కోనరావుపేట, మే 1: స్వరాష్ట్రంలోనే సుస్థిర అభివృద్ధి జరుగుతున్నదని ఎమ్మెల్యే రమేశ్బాబు స్పష్టం చేశారు. కోనరావుపేట మండలంలోని పలు గ్రామాల్లో జడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణతో కలిసి పర్యటించారు. నాగారంలో కోదండ రామస్వామి ఆలయంలో ఆలయ పున:ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొని పూజలు చేశారు. అలాగే మండల కేంద్రంలో రూ.కోటి 34లక్షల విలువైన కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేసి మాట్లాడారు. సీఎం కేసీఆర్ అనేక పథకాలతో పేదలకు అండగా నిలుస్తున్నారని చెప్పారు. పేదిం టి ఆడబిడ్డల వివాహానికి కల్యాణ లక్ష్మి పథకం కింద సాయం చేస్తున్నారని, కోనరావుపేటలో ఇప్పటివరకు 1658 మంది ఆడబిడ్డల వివాహానికి రూ.15.43 కోట్లు అందించినట్లు చెప్పారు.
మల్కపేట రిజర్వాయర్తో ఈ ప్రాంతం సస్యశ్యామలం కానున్నదని, ఇప్పటికే 90శాతం పనులు పూర్తయి ప్రారంభానికి సిద్ధమవుతున్నదని చెప్పారు. మరిమడ్లలో అదొనై చర్చి నిర్మాణానికి రూ.18లక్షలు మంజూరు కాగా, భూమి పూజ చేసి పనులు ప్రారంభించారు. అనంతరం రూ.9కోట్లతో మరిమడ్ల నుంచి మానాల దాకా తారు రోడ్డు నిర్మాణానికి, రూ.20లక్షలతో గ్రామపంచాయతీ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. కొండాపూర్లో రూ.5 కోట్లతో హైలేవల్ బ్రిడ్జి పనులు, రూ.80లక్షలతో నిమ్మపల్లి, కొండాపూర్ తారు రోడ్డు మరమ్మతులను ప్రారంభించారు. రూ.50లక్షలతో కొండాపూర్ కమాన్ మధ్యలో రెండు హైలెవల్ బ్రిడ్జి పనులకు శంకుస్థాపన చేశారు.