తిమ్మాపూర్ రూరల్, నవంబర్ 18: పేదల సొంతింటి కల నేరవేరింది. తిమ్మాపూర్లో డబుల్ బెడ్రూం ఇండ్ల గృహప్రవేశం పండుగలా సాగింది. తిమ్మాపూర్లో 2.5కోట్లతో నిర్మించిన 50డబుల్ బెడ్రూం ఇండ్లను శుక్రవారం రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్మన్, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, కలెక్టర్ ఆర్వీ కర్ణన్లతో కలిసి రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ ప్రారంభించారు.
అనంతరం ఇండ్ల పట్టాలను అందజేయడంతో లబ్ధిదారులు ఆనందంలో మునిగిపోయారు. అంతకుముందు వినోద్కుమార్, రసమయికి మంగళహారతులతో స్వాగతం పలికారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కృషితోనే తమకు సొంతిండ్లు వచ్చాయని సంబురపడుతున్నారు. సీఎంతోపాటు వినోద్, రసమయికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఇండ్ల నిర్మాణానికి సహకరించిన ఎంపీపీ కేతిరెడ్డి వనితాదేవేందర్రెడ్డి, సర్పంచ్ దుండ్ర నీలిమారాజయ్య, కాంట్రాక్టర్ను అభినందించారు.
ఎమ్మెల్యే సారును జీవితంల మరువం
మా కుటుంబం మొత్తం కూలీ పని చేసుకుంటూనే జీవిస్తున్నం. 25ఏండ్ల కింద తిమ్మాపూర్ ఆనుకుని ఉన్న యాదవుల పల్లెల గుడిసె ఏసుకుని ఉన్నం. ఒకనాడు అటుకేలి పోయిన ఎమ్మెల్యే సారు మా గుడిసెను చూసి నీకు ఇళ్లు ఇత్త అన్నడు. మేం అప్పుడు నమ్మలేదు. కానీ ఇప్పుడు ఇల్లు అచ్చింది. మేము ఒక్క ఇంటోళ్లం అయినం. చానా సంబురంగా ఉన్నది. ఎమ్మెల్యే సారును జీవితంల మరువం.
–సూరపల్లి రాణి, లబ్ధిదారు.
రుణపడి ఉంట..
నా భర్త నాలుగేండ్ల కింద చనిపోయిండు. అప్పటి సంది ఇద్దరు ఆడపిల్లలను కూలీనాలీ చేసుకుంటూ చదివిస్తున్న. ఇప్పుడు నాకు డబుల్ బెడ్రూం ఇల్లచ్చింది. ఏ రంది లేదు ఇగ. ఏదో పని చేసుకుంటూ బతుకుత. ఏ ఆధారం లేని నాకు పెద్ద దిక్కు అయి ఇళ్లు ఇచ్చిన సీఎం కేసీఆర్కు, ఎమ్మెల్యే రసమయి ఎంపీపీ, సర్పంచ్ సార్లకు బతికనంతకాలం రుణపడి ఉంట.
–బిజిగిరి రజిత, లబ్ధిదారురాలు