కరీంనగర్, మానకొండూర్ నియోజకవర్గాల బీఆర్ఎస్ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశాలకు హాజరుసీఎం రేవంత్రెడ్డి ఇంకా ఓ పార్టీ అధ్యక్షుడిగానే ఉన్నడు. స్థాయి మరిచి ప్రవర్తిస్తున్నడు. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి మాట్లాడాల్సిన మాటాలేనా..? అబద్ధపు పునాదుల మీద ఏర్పడిన నీ ప్రభుత్వానికి పాలన చేతకాదు.
కరీంనగర్, ఫిబ్రవరి 5 (నమస్తే తెలంగాణ)/ తిమ్మాపూర్ : పార్లమెంట్ ఎన్నికల్లో కలిసి కట్టుగా పనిచేద్దామని, బీఆర్ఎస్ను గెలిపిద్దామని గులాబీ శ్రేణులకు మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్కుమార్ పిలుపునిచ్చా రు. ప్రజలను ఎన్నికలకు సన్నద్ధం చేయాలని సూచించారు. ఎన్నికల్లో గెలుపోటములు సహజమని, ఇపుడు మనం మళ్లీ గెలిచి తీరుతామని ధీమా వ్యక్తం చేశారు. సోమవారం రేకుర్తిలోని ఓ గార్డెన్, అల్గునూర్లోని ఓ ఫంక్షన్ హాల్లో వేర్వేరుగా జరిగిన కరీంనగర్, మానకొండూర్ నియోజకవర్గాల బీఆర్ఎస్ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశాలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై దిశానిర్దేశం చేశారు. కాంగ్రెస్, బీజేపీ వైఫల్యాలను ఎండగట్టాలని, వాస్తవాలను ప్రజలకు వివరించాలని కార్యకర్తలకు నిర్దేశించారు. తాను పక్కా లోకల్ అని ప్రకటించుకున్న ఎంపీ బండి సంజయ్కు దిమ్మతిరిగే సమాధానం ఇచ్చారు.
సంజయ్ పుట్టకముందే తాను కరీంనగర్లో పుట్టానని, ఐదు జిల్లాల పరిధిలో ఉన్న కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని వాడినేనని స్పష్టం చేశారు. పొన్నం ప్రభాకర్, నరేంద్ర మోడీ, స్మృతి ఇరానీ ఎక్కడి నుంచి పోటీచేసి గెలిచారు? ఇటలీలో పుట్టిన సోనియా గాంధీ ఇండియా కోడలు కాలేదా..? అని ప్రశ్నించారు. సంజయ్కి అభివృద్ధి చేయడం చేతగాదని, కరీంనగర్కు ఇప్పటి వరకు ఐదు రూపాయలు తెచ్చింది లేదని, ఇలాంటి రెచ్చగొట్టే మాటలకు మాత్రం కొదువ లేదని మండిపడ్డారు. తాను ఎంపీ అయిన తర్వాత ఐదేళ్లలో 160 ప్రశ్నలు అడిగానని, 106 సార్లు మాట్లాడనని చెప్పారు. ప్రధాని మోడీని, కేంద్ర మంత్రులను కలిసి రాష్ర్టానికి నిధులు, కరీంనగర్ స్మార్ట్ సిటీ, జాతీయ రహదారి తెచ్చానని గుర్తు చేశారు. కానీ, అధికార పార్టీలో ఉన్న బండి సంజయ్ ఈ ఐదేళ్లలో ఏం చేశారని నిలదీశారు.
జిల్లాకో ఒక నవోదయ పాఠశాలను ఏర్పాటు చేయాలని హక్కుగా ఉన్నా తేలేదని మండిపడ్డారు. ఇది ఆయన అసమర్థతేనని విమర్శించారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడంలో విఫలమవుతున్నని, ప్రజల్లో బీఆర్ఎస్కు సానుకూల పరిస్థితి కనిపిస్తున్నదని తెలిపారు. చేసిన అభివృద్ధిని గ్రామాల్లో చెప్పకపోవడంతోనే బీఆర్స్ ప్రభుత్వం చేజారిపోయిందని చెప్పారు. అబద్ధపు పునాదుల మీద గెలిచిన కాంగ్రెస్ ప్రభుత్వంపై ఇప్పటికే ప్రజలకు విరక్తి కలుగుతున్నదని చెప్పారు. పార్లమెంట్లో తెలంగాణ సమస్యలపై ప్రశ్నించే గొంతుక ఉండాలన్నారు. తాను ఎంపీగా ఉన్నప్పుడు చేసిన అభివృద్ధి.. ప్రస్తుత ఎంపీ చేసిన అభివృద్ధిపై గ్రామాల్లో చర్చ పెట్టాలని సూచించారు.
తెలంగాణ ప్రభుత్వం లక్షా 60 వేల ఉద్యోగాలు ఇచ్చినా, దానిని ప్రచారం చేసుకోకపోవడం వల్లే యువతలో వ్యతిరేకత భావం ఏర్పడిందని చెప్పారు. ఇదే అదునుగా కాంగ్రెస్ అబద్ధాలు ప్రచారం చేసి గెలిచిందని విమర్శించారు. ఆ ప్రభుత్వం ఈ యేడాది చివరి వరకు రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిందని, ఇంకా ఎన్నో హామీలు ఇచ్చిందని గుర్తు చేశారు. ఇచ్చిన ఏ ఒక్క హామీ నెరవేర్చకున్నా వదిలేది లేదని, అవి అమలయ్యేదాకా ప్రభుత్వంపై పోరాడుతామని హెచ్చరించారు. కరీంనగర్లో జడ్పీ చైర్పర్సన్ కనుమల్ల విజయ, మేయర్ వై సునీల్రావు, ఎంపీపీలు లక్ష్మయ్య, పిల్లి శ్రీలత, కొత్తపల్లి మున్సిపల్ చైర్మన్ రుద్ర రాజు, నాయకులు చల్ల హరిశంకర్, పొన్నం అనిల్ కుమార్గౌడ్, పెండ్యాల శ్యాంసుందర్రెడ్డి, పిట్టల రవీందర్, అక్బర్ హుస్సేన్.. మానకొండూర్లో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవీఆర్, సిరిసిల్ల జడ్పీ వైస్ చైర్మన్ సిద్ధం వేణు, నాయకులు గడ్డం నాగరాజు, దరువు ఎల్లన్న, రావుల రమేశ్, కేతిరెడ్డి దేవెందర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
బీఆర్ఎస్కు జయాపజయాలు కొత్తేమి కాదు. నేటి అపజయం రేపటి విజయానికి తొలిమెట్టని పార్టీ అధినేత కేసీఆర్ తరచూ చెబుతుంటారు. ఓటమిపై సమీక్షించుకుని, మనలో ఉన్న లోపాలను సవరించుకోవాలి. పదేళ్లు అధికారంలో ఉండి రాష్ర్టానికి కేసీఆర్ ఏం చేశాడు అనే దానికంటే ఏం చేయలేదో చెప్పాలనే విధంగా ప్రజల్లో చర్చ జరుగాల్సిన అవసరం ఉంది. కాళేశ్వరం ప్రాజెక్టును కూల్చివేసి కమీషన్ల కోసం కొత్త ప్రాజెక్టును నిర్మించాలని కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తున్నది. అందుకే కేసీఆర్ను బద్నాం చేసే పనిలో ఉన్నరు. బీఆర్ఎస్ కోసం కష్టపడిన ప్రతి కార్యకర్తకు తప్పక గుర్తింపు లభిస్తుంది.
వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో వినోదన్నను గెలిపించుకుందాం. అందుకోసం ప్రతి ఒక్కరం శక్తివంచన లేకుండా కృషి చేద్దాం. ఆయన మనకు ఎంతో బలం. కరీంనగర్ జిల్లాకు ఆయన ఎంపీగా అవసరం. నేను మీ మధ్యనే ఉంట. నియోజకవర్గాన్ని వదిలి ఎక్కడికీ పోను. కార్యకర్తల జోలికి ఎవరన్నా వస్తే ఊరుకునే ప్రసక్తే లేదు. ప్రస్తుతం గ్రామాలు అద్భుతంగా ఉన్నాయంటే అది నేను చేసిన అభివృద్ధే. అది మీ అందరికీ తెలుసు. అబద్ధాలు చెప్పీ చెప్పీ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ సానుభూతితో గెలిచిండు. ఈ బూతుల ఎమ్మెల్యే నుంచి ప్రజలు అభివృద్ధిని ఆశించడం వేస్ట్.
– కరీంనగర్, మానకొండూర్ సమావేశాల్లో మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్
కాంగ్రెస్ పార్టీ అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చింది. ఇప్పుడా హామీలను నిలబెట్టుకోలేక తంటాలు పడుతున్నది. పదేళ్ల కేసీఆర్ పాలనలో రైతులు ఏనాడూ రోడ్డెక్కలేదు. కానీ, కాంగ్రెస్ గెలిచిన రెండు నెలల్లోనే నీళ్లు, కరెంట్ కోసం రోడ్డెక్కాల్సిన దుస్థితి వచ్చింది. స్వల్ప కాలంలోనే కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత కనిపిస్తున్నది. ఈ సమయంలో బీఆర్ఎస్ కార్యకర్తలంతా సత్తా చాటాలి. ప్రజా సమస్యల పరిష్కారం కోసం ముందుండి పోరాడాలి. రైతులకు అండగా నిలువాలి. వచ్చే వేసవిలో అన్ని చెరువుల్లో నీళ్లు నింపేలా పోరాడాలి. పాలన చేతకాక కాంగ్రెస్ నాయకులు తమ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకు బీఆర్ఎస్పై ఎదురుదాడికి దిగే ప్రయత్నం చేస్తున్నరు. ఆ పార్టీ ఇచ్చిన హామీలను నిలబెట్టుకోకుంటే గులాబీ సైనికులు ఎక్కడికక్కడ నిలదీయాలి. అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైతే కష్టపడి నన్ను గెలిపించారో.. ఇప్పుడు వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో వినోద్కుమార్ను ఎంపీగా వినోద్కుమార్ను గెలిపించాల్సిన బాధ్యత మనందరిపై ఉన్నది.
-కరీంనగర్లో ఎమ్మెల్యే గంగుల కమలాకర్