మలిదశలోనూ నలుగురికీ సాయం చేస్తూ.. సామాజిక సేవలో ముందుండి ఆదర్శంగా నిలుస్తున్నారు వేములవాడలోని విశ్రాంత ఉద్యోగులు. సహచరులకు అవసరమైన వైద్య సేవలు ఉచితంగా అందిస్తూ మేమున్నామంటూ భరోసానిస్తున్నారు. అలుపెరగని సేవలందిస్తూ.. తోటివారికి అండగా నిలుస్తుండగా, వారిని పలువురు అభినందిస్తున్నారు.
వేములవాడ, డిసెంబర్16: పదవీ విరమణ అంటే బాధ్యతల్లో నుంచి తప్పుకొని ప్రశాంతంగా జీవించడమే అనేది అందరికీ తెలిసిన సత్యం. కానీ.. వేములవాడ పట్టణంలోని విశ్రాంత ఉద్యోగులు మలిదశలోనూ నలుగురికి సాయం చేస్తున్నారు. సహచరులకు అవసరమైన సేవలను అందిస్తూ, వారికి అన్నివిధాలా అండగా ఉంటున్నారు.
వేములవాడ సబ్ ట్రెజరీ కార్యాలయం పరిధిలోని వేములవాడ, చందుర్తి, రుద్రంగి, బోయినపల్లి మండలాలకు చెందిన విశ్రాంత ఉద్యోగుల సంఘం 2006లో ప్రారంభమైంది. ఎన్ రాజయ్యయాదవ్ అనే విశ్రాంత ఉద్యోగి నివాసంలోనే ఈ సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నారు. 17 సంవత్సరాలుగా సహచరులకు అవసరమైన సేవలను అందిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. 500మందితో ప్రస్తుతం ఈ విశ్రాంత ఉద్యోగుల సంఘం నడుస్తున్నది.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహించిన స్వచ్ఛభారత్లో కూడా విశ్రాంత ఉద్యోగులు తమ వంతు కృషి చేశారు. ప్రజలను చైతన్యవంతం చేయడమే కాకుండా, వారు కూడా స్వచ్ఛత కార్యక్రమాల్లో భాగస్వాములయ్యా రు. అలాగే విశ్రాంత ఉద్యోగులకు ఉచితంగా వైద్య సేవలు అందిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇప్పటికే 40సార్లు వేములవాడ పట్టణంలో ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేశారు. ఉప్పుగడ్డ ఆంజనేయస్వామి ఆలయ టీఎన్జీవో భవనంలో ఈ వైద్య శిబిరాలను ఏర్పాటు చేస్తూ, అవసరమైన వారికి ఉచితంగా మందులు అందిస్తున్నారు. దాదాపు 300మందికి కంటికి సంబంధించిన శస్త్ర చికిత్సలు చేయించారు.
పదవీ విరమణ పొందిన తోటి విశ్రాంత ఉద్యోగులను సన్మానిస్తున్నారు. ఏటా డిసెంబర్ 17న పెన్షనర్ డే సందర్భంగా సంఘంలోని సీనియర్ పెన్షనర్ను ఘనంగా సత్కరిస్తున్నారు. ఈ క్రమంలో ఆదివారం నిర్వహించే పెన్షనర్ డే సందర్భంగా విశ్రాంత ఉద్యోగులను ఆలయ టీఎన్జీవో సంఘంలోసన్మానించనున్నారు.
తమ సంఘంలోని సభ్యులకు అవసరమైన సహాయ, సహకారాలు అందిస్తున్నాం. పదవీ విరమణ పొందిన సమయంలో వచ్చే పెన్షన్, ఇతరత్రా కార్యాలయాల పనులను చక్కబెడతాం. ఆరోగ్యం బాగా లేనివారికి కూడా అవసరమైన వైద్య పరీక్షలను ఉచిత వైద్య శిబిరాల ద్వారా అందిస్తున్నాం.
– చల్ల సత్తయ్య యాదవ్, విశ్రాంత ఉద్యోగుల సంఘం ప్రధాన కార్యదర్శి (వేములవాడ)
ప్రతి సంవత్సరం పెన్షనర్ డే సందర్భంగా మా సంఘంలోని సీనియర్ పెన్షనర్లను సన్మానించుకుంటం.. మాకు మేమే.. గౌరవించుకొని అందరం కలిసికట్టుగా ఉంటం.. పదవీ విరమణ పొందిన 2016 నుంచి ప్రతి కార్యక్రమంలో నా వంతుగా సేవలు అందిస్తున్న..
– ఇప్పపూల దేవయ్య, విశ్రాంత ఉద్యోగి (వేములవాడ)
పదవీ విరమణ పొందినప్పటికీ సామాజిక సేవలో ప్రతి ఒక్కరం పాల్గొంటున్నం. స్వచ్ఛభారత్ వంటి కార్యక్రమాల్లో కూడా తమవంతు బాధ్యతను పంచుకుంటున్నం. ఇతర సామాజిక సేవలోనూ క్రమం తప్పకుండా హాజరవుతున్నం. రానున్న రోజుల సేవలను మరింత విస్తృతం చేస్తం.
– సిద్ధంశెట్టి రాజేశం, విశ్రాంత ఉద్యోగుల సంఘం కోశాధికారి (వేములవాడ)