రాజన్న సిరిసిల్ల, జనవరి 17 (నమస్తే తెలంగాణ): బతుకమ్మ చీరెల బకాయిలు 250 కోట్లు వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్కుమార్ డిమాండ్ చేశారు. కేసీఆర్ సర్కారు నేతన్నల సంక్షేమం కోసం తెచ్చిన సంక్షేమ పథకాలను యధావిధిగా కొనసాగించాలని కోరారు. సిరిసిల్ల జిల్లాకేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ రాక ముందు కాంగ్రెస్ ప్రభుత్వంలో సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొన్నదని, వందల సంఖ్యలో నేతన్నలు ఆకలిచావులు, బలవర్