కరీంనగర్, మార్చి 21 (నమస్తే తెలంగాణ) : బీఆర్ఎస్ ఒక కుటుంబం లాంటి పార్టీ అని, కార్యకర్తలు సీఎం కేసీఆర్ బలగమైతే, ఆయన కార్యకర్తలకు బలమని మంత్రి గంగుల కమలాకర్ స్పష్టం చేశారు. మంగళవారం కరీంనగర్లోని వీ కన్వెక్షన్ హాల్లో జరిగిన జిల్లా స్థాయి కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. మనసులో కక్షలు పెట్టుకుని దూరం పెంచుకోవద్దని కోరారు. అదే సమయంలో పార్టీ క్రమ శిక్షణ ఉల్లంఘించిన వారిపై కఠినంగా వ్యవహరించక తప్పదని హెచ్చరించారు. లక్షల కోట్లు సంపాదించినా ఒక లక్ష్యాన్ని సాధించిన సంతృప్తి ఉండదని, ఆ లక్ష్యం కోసం పాటుపడిన సీఎం కేసీఆర్ తెలంగాణను సాధించి మనకు ఇవ్వడమే కాకుండా అహర్నిశలు శ్రమించి అభివృద్ధి చేస్తున్నారని తెలిపారు. ఈ అభివృద్ధి ఇలాగే కొనసాగాలంటే రాష్ట్రంలో ఎప్పటికీ బీఆర్ఎస్ పార్టీనే అధికారంలో ఉండాలని స్పష్టం చేశారు. తప్పిపోయి కాంగ్రెస్, బీజేపీకి అధికారం కట్టబెడితే రాష్ట్రం ఢిల్లీ చేతుల్లోకి వెళ్తుందని, భవిష్యత్తు అంధకారమవుతుందని సూచించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా సీఎం కేసీఆర్ పథకాలు అమలు చేస్తున్నారని, ప్రధాని మోదీ మాత్రం ఆడబిడ్డల ఉసురు పోసుకుంటున్నారని చెప్పారు. ఈడీ విచారణ పేరుతో మన ఆడబిడ్డ కవితను ఇబ్బందులకు గురి చేస్తున్నారని, తెలంగాణ ఆడబిడ్డల ఉసురు మోదీకి తప్పక తగులుతుందని హితవుపలికారు. కేసీఆర్ ఫాదర్ ఆఫ్ తెలంగాణ అయితే, కేటీఆర్ ఫ్యూచర్ ఆఫ్ తెలంగాణ అని అభివర్ణించారు. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో తాను ఎమ్మెల్యేగా ఉన్నపుడు కరీంనగర్ అభివృద్ధికి రూ.కోటి నిధులు ఇవ్వాలని బతిమిలాడితే వెకిలి నవ్వులు నవ్వారని, కేసీఆర్ దయతో ఇప్పుడు రూ.వంద కోట్లు తెచ్చుకుని కరీంనగర్ను అభివృద్ధి చేస్తున్నామని గుర్తు చేశారు. కేసీఆర్ లేని తెలంగాణను మనం ఊహించుకోలేమని, పార్టీకి తిరిగి ఓట్లు వేసేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని, అయితే మనమంతా ఒక్కతాటిపై ఉండి పార్టీకి అండగా ఉండాలని కార్యకర్తలను కోరారు. కరీంనగర్లో ఏప్రిల్ 2 నుంచి 14 లోపు ఆత్మీయ సమ్మేళనాలు పూర్తి చేసుకుందామని, అందరు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో నగర మేయర్ వై సునీల్రావు, పలు కార్పొరేషన్ల చైర్మన్లు సర్దార్ రవీందర్ సింగ్, బండ శ్రీనివాస్, కుర్మాచలం అనిల్ కుమార్, జడ్పీ వైస్ చైర్మన్ పేరాల గోపాల్రావు, మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్రావు, మాజీ ఎమ్మెల్యేలు ఆరెపల్లి మోహన్, కోడూరి సత్యనారాయణ, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పొన్నం అనిల్ కుమార్గౌడ్, కరీంనగర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రెడ్డవేని మధు, నాయకులు గెల్లు శ్రీనివాస్, చల్ల హరిశంకర్, ఎల్ రూప్సింగ్, అన్ని మండలాల ఎంపీపీలు, జడ్పీటీసీ సభ్యులు, ఎంపీటీసీ సభ్యులు, పార్టీ మండల శాఖ అధ్యక్షులు పాల్గొన్నారు.
