పెద్దపల్లి, సెప్టెంబర్ 20 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర వ్యాప్తంగా 30 ఏండ్లు దాటి అసంక్రమిత జబ్బులతో బాధ పడే వారి కోసం సీఎం కేసీఆర్ నేతృత్వంలోని తెలంగాణ సర్కారు ‘నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్(ఎన్సీడీ)’ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టింది. వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో 2016లో పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, జనగాం, జయశంకర్ భూపాలపల్లి, హన్మకొండ జిల్లాల్లో పైలెట్ ప్రాజెక్టుగా తీసుకొని నిర్వహించింది.
ఇందులో భాగంగా సీహెచ్సీలు, పీహెచ్సీల పరిధిలోని వైద్య అధికారులు, సిబ్బంది, ఏఎన్ఎంలు, రెండో ఏఎన్ఎంలు, ఆశ కార్యకర్తలు ఇంటింటి సర్వే నిర్వహించి 30 ఏండ్లు నిండిన వారి ఆరోగ్య పరిస్థితిపై పూర్తి స్థాయిలో అధ్యయనం చేశారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఇబ్బందులను గుర్తించారు. వారి వయస్సుకు తగ్గట్టుగా ఉన్న బరువు, ఎత్తు, కుటుంబాల జీవన విధానం, ఆర్థిక పరిస్థితులు, తినే ఆహారం, శరీర చుట్టుకొలత, వారి వ్యసనాలు, మానసిక స్థితి గతులను గుర్తించారు.
తర్వాత అధికారయంత్రాంగం వివరాలన్నింటినీ కంప్యూటరీకరించింది. వారికి ఉన్న జబ్బుల ప్రకారం స్కోర్ ఇచ్చింది. 5 కంటే ఎక్కువ స్కోర్ ఉన్న వారిని ప్రమాదకరమైన స్థితిగా గుర్తించి వారికి వైద్య సేవలను అందిస్తున్నది. ఇందులో అసంక్రమితమైన బీపీ, షుగర్ వంటి వాటిని పరీక్షల ద్వారా గుర్తించి వారికి వారం, వారం, నెల నెలా వైద్య పరీక్షలు చేస్తూ అందుకు అనుగుణంగా ఉచితంగా మందులను పంపిణీ చేస్తున్నది. దీంతో 30 ఏండ్లు నిండిన వారు బీపీ, షుగర్, కేన్సర్ వంటి జబ్బుల బారిన పడి వైద్యానికి, మందులకు చేస్తున్న ఖర్చులను నిలువరించేందుకు ఉచితంగా మందులను అందిస్తున్నది.
ఈ కార్యక్రమం ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో అమలవుతున్నది. పెద్దపల్లి జిల్లాలో బీపీ, షుగర్ జబ్బులతో బాధపడేవారు మొత్తం 60,082 మంది ఉండగా, వీరిలో 42,218 మంది బీపీ, 17,864 మంది షుగర్ పేషెంట్లు ఉన్నట్లు సర్కారు గుర్తించింది. జిల్లా ఎన్సీడీ ప్రత్యేకాధికారి పీ. మధూకర్రెడ్డి పర్యవేక్షణలో వారందరికీ ప్రత్యేకంగా ఏఎన్ఎంలు, రెండో ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు, ఇతర ఆరోగ్య సిబ్బంది ఇంటింటికీ వెళ్లి బీపీ, షుగర్ మాత్రలను ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. ఈ కార్యక్రమం జిల్లా వ్యాప్తంగా ఏడేళ్లుగా విజయవంతంగా కొనసాగుతున్నది.
షుగర్ మందులు తీసుకుంటున్న
నాకు షుగర్ వచ్చి ఏడాదిన్నరైతంది. మొదట్ల రెండు, మూడు నెలలు గోదావరిఖనిల ప్రైవేట్గా మందులు కొని వాడుకునేది. అప్పుడు పైసలు ఉన్నప్పుడు కొనేది.. లేకుంటే ఆగేది. తర్వాత సర్కారు ఫ్రీగ చెక్ చేసి మందులు ఇస్తందని తెలుసుకున్న. అంబేద్కర్నగర్లోని పల్లె దవాఖాన్లనే షుగర్ మందులు తీసుకుంటున్న. ప్రతీ నెలా నాకు చెకప్ చేసి మందులు ఇస్తున్నరు.
– బీ దుర్గ, అంబేద్కర్నగర్, మంథని
నెల నెలా పరీక్షిస్తున్నాం
జిల్లాలో ఎన్సీడీ కార్యక్రమాన్ని ప్రారంభించిన తర్వాత మా సబ్సెంటర్లో ప్రతీ నెలా ఎన్సీడీ కిట్ ఇస్తున్నాం. ఇందులో బీపీ, షుగర్ వ్యాధి గ్రస్తులకు అవసరమైన మందులను ప్రభుత్వం ఉచితంగా ఇస్తున్నది. ఈ మందులను ప్రతీ నెలా వచ్చి ఎన్సీడీ రిజిస్ట్రేషన్ చేసుకున్నవారందరికీ షుగర్, బీపీ చెక్ చేసి మందులు ఇస్తున్నాం. దీంతో వారి రోగాలు అదుపులో ఉంటున్నయ్.
– దూస సంతోష, ఏఎన్ఎం పెద్దపల్లి
జాగ్రత్తలను వివరిస్తున్నాం..
