కమాన్చౌరస్తా, జూలై 3: జీవితపు లోతుల్లోంచే గంభీరమైన కవిత్వం వస్తుందని ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ పేర్కొన్నారు. నగరంలోని ఫిలిమ్భవన్లో తెలంగాణ రచయితల సంఘం ఆధ్వర్యంలో సోమవారం జరిగిన సాహితీవేత్త డాక్టర్ గండ్ర లక్ష్మణ్ రావు తండ్రి గండ్ర హన్మంత రావు పేరిట ఇచ్చిన స్మారక సాహితీ పురసారాల ప్రదానోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 2021సంవత్సరానికిగాను ‘జీవన హిందోళం’ పుస్తక రచయిత ఆచార్య గుమ్మన్నగారి బాల శ్రీనివాసమూర్తి తరఫున ఆయన కొడుకు గౌతమ్, 2022కు గాను ఝోళి పుస్తక రచయిత ఉస్మానియా విశ్వవిద్యాలయానికి చెందిన ఆచార్య సూర్యా ధనంజయ్కు మేయర్ వై సునీల్ రావుతో కలిసి పురస్కారాలు అందజేశారు. ఈ సందర్భంగా దేశపతి శ్రీనివాస్ మాట్లాడుతూ ఒక బలమైన వాక్యం రావాలంటే ఎంతో తపించాలని, ఆధునిక కవిత్వం మనిషి కేంద్రంగా వస్తున్నదన్నారు.
సులభంగా కనిపించేదాన్ని రాయడం కష్టమన్నారు. మేయర్ సునీల్ రావు మాట్లాడుతూ, కవులకు చిరునామా కరీంనగర్ అన్నారు. సాహితీ భవనం పూర్తి చేయించడం తన బాధ్యత అని వ్యాఖ్యానించారు. అనంతరం కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత వారాల ఆనంద్, రచయిత విశ్లేషకులు దాస్యం సేనాధిపతి, సాహితీ గౌతమి అధ్యక్షుడు నంది శ్రీనివాస్, కవి వజ్జల శివకుమార్, పురసార గ్రహీతలకు అభినందనలు తెలిపారు. ఝోళి పుస్తకాన్ని కోఠి మహిళా కళాశాల ప్రొఫెసర్ డాక్టర్ ఎం దేవేంద్ర, జీవన హిందోళం పుస్తకాన్ని డా. గండ్ర లక్ష్మణ్ రావు పరిచయం చేశారు. ఈ కార్యక్రమంలో అదనపు పాలనాధికారి శ్యాంప్రసాద్ లాల్, సంస్థ ప్రధాన కార్యదర్శి దుమ్మటి శంకర్ ప్రసాద్, గాజుల రవీందర్, అన్నవరం దేవేందర్, బొమ్మకంటి కిషన్, బీవీఎన్ స్వామి, ప్రేమ్ సాగర్ రావు, నీలగిరి అనిత, గంగుల శ్రీకర్, స్తంభం కాడి గంగాధర్, గజేందర్ రెడ్డి, పద్మశ్రీ ఉన్నారు.