గ్రామస్థాయిలో బలోపేతం చేద్దాం
బీఆర్ఎస్ను గ్రామ స్థాయిలో మరింత బలోపేతం చేద్దాం. ఏప్రిల్ 20 వరకు ఆత్మీయ సమ్మేళనాలు పూర్తి చేసుకోవాలి. ఏప్రిల్ 14న హైదరాబాద్లో అంబేద్కర్ విగ్రహాన్ని సీఎం కేసీఆర్ ఆవిష్కరిస్తారు. అదే రోజు దళిత కాలనీలు, గ్రామాలు, పట్టణాల చౌరస్తాల్లో అంబేద్కర్ జయంత్యుత్సవాలను ఘనంగా నిర్వహించాలి. ఏప్రిల్ 27న రాష్ట్ర స్థాయి సమ్మేళనం ఉంటుంది. 30న అంబేద్కర్ పేరుతో నిర్మించిన రాష్ట్ర సచివాలయాన్ని ముఖ్యమంత్రి ప్రారంభిస్తారు. జూన్ 1న అమర వీరుల స్థూపాన్ని ఆవిష్కరిస్తారు. ఆత్మీయ సమ్మేళనాలకు విద్యార్థులు, యువత, మహిళలను పెద్ద సంఖ్యలో తరలించాలి.
– బీఆర్ఎస్ జిల్లా ఇన్చార్జి బస్వరాజ్ సారయ్య
అలసత్వంగా ఉంటే మోసపోతాం
ప్రతి కార్యకర్తా క్రమ శిక్షణతో ఉండడం అవసరం. ప్రతిపక్షాలు చేస్తున్న అసత్య ప్రచారాలను ప్రజలు నమ్మకుండా గ్రామాలు, పట్టణాల్లో చర్చలు నిర్వహించాలి. అలాంటప్పుడే వాస్తవాలు ప్రజలకు తెలిసే అవకాశం ఉంటుంది. కొన్ని పార్టీలు చాపకింద నీరులా వస్తుంటాయి. ప్రతి కార్యకర్త ఎప్పటికప్పుడు వాటిని పసిగట్టాలి. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం తెలంగాణపై కక్షసాధింపు ధోరణితో ఉంది. కేంద్రం నుంచి నిధులు రాకున్నా సీఎం కేసీఆర్ రాష్ర్టాన్ని అభివృద్ధి చేస్తున్నారు. రాజకీయంగా, వ్యక్తిగతంగా ఎలాంటి సమస్యలు ఉన్నా కార్యకర్తలు మంత్రి గంగుల, ఎమ్మెల్యేల దృష్టికి తీసుకురావాలి. ప్రజలు మన పక్షాన ఉన్నారని కార్యకర్తలు అలసత్వంగా ఉంటే మోసపోయే ప్రమాదం ఉంటుంది.
రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్కుమార్
అంకితభావంతో పని చేయాలి
కార్యకర్తలు పార్టీకి అంకిత భావంతో పనిచేయాలి. జిల్లాలో నాయకులు, కార్యకర్తల మధ్య చిన్న చిన్న అభిప్రాయ బేధాలు ఉన్నా పరిష్కరించుకోవాలి. మన నాయకుల మధ్య మంచి సమన్వయం ఉన్నది. ఎవరి మధ్య అంతర్గత విబేధాలు లేవు. పార్టీ అధినేత కేసీఆర్ ఆదేశాలతో నిర్వహించనున్న ఆత్మీయ సమ్మేళనాలను విజయవంతం చేసేందుకు ప్రతి కార్యకర్తా కృషి చేయాలి.
– జీవీ రామకృష్ణారావు , బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు
కేసీఆర్ ఆలోచనల కోసం పనిచేద్దాం
కార్యకర్తలు, నాయకుల్లో ఎన్ని విబేధాలు ఉన్నా విడనాడి కేసీఆర్ కోసం, ఆయ న ఆలోచనల కోసం పనిచేయాలి. కార్యకర్తల్లో విబేధాలు సహజం. వాటిని అంతర్గతంగా చర్చించుకుంటేనే పార్టీకి మేలు. ఆత్మీయ సమ్మేళనాల్లో చర్చ కు తేవద్దు. అంతర్గతంగా చర్చించుకుని పరిష్కరించుకోవాలి. కార్యకర్తల్లో ఎలాంటి అసంతృప్తి ఉన్నా పరిష్కరించే బాధ్యతను నాయకులు తీసుకోవాలి. కేసీఆర్ను మరోసారి సీఎంను చేయడమే లక్ష్యంగా ప్రతి కార్యకర్త పనిచేయాలి.
