కానీ, గంగుల కమలాకర్ రాజకీయ చరిత్రలో మాత్రం అటువంటివి కనిపించవు. 23 ఏండ్ల సుదీర్ఘ రాజకీయ చరిత్రలో కౌన్సిలర్గా తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన ఆయన, ఆనాటి నుంచి నేటి వరకు ప్రతి ఎన్నికల్లోనూ విజయాన్ని సాధిస్తూ వచ్చారు. రాజకీయాల్లోకి ఆరంగేట్రం చేసిన తర్వాత వ్యాపారాన్ని పక్కన పెట్టిన ఆయన, ప్రజాసేవలోనే మునిగి తేలుతున్నారు. నిత్యం ప్రజల్లో ఉండడం, వారితో మమేకం కావడం, ‘అన్నా అంటే నేనున్నా’ అనే భరోసా ఇవ్వడం, సమస్య ఏదైనా సరే ప్రజల వద్దకు వెళ్లి పరిష్కరించడం, అభివృద్ధిని పరుగులు పెట్టించడం ఆయన నైజం.
ఉదయం నుంచి రాత్రి వరకు అందుబాటులో ఉండడమే కాదు, పార్టీలకు అతీతంగా ఎవరు ఏ సమయంలో ఫోన్ చేసినా.. రిసీవ్ చేసుకొని అవతలి వ్యక్తి సమస్యను విని పరిష్కరించడంలో ఆయనకు ఆయనే సాటి. వ్యాపార రంగం నుంచి రాజకీయ రంగంలోకి వచ్చినా.. కౌన్సిలర్ నుంచే ఆయన ప్రజల అభిమానం చూరగొంటూ వస్తున్నారు. ప్రతి ఎన్నికలోనూ ప్రజల ఆశీర్వాదంతో ఓటమి ఎరుగని నాయకుడిగా ప్రయాణం సాగిస్తున్నారు. కరీంనగర్ ఇందిరానగర్ నుంచి మొదటిసారిగా 2000 సంవత్సరంలో మున్సిపల్ కౌన్సిలర్గా పోటీ చేసి విజయం సాధించి, తన రాజకీయ ప్రస్థానం ప్రారంభించారు. ఆ తర్వాత 2005లో జరిగిన నగరపాలక సంస్థ ఎన్నికల్లో 14వ డివిజన్ నుంచి పోటీ చేసి కార్పొరేటర్గా విజయం సాధించడమే కాదు, టీడీపీ ఫ్లోర్ లీడర్గా కొనసాగారు. కౌన్సిలర్గా, కార్పొరేటర్గా సాధించిన విజయాలు, ప్రజలకు అందించిన సేవలు అతన్ని శాసనసభవైపు ప్రోత్సహించాయి. వరుసగా నాలుగు సార్లు ఎమ్మెల్యేను చేశాయి.
కరీంనగర్ గడ్డపై రికార్డు
కరీంనగర్ నియోజకవర్గ గడ్డపై గంగుల కమలాకర్ రికార్డు సృష్టించారు. ఈ నియోజకవర్గం ఏర్పడిన 1952 నుంచి ఇప్పటి వరకు నాలుగుసార్లు గెలిచిన వారు ఎవరూ లేరు. స్వర్గీయ జువ్వాడి చొక్కారావు కాంగ్రెస్ అభ్యర్థిగా 1957లో విజయం సాధించారు. ఆ తదుపరి 1962లో జరిగిన ఎన్నికల్లో కిషన్రెడ్డి వేరే పార్టీ నుంచి గెలిచారు. తిరిగి 1967,1972లో జరిగిన ఎన్నికల్లో వరుసగా చొక్కారావు కాంగ్రెస్ నుంచి గెలుపొందారు. ఆ లెక్కన చూస్తే ఆయన మూడుసార్లు విజయం అందుకున్నా రు. వరుసగా గెలిచింది మాత్రం రెండు సార్లే. కానీ, గంగుల కమలాకర్ మాత్రం వరుసగా నాలుగు సార్లు గెలిచి తొలి ఎమ్మెల్యేగా చరిత్ర సృష్టించారు.
