కరీంనగర్, డిసెంబర్20 (నమస్తే తెలంగాణప్రతినిధి) : ‘కేసీఆర్ ప్రభుత్వ హయాంలో చేసిన అప్పులకంటే, సృష్టించిన ఆస్తుల విలువే అధికంగా ఉన్నది. కానీ, కాంగ్రెస్ నాయకులు ఎన్నికల్లో అబద్ధాలు చెప్పినట్టే.. ప్రభుత్వంలోనూ వాస్తవాలు వక్రీకరిస్తున్నరు. కేసీఆర్ను ప్రజల్లో అబాసుపాలు చేసేందుకు ప్రయత్నిస్తున్నరు’ అని మాజీ ఎంపీ వినోద్కుమార్ ధ్వజమెత్తారు. ఇప్పటికైనా అప్పుల గురించి చెప్పినప్పుడు.. వాటి ద్వారా సమకూరిన ఆస్తుల వివరాలను వెల్లడించాలని డిమాండ్ చేశారు. అంతే తప్ప ఎన్నికల సమయంలో అబద్ధాలు చెప్పినట్టు ఇప్పుడు అలాగే చేస్తే ఎవరూ ఊరుకోరని స్పష్టం చేశారు.
కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ప్రతిమ హోటల్లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం గత ఎన్నికల్లో అనేక హామీలు ఇచ్చిందని, అయితే ఆరు గ్యారంటీలను ముందు పెట్టి అందులో రెండింటినీ అమలు చేశామని పచ్చి అబద్ధాలు చెబుతున్నదని మండిపడ్డారు. నిజానికి ఆరు గ్యారంటీల్లోని మహాలక్ష్మీ పథకం కింద కేవలం ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించారన్నారు. ఇదే పథకం కింద ఇంకా మహిళలకు నెలకు 2500 ఇవ్వడంతోపాటు 500కే గ్యాస్ సిలిండర్ ఇవ్వాల్సి ఉందన్నారు.
రైతు భరోసా కింద రైతులకు సహాయం చేస్తున్నట్లు చెబుతున్నారని, కానీ కౌలు రైతులకు ఎకరాకు 15వేలు, అలాగే వ్యవసాయ కూలీలకు 12వేలు, వరి పంటకు 500 బోనస్ ఇంకా అమలు చేయలేదన్నారు. పేరుకు ఆరు గ్యారంటీలు అని కనిపిస్తున్నా, అందులో 13 హామీలు ఉన్నాయని, వాటన్నింటినీ అమలు చేయాల్సి ఉందన్నారు. ఈ విషయం చెప్పకుండా ఆరు గ్యారంటీల్లో రెండు అమలు చేశామంటూ ప్రచారం చేసుకుంటున్న తీరును ప్రజలు గమనిస్తున్నారని విమర్శించారు. వంద రోజుల తర్వాత ప్రజలు తప్పకుండా హామీలపై కాంగ్రెస్ నాయకులను నిలదీస్తారని పేర్కొన్నారు.
ఈ పథకాలను అమలు చేసే అంశంపై దృష్టి పెట్టాల్సిన కాంగ్రెస్, ఇప్పుడు కేసీఆర్ సర్కారు అప్పులు చేసిందంటూ అబాసు పాలుచేసే ప్రయత్నం చేస్తున్నదని దుయ్యబట్టారు. నోరు తెరిస్తే చాలు అప్పు అప్పు అని అరుస్తున్న ఆ పార్టీ, మరి ఆ అప్పు ఎందుకు చేశారు? వాటి ద్వారా చేకూరిన ప్రయోజనాలు ఏమిటీ? నాటి తెలంగాణకు నేటికి పరిస్థితుల్లో వచ్చిన మార్పులు ఏమిటీ? పెట్టిన ఇన్వెస్ట్ వల్ల పెరిగిన ఆస్తులెన్ని? అనే వివరాలను ప్రకటిస్తే ప్రజలకు వాస్తవాలు తెలుస్తాయన్నారు. కానీ, ఇవేవి లేకుండా కేవలం అప్పులు, అప్పులు అంటూ దుష్ప్రచారం చేయడం సరికాదన్నారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణరావు, మేయర్ సునీల్రావు, పట్టణ అధ్యక్షుడు హరిశంకర్, నాయకులు ఏనుగు రవీందర్రెడ్డి, పొన్నం అనిల్కుమార్, చొక్కారెడ్డి, జక్కుల నాగరాజు, సంపత్ ఉన్నారు.
2014లో రాష్ట్ర జీఎస్డీపీ 5.5 లక్షలకోట్లు. 2023 నాటికి అది 13.13కోట్లకు పెరిగింది. నాడు తలసరి ఆదాయం 1,24,104 ఉంటే 2023లో 151.7 శాతం పెరిగి 3,12,398కి చేరింది. ఇది వాస్తవం కాదా..? సేల్స్ టాక్స్ వసూళ్లు 2014లో 72,564కోట్లు కాగా, స్వరాష్ట్రంలో 161 శాతం వృద్ధితో 2023 నాటికి 72,564 కోట్లకు చేరింది. మిషన్ కాకతీయ కింద 5,464 కోట్లతో 21,633 చెరువులను పునరుద్ధరించడం వల్ల 8.50 టీఎంసీలసామర్థ్యం పెరిగింది. 15.05 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ జరిగింది. దీనిపై ఖర్చు పెట్టకపోతే, ఈ రోజు ఈ ఫలాలు ప్రజలకు అందేవా..? రాష్ట్రంలో 33 జిల్లాలు ఏర్పాటు చేశాం. 30 జిల్లాల్లో 1649కోట్లతో కొత్త కలెక్టరేట్లు నిర్మించాం. కొత్తగా 8,578 కిలోమీటర్ల మేర రోడ్లు వేశాం. ఇవన్నీ కండ్ల ముందే ఉన్నాయి.
కాంగ్రెస్ నాయకులకు కనిపించడం లేదా..? 2014కు ముందు 293 గురుకులాలు ఉంటే వాటి సంఖ్య ప్రస్తుతం 1022కి పెరిగింది. ‘మన ఊరు- మన బడి’ మొదటి విడుత కింద 3497కోట్లతో పనులు చేశాం. హరితహారం కింద 19,822 కోట్లతో 283.71 కోట్ల మొక్కలు నాటితే, ప్రస్తుతం వాటి ఫలితం విలువ 211 లక్షల కోట్లకు చేరింది. తెలంగాణ వచ్చిన కొత్తలో సర్కారు దవాఖానల్లో 17,400 బెడ్స్ ఉంటే, వాటిని 34వేలకు పెంచాం. ఐసీయూ కేంద్రాలను 5 నుంచి 80కు, బ్లడ్ బ్యాంకులను 28 నుంచి 56కు, డయాలసిస్ కేంద్రాలను 5నుంచి 82కు పెంచాం. హైదరాబాద్ను హెల్త్ హబ్గా మార్చాం. తొమ్మిదిన్నరేండ్ల ముందు 3 మెడికల్ కాలేజీలుంటే.. 2023 నాటికి 33 చేరుకున్నాయి.
అలాగే ఎంబీబీఎస్ సీట్ల సంఖ్య 2850 నుంచి 8,515కు, అలాగే ప్రభుత్వ పరంగా చూస్తే 850 నుంచి 3,915కు పెరిగాయి. ప్రభుత్వ పీజీ సీట్లను 515నుంచి 1320కి పెంచాం. ఇవేకాదు 585 కోట్లతో పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్, 9 కమిషనరేట్ల ఏర్పాటు చేశాం. 5వేల వాహనాలను 20వేలకు పెంచాం. శాంతిభద్రతలు కట్టుదిట్టంగా ఉన్న ప్రాంతానికే పరిశ్రమలు తరలివస్తాయన్న ఉద్దేశంతో చర్యలు తీసుకుంటే.. ఇక్కడ కూడా వాళ్లకు అప్పులే కనిపించాయి? కాళేశ్వరం పథకం, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం వంటి ఎన్నో ప్రాజెక్టులను పూర్తి చేశాం. ఇంకా విద్యుత్రంగంలో పెను మార్పులు తెచ్చాం. అందులో కల్పించిన మౌలిక సదుపాయాల వల్లే 24 గంటల కరెంటు ఇవ్వగలుగుతున్నాం.
2014 నాటికి కేవలం 7,778 మెగావాట్ల విద్యుత్ సామర్థ్యం ఉంటే, అది ప్రస్తుతం 19,464కు పెరిగింది. నాడు 5661 మెగావాట్ల గరిష్ఠ విద్యుత్ వినియోగం ఉంటే నేడు 15,497 యూనిట్లకు పెరిగింది. వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ల సంఖ్య 19,05 లక్షల నుంచి 27.87 లక్షలకు చేరింది. నిజంగా నీళ్లు లేకపోయి ఉంటే.. ఇన్ని కనెక్షన్లు ఎందుకు పెరుగుతాయి. అలాగే పాత వాటితోపాటు పెరిగిన కనెక్షన్లకు నిరంతరం నాణ్యమైన విద్యుత్ ఇస్తున్నామంటే.. అందుకు ఎన్ని వేల కోట్లు పెట్టుబడిపెట్టాల్సి వస్తుందో ప్రజలు అర్థం చేసుకోవాలి. వీటన్నింటిలో కాంగ్రెస్ నాయకులకు అప్పులే కనిపిస్తున్నాయా..? ఆస్తులు కనిపించడం లేదా..? ప్రతి రంగాన్ని అభివృద్ధి చేసేందుకు కేసీఆర్ సర్కారు అప్పులు తెస్తే.. వాటిద్వారా కలిగిన ప్రయోజనాల గురించి ఎందుకు చెప్పకుండా అసత్య ప్రచారం చేయడం మంచి పద్ధతి కాదు.
– వినోద్ కుమార్