కార్పొరేషన్, ఫిబ్రవరి 1: వరల్డ్ క్యాన్సర్ డే సందర్భంగా ఈ నెల 4 నుంచి 7వ తేదీ వర కు కరీంనగర్లో ఫ్రీ క్యాన్సర్ చెకప్ క్యాంపు నిర్వహిస్తున్నారు. మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమా ర్ ఆధ్వర్యంలో ప్రతిమ, చల్మెడ క్యాన్సర్ ఇనిస్టిట్యూట్స్ సహకారంతో గాంధీరోడ్లోని టీటీడీ కల్యాణమండపంలో ఏర్పాటు చేయనున్న ఈ క్యాంపులో మహిళలకు క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు ఉచితంగా చేయనున్నారు. వ్యాధి లక్షణాలు, నివారణపై అవగాహన కల్పించనున్నారు.
కరీంనగర్ ప్రతిమ హోటల్లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మేయర్ సునీల్రావు, వినోద్ సతీమణి డాక్టర్ బోయినపల్లి మాధవి, డిప్యూటీ మేయర్ చల్ల స్వరూప వివరాలు వెల్లడించారు. క్యాంపు నిర్వహణపై మహిళా కార్పొరేటర్లు, బీఆర్ఎస్ మహిళా నేతలకు దిశానిర్దేశం చేశారు. మహిళలు ఈ అవకాశాన్ని వినియోగించుకొనేలా చూడాలని కోరారు. రేడియాలజీ విభాగం, కల్పోసోపి, పాప్ స్మియర్, మామోగ్రఫీ, రొమ్ము క్యాన్సర్ పరీక్ష, గైనిక్ క్యాన్సర్ పరీక్ష, ఎక్స్-రే లాంటి టెస్ట్లు చేస్తారని చెప్పారు.