2018 ఎన్నికల్లోనే హ్యాట్రిక్ సాధించి, వరుసగా మూడుసార్లు గెలిచిన ఎమ్మెల్యేగా రికార్డు సొంతం చేసుకున్నారు. మొదటిసారి 2009లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి 30,450 ఓట్ల మెజార్టీతో గెలిచిన గంగుల, అనంతరం తెలంగాణ ఉద్యమ సమయంలో టీడీపీని వీడి 2012లో గులాబీ పార్టీలో చేరారు. రాష్ట్ర ఏర్పాటు అనంతరం 2014లో జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి 24,750 ఓట్ల మెజార్టీతో రెండోసారి గెలిచారు. 2018 డిసెంబర్లో జరిగిన ఎన్నికల్లో 14,976 ఓట్ల మెజార్టీతో గెలిచి హ్యాట్రిక్ సాధించి కరీంనగర్ నియోజకవర్గ చరిత్రలోనే రికార్డు సృష్టించారు. తాజాగా జరిగిన ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి బండి సంజయ్పై 3,163 ఓట్ల మెజార్టీతోవిజయం సాధించి, నాలుగోసారి ఈ గడ్డపై నుంచి గెలిచిన తొలి ఎమ్మెల్యేగా చరిత్ర నెలకొల్పారు.
పనితీరుకు పట్టం
నిజానికి ఈ ఎన్నికల్లో కమలాకర్ను ఓడించడానికి ప్రతిపక్షాలు అంతర్గతంగా ఒక్కతాటిపైకి వచ్చాయి. సోషల్ మీడియా వేదికగా నిరాధారమైన ఆరోపణలు చేశా యి. భూములు కబ్జా చేశారని, అక్రమ గ్రానైట్ వ్యాపారం చేశారని, వక్ఫ్భూముల కబ్జా చేశారంటూ విష ప్రచారం చేశాయి. ఇలా ఎలాగైనా ఓడించేందుకు సర్వశక్తులూ ఒడ్డాయి. అయినా ప్రజలు ప్రతిపక్షాల మాయమాటలను విశ్వసించలేదు. గంగుల చేసిన అభివృద్ధితోపాటు నిరంతరం అందుబాటులో ఉండే వ్యక్తిగా కమలాకర్ను ప్ర జలు గుర్తించి, మరోసారి పట్టం కట్టారు. నిజానికి ఉమ్మడి జిల్లాలో హుస్నాబాద్ను క లుపుకొని 13 అసెంబ్లీ నియోజకవర్గాలుంటే, అందులో ఓటర్ల పరంగా చూస్తే అతి పె ద్ద నియోజకవర్గం కరీంనగరే.
ఈ నియోజకవర్గంలో 3,55,054 ఓట్లున్నాయి. ఏ నియోజకర్గంలోనూ ఇన్ని లేవు. అందులో పోస్టల్ బ్యాలెట్ కలుపుకొని మొత్తం 2, 29,774 ఓట్లు పోలయ్యాయి. గుంగులకు 92,179 (40.12) ఓట్లు రాగా, బీజేపీ అభ్యర్థి బండి సంజయ్కు 89,016(38.74) ఓట్లు వచ్చాయి. మొత్తంగా అతి పె ద్ద నియోజకర్గం కావడం, అందులోనూ నగర ఓటర్లే మెజార్టీశాతం ఉన్న ఈగడ్డపై నాలుగుసార్లు విజయం సాధించడం అంతా ఆషామాషీకాదని విశ్లేషకులు చెబుతున్నారు. పనితీరే గంగుల విజయాలకు అండగా నిలుస్తున్నదని స్పష్టం చేస్తున్నారు.