ఎన్సీడీ కార్యక్రమంలో భాగంగా ఇంటింటికీ తిరిగి బీపీ, షుగర్ ఉన్న వారిని గుర్తిస్తున్నాం. వారికి ఎన్సీడీ కార్డు ఇచ్చి ఉచితంగా మందులను ఇస్తున్నాం. ముప్పై ఏండ్లు పైబడిన వారందరికీ పరీక్షలు చేస్తున్నాం. ఏదైనా అనారోగ్య సమస్యలు ఉంటే పీహెచ్సీకి గానీ, సీహెచ్సీకి గానీ తీసుకెళ్లి పరీక్షలు చేయిస్తున్నాం. బీపీ, షుగర్ నియంత్రణ కోసం ఆహారపు అలవాట్లు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వివరిస్తున్నాం.
– విలాసాగర్ మమత, ఆశా కార్యకర్త, పెద్దపల్లి
నాలుగైదేండ్ల నుంచి తీసుకుంటున్న
నాలుగైదేండ్ల నుంచి నేను షుగర్తో బాధ పడుతున్న. ఇంతక ముందు ప్రైవేట్ల చూపించుకునేది. ఇక్కడ ఎన్సీడీ అని కిట్లు ఇచ్చుడు మొదలు పెట్టిన కాన్నుంచి ఇక్కడే నెల నెలా షుగర్ టెస్ట్ చేయించుకుంటున్న. ఇక్కడే మందులు ఉచితంగ తీసుకుంటున్న. షుగర్ పెరిగినప్పుడు ఎక్కువ డోస్వి, తగ్గినప్పుడు తక్కువ డోస్ మందులు ఇస్తున్నరు. ఎప్పుడన్నా చేతకాకుండా ఇంటికాన్నే ఉంటే ఇంటికి కూడా వచ్చి చూసి మందులు ఇస్తున్నరు. ఎన్సీడీతోనే మాకు మేలైంది.
– నూతి ఉత్తరమ్మ, కమ్మరివాడ పెద్దపల్లి
ప్రతీ ఒక్కరినీ ఫాలోఅప్ చేస్తున్నాం
ఎన్సీడీ కార్యక్రమాన్ని ప్రభుత్వం 2016 నుంచి జిల్లాలో పైలెట్ ప్రాజెక్టుగా అమలు చేస్తున్నది. కలెక్టర్ ముజామిల్ఖాన్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ప్రమోద్కుమార్ నిరంతర పర్యవేక్షణలో ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్నాం. బీపీ, షుగర్ బారిన పడిన వారందరికీ నెల నెలా వైద్య పరీక్షలు నిర్వహించేలా.. ఉచితంగా మందులు అందించేలా కంప్యూటరీకరణ చేసి సిబ్బందితో ఫాలో అప్ చేస్తున్నాం. ప్రతీ ఒక్కరినీ సందర్శించి వారి ఆరోగ్య స్థితి గతులను తెలుసుకుటున్నాం. వారికి సిబ్బంది ఉచితంగా మందులను పంపిణీ చేస్తున్నరు.
– పీ. మధూకర్రెడ్డి, ఎన్సీడీ ప్రత్యేకాధికారి, పెద్దపల్లి
ప్రతి నెలా వంద మందికి పైగా సేవలందిస్తున్నాం
పట్టణంలోని అంబేద్కర్నగర్లో ప్రభుత్వం ఏర్పాటు చేసిన పల్లె దవాఖానలో అర్బన్, రూరల్ మొత్తం కలిపి దాదాపు 100 మందికి పైగా వైద్య సేవలందిస్తున్నాం. ఇందులో దాదాపు 60 మంది బీపీ, 40 మంది షుగర్ వైద్య సేవలను పొందుతున్నరు. ప్రతీ నెలా వీరికి వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత లెవల్స్ ఆధారంగా సరిపడా మోతాదులో మందులు ఇస్తున్నాం. షుగర్, బీపీ వచ్చిన వారి సమాచారం వెంట వెంటనే సేకరిస్తున్నాం. ఎవరైనా మందుల కోసం రాక పోతే వారికి ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చి మందులు తీసుకునేలా చర్యలు తీసుకుంటున్నాం.
– రేపాక శ్రావణి, స్టాఫ్ నర్సు, అంబేద్కర్నగర్ పల్లెదావఖాన, మంథని
పైసా ఖర్చు లేకుండా మందులు తీసుకుంటున్న
నాకు పదేండ్ల కిందనే బీపీ వచ్చింది. అప్పటి నుంచి మంథనిలోని ప్రైవేట్ మెడికల్ షాపులల్లనే నెల నెలా మందులు కొనుక్కొని వాడేదాన్ని. తెలంగాణ సర్కారు నాలాంటి పేదోళ్లను గుర్తించి వైద్యం అందిస్తున్నరు. మా ఇంటి దగ్గర ఉన్న పల్లె దవాఖానలోనే నాలుగు నెలల నుంచి ఒక్క రూపాయి ఖర్చు లేకుండనే మందులు తీసుకుంటున్న. ప్రతీ నెలా నాకు చెకప్ చేసి బీపీ మందులు ఇస్తున్రు.
– బొడ్డెల పోచమ్మ, అంబేద్కర్నగర్, మంథని