Godavarikhani | కోల్ సిటీ, మార్చి 28 : గోదావరిఖని నగరంలోని రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతంగా సాగింది. కరీంనగర్లోని ప్రముఖ మెడికవర్ సూపర్ స్పెషాలిటీ దవాఖాన సహకారంతో శనివారం నిర్వహించిన ఈ వైద్య శిబిరంలో సుమారు 200 మంది వరకు హాజరయ్యారు. కాగా, ఆస్పత్రి జనరల్ ఫిజిషియన్ డాక్టర్ నాగరాజు, డాక్టర్ ప్రకాష్ హాజరై షుగర్, బీపీ, ఈసీజీ, 2-డీ ఈకో తదితర విలువైన వైద్య పరీక్షలను ఉచితంగా నిర్వహించి రోగ నిర్ధారణ చేసి మందులను పంపిణీ చేశారు.
ఆస్పత్రి సెంటర్ హెడ్ గుర్రం కిరణ్ మాట్లాడుతూ సామాజిక బాధ్యత కింద కోల్ బెల్టు ప్రజలకు సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందించాలనే ఉద్దేశంతో ఈ ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మెడికవర్ ఆస్పత్రిలో పండుగలు, సెలవులతో సంబంధం లేకుండా 24 గంటలు అన్ని వేళలా అన్ని రకాల మెరుగైన వైద్య సేవలు అందుబాటులో ఉంటాయన్నారు. ఈ కార్యక్రమంలో రెడ్డి సంఘం సభ్యులు జగన్ మోహన్రెడ్డి, దేవేందర్ రెడ్డి, తిరుపతి రెడ్డి, కరుణాకర్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.