కలెక్టరేట్, సెప్టెంబర్ 11: తమను గెలిపిస్తే తలరాతలు మార్చుతామంటూ మాయ మాటలతో మభ్యపెట్టి, మోసం చేసిన వారికి ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని మేయర్ యాదగిరి సునీల్రావు ప్రజలకు పిలుపునిచ్చారు. నగరంలోని 26వ డివిజన్లో సోమవారం ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మేయర్ యాదగిరి సునీల్రావు మాట్లాడుతూ, ఎలాంటి అభివృద్ధి పనులు చేయకుండా అధికారం కోసం తహతహలాడే పార్టీల నాయకులు మరోసారి తెరమీదకు రాబోతున్నారని, కాంగ్రెస్, బీజేపీ నాయకులనుద్దేశించి విమర్శించారు. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ఎంపీగా గెలిచిన బండి సంజయ్ నాలుగున్నరేళ్లలో నగరానికి చేసిందేమిటో చెప్పాలని డిమాండ్ చేశారు.
నగర ప్రజలను మరిచిపోయాడని, ఇక్కడ చేపట్టాల్సిన అభివృద్ధిని విస్మరించాడని ధ్వజమెత్తారు. గెలిచిన నాటి నుంచి ఏరోజు కూడా ప్రజలకు అందుబాటులో లేకుండా నమ్మి ఓట్లేసిన ప్రజలను మోసం చేశాడని తీవ్రస్థాయిలో దుయ్యబట్టారు. నగరంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు కూడా పట్టించుకోవడంలేదని ఆరోపించారు. ప్రజలను భ్రమల్లో ఉంచి ఓట్లు దండుకోవడమే ఆ రెండు పార్టీల నైజమని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ పార్టీ ప్రజల మధ్యలో ఉంటూ, ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పని చేస్తోందన్నారు. ఏ ఆపదొచ్చినా నేనున్నానంటూ ముందుకొచ్చి, ఆదుకునేందుకు కృషి చేసేది బీఆర్ఎస్ మాత్రమేనని స్పష్టం చేశారు. వీటన్నింటినీ ప్రజలు బేరీజు వేసుకుంటున్నారని, అభివృద్ధి కోసం అహర్నిశలు పాటుపడుతున్న వారిని నగరవాసులు గుర్తించే సమయం ఆసన్నమైందన్నారు. పదేళ్ల కాలంలో బీఆర్ఎస్ పాలనలో చేపట్టిన అభివృద్ధి పనులతో నగర రూపురేఖలు మారిపోయాయని చెప్పారు.
నగరంలో అభివృద్ధి పనులు చేపట్టేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ రూ.2 వేల కోట్లు విడుదల చేసినట్లు వెల్లడించారు. మంత్రి గంగుల కమలాకర్, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ కృషితో నగరంలో ఊహించని స్థాయిలో అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయన్నారు. నగరంలో అభివృద్ధి జరుగాలంటే మరోసారి మంత్రి గంగుల కమలాకర్ను ఎమ్మెల్యేగా, వినోద్కుమార్ను పార్లమెంట్ సభ్యుడిగా గెలిపించుకోవాలని కోరారు. 26వ డివిజన్ను అభివృద్ధి చేసేందుకు పెద్ద మొత్తంలో నిధులు కేటాయించనున్నట్లు పేర్కొన్నారు. గతంలో వేసిన సీసీ రోడ్లు పూర్తిగా ధ్వంసం కాగా, కొత్తగా నిర్మించేందుకు ప్రతిపాదనలు సంబంధిత కార్పొరేటర్ నుంచి స్వీకరించినట్లు తెలిపారు. అలాగే, ప్రతి వీధిలో మురుగు కాలువలు నిర్మించనున్నట్లు చెప్పారు.
నాకా చౌరస్తా నుంచి ఎల్ఐసీ భవనం వరకు సీసీ రోడ్డు నిర్మాణానికి భూమి పూజ చేశామని, నాకా చౌరస్తా నుంచి బొమ్మ వెంకన్న ఇంటివరకు ఉన్న ప్రధాన రహదారి, ఎన్ఎన్ గార్డెన్ రోడ్డు కూడా నూతనంగా నిర్మిస్తున్నామన్నారు. అంతర్గత రహదారులకు సంబంధించి ప్రతిపాదనలు కూడా తీసుకున్నామని, త్వరలోనే పనులు ప్రారంభించనున్నట్లు తెలిపారు. నగరంలో చేపట్టిన అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయని, ఈ ప్రగతి ప్రజ్వరిల్లుతూ భావితరాలకు అందమైన కరీం‘నగరాన్ని’ కానుకగా ఇచ్చేందుకు మంత్రి గంగుల కమలాకర్, వినోద్కుమార్ను భారీ మెజార్టీతో గెలిపించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు నక్క పద్మ, తోట రాములు, నాంపల్లి శ్రీనివాస్, వంగల శ్రీదేవి-పవన్కుమార్, సుధగోని మాధవీకృష్ణాగౌడ్, కాలనీవాసులు, బీఆర్ఎస్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.