– వొడితల సతీశ్కుమార్ , హుస్నాబాద్ ఎమ్మెల్యే
మహిళా ఓటర్లను ఆకట్టుకోవాలి
రాష్ట్ర సర్కారు మహిళా సంక్షేమానికి ప్రాధాన్యమిస్తున్నది. వారి కోసం ఎన్నో పథకాలు అమలు చేస్తున్నది. ఇది మనమంతా గుర్తుంచుకోవాలి. ఈ విషయాన్ని మహిళలకు వివరించాలి. మహిళా ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు, నాయకులు పార్టీ కోసం అంకిత భావంతో పనిచేసి మహిళా ఓటర్లను ఆకట్టుకునేలా కృషి చేయాలి. ఆత్మీయ సమ్మేళనాలకు మహిళలను పెద్ద సంఖ్యలో తరలించాలి.
– కనుమల్ల విజయ ,జడ్పీ అధ్యక్షురాలు
బీఆర్ఎస్ పుట్టుకలోనే పౌరుషం
బీఆర్ఎస్ పార్టీ పుట్టుకలోనే పౌరుషం ఉన్నది. తెలంగాణ కోసం పోరాడిన పార్టీకి రాష్ట్ర ప్రజలు రెండు సార్లు అధికారం ఇచ్చారు. అధికారంలోకి రాకముందే నిర్ణయించుకున్న మేనిఫెస్టోను అమలు చేసి రాష్ట్రంలో కనీవినిఎరుగని రీతిలో కేసీఆర్ అభివృద్ధి చేశారు. కార్యకర్తలు ఇగోలు, ద్వేషాలను పక్కన పెట్టి మనకు మనం సంస్కరించుకోవాలి. అన్ని పార్టీల కంటే మన బీఆర్ఎస్సే బలంగా ఉంది. అలాంటప్పుడు ఎంపీ ఎన్నికల్లో మన బలహీనతను ఆసరా చేసుకుని మరో పార్టీ గెలిచింది. అది ఆ పార్టీ బలం కానేకాదు. కేసీఆర్ లేకుం టే మనం లేము. అలాంటి కేసీఆర్ కుటుంబంపై కుట్రలు జరుగుతున్నాయి. అవీ కేసీఆర్ కుటుంబంపై జరిగే కుట్రలు కాదు. తెలంగాణ జాతిపై జరుగుతున్న దాడులు. వాటిని తిప్పికొట్టాల్సిన బాధ్యత ప్రతి కార్యకర్తపై ఉన్నది. వచ్చే ఎన్నికలు తెలంగాణ భవిష్యత్తు కోసం జరుగుతున్నవి. రాష్ట్రంలో ఒకే పార్టీ ఉన్నది. అది బీఆర్ఎస్సే.
– రసమయి బాలకిషన్ , మానకొండూర్ ఎమ్మెల్యే
అలసత్వంగా ఉంటే మోసపోతాం
పార్టీ నిర్మాణంలో ఉన్న కొద్ది మందిలో నేను ఒకడిని. కేసీఆర్తో అత్యంత సన్నిహితుల్లో ఒకడిగా ఉన్నా. అయినా ఏనాడూ పార్టీ లైన్ దాటి మాట్లాడలేదు. పార్టీలో క్రమ శిక్షణ ముఖ్యం. ప్రతి కార్యకర్తా క్రమ శిక్షణగా ఉండటం అవసరం. పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం కేసీఆర్ రోజుకు 18 గంటలు కష్టపడుతూ రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తున్నారు. అందుకే 70 ఏండ్లలో జరగని అభివృద్ధిని ఈ ఎనిమిదేండ్లలో చూస్తున్నాం. నేను ప్రణాళికా సంఘంలో సభ్యునిగా ఉన్నందున రాష్ర్టానికి వచ్చే, ఖర్చు చేసే ప్రతి పైసా నాకు తెలుసు. అప్పులు తెచ్చి రాష్ర్టాన్ని పాలిస్తున్నారని ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదు. తెచ్చిన అప్పులు సంక్షేమ పథకాలకు గానీ, చిన్న చిన్న అభివృద్ధి పనులకుగానీ వెచ్చించడం లేదు. ప్రతి పైసా ప్రాజెక్టులపై పెట్టుబడులు పెడుతున్న కారణంగానే ఇప్పుడు రాష్ట్రంలో ఆర్థిక వనరులు పెరిగాయి. తెచ్చిన అప్పులు 30 ఏండ్లలో తీర్చుకునే వెసులుబాటు ఉంటుంది. ప్రతిపక్షాలు చేస్తున్న అసత్య ప్రచారాలను ప్రజలు నమ్మకుండా గ్రామాలు, పట్టణాల్లో చర్చలు నిర్వహించాలి. అలాంటప్పుడే వాస్తవాలు ప్రజలకు తెలిసే అవకాశం ఉంటుంది. కొన్ని పార్టీలు చాపకింద నీరులా వస్తుంటాయి. ప్రతి కార్యకర్త ఎప్పటికప్పుడు వాటిని పసిగట్టాలి. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం తెలంగాణపై కక్షసాధింపు ధోరణితో ఉంది. కేంద్రం నుంచి నిధులు రాకున్నా సీఎం కేసీఆర్ రాష్ర్టాన్ని అభివృద్ధి చేస్తున్నారు. ఒకప్పుడు జైల్లో పుట్టిన జనతా పార్టీ 3 నెలల్లో 350 సీట్లు సాధించి నియంత పాలన సాగిస్తున్న ఇందిరాగాంధీని మట్టి కరిపించింది. ఇప్పుడు నరేంద్ర మోదీకి కూడా ఇందిరాగాంధీ గతే పడుతుంది. రాజకీయంగా, వ్యక్తిగతంగా ఎలాంటి సమస్యలు ఉన్నా కార్యకర్తలు మంత్రి గంగుల, ఎమ్మెల్యేల దృష్టికి తీసుకురావాలి. ప్రజలు మన పక్షాన ఉన్నారని అలసత్వంగా ఉంటే మోసపోయే ప్రమాదం ఉంటుంది.
– బోయినపల్లి వినోద్కుమార్, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు
అభివృద్ధి, సంక్షేమాన్ని చర్చించాలి
పది గ్రామాలను ఒక యూనిట్గా పెట్టుకుని ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించాలి. దేశంలో ఎక్కడా లేని విధంగా జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమాన్ని ప్రతి సమ్మేళనంలో చర్చకు పెట్టాలి. తెలంగాణలో ఉన్నట్టు గుజరాత్లో ఉచిత కరెంట్ ఎందుకు లేదు?, రైతుబంధు, రైతుబీమా, కల్యాణలక్ష్మి పథకాలు ఎందుకు లేవో ప్రజలకు వివరించాలి. కేంద్రంలో అధికారంలో ఉన్నామని బీజేపీ నాయకులు విర్రవీగుతున్నారు. కేసీఆర్ తన రాజకీయ అనుభవంలో ఇలాంటి వారిని ఎందరినో చూశారు. రాష్ట్రంలో అధికారంలోకి వస్తామని కలలుకంటున్న బీజేపీ నాయకులకు భంగపాటు తప్పదు. ఇక్కడ ఎంపీగా ఉన్న బండి సంజయ్కి మళ్లీ పోటీ చేస్తే డిపాజిట్ కూడా రాదు. హుజూరాబాద్లో పెద్ద లీడర్నని చెప్పుకుంటున్న ఈటల రాజేందర్ మళ్లీ గెలిస్తే నేను ముక్కు నేలకు రాస్తా. ప్రతి కార్యకర్త కేసీఆర్ కోసం పనిచేయాలి. ఆయనను దేశానికి ప్రధానిని చేయాలి.
– పాడి కౌశిక్రెడ్డి , శాసన మండలి విప్
ఇంటింటా ప్రచారం చేయాలి
అభివృద్ధి, సంక్షేమ పథకాలు మరోసారి బీఆర్ఎస్ను గెలిపిస్తాయి. ముచ్చటగా మూడోసారి కేసీఆర్ను సీఎంను చేస్తాయి. కేసీఆర్ అభివృద్ధి చేయని ఊరు లేదు. సంక్షేమ ఫలాలు అందని ఇల్లు లేదు. కే అంటే కాలువలు, సీ అంటే చెరువులు, ఆర్ అంటే రిజర్వాయర్లుగా కేసీఆర్ పేరు ఖ్యాతిఘటించింది. ఆయన ఖ్యాతిని మరింత ఇనుమడింపజేసి కార్యకర్తలు ఇంటింటా ప్రచారం చేయాలి. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు పేదలకు వ్యతిరేకంగా ఉంటున్నాయి. వినోద్కుమార్ ఎంపీగా ఉన్నప్పుడు తెచ్చిన కరీంనగర్ రైల్వే స్టేషన్ ఆర్వోబీ తాను తెచ్చానని ఇప్పటి ఎంపీ బండి సంజయ్ సిగ్గు లేకుండా చెప్పుకుంటున్నాడు. రాష్ట్రంలో కాలరెగిరేసి ఓటు అడిగే హక్కు ఒక్క బీఆర్ఎస్ కార్యకర్తలకే ఉన్నది.
– సుంకె రవిశంకర్ , చొప్పదండి ఎమ్మెల్యే