మానకొండూర్, డిసెంబర్ 28 : రాబోయే లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపే లక్ష్యంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు పని చేయాలని కరీంనగర్ మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్కుమార్ పిలుపునిచ్చారు. గురువారం మానకొండూర్ మండల కేంద్రంలోని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవీఅర్ నివాసంలో ఏర్పాటు చేసిన ముఖ్య నాయకుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బీఆర్ఎస్ కార్యకర్తలు ఎవరూ ఆధైర్య పడొద్దని, అందరినీ కడుపులోపెట్టుకుని చూసుకుంటామని హామీ ఇచ్చారు.
గత ఐదేళ్లలో కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ పార్లమెంట్ నియోజకర్గంలో నయాపైసా అభివృద్ధి చేయలేదని విమర్శించారు. కాంగ్రెస్ మోసపూరిత, సాధ్యంకాని హామీలతో అధికారంలోకి వచ్చిందని, మ్యానిఫెస్టోలో ప్రకటించిన హామీలను అమలు చేయకపోతే ప్రజల పక్షాన పోరాడాలని పిలుపునిచ్చారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఅర్ తెలంగాణను అన్ని రంగాల్లో ముందుకు తీసుకుపోతే కాంగ్రెస్ మాత్రం రాష్ర్టాని ఆగం చేస్తున్నదని మండిపడ్డారు. బీఆర్ఎస్ కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగడుతూ కేసీఅర్ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలను వివరించాలని సూచించారు.
వచ్చే నెల 4న హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ స్థాయి సమావేశం నిర్వహిస్తున్నామని, బీఆర్ఎస్ కేడర్కు ఎన్నికలపై పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఅర్ దిశా నిర్దేశం చేయనున్నారని తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి గురించి ఆలోచన చేయొద్దని, పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్రతి కార్యకర్తా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, బీఆర్ఎస్ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు, మానకొండూర్ జడ్పీటీసీ తాళ్లపెల్లి శేఖర్గౌడ్, సర్పంచ్ రొడ్డ పృథ్వీరాజ్, బీఆర్ఎస్ తిమ్మాపూర్ మండలాధ్యక్షుడు రావుల రమేశ్, నాయకులు కోండ్ర నిర్మల, ఎరుకల శ్రీనివాస్గౌడ్, నెల్లి శంకర్ పాల్గొన్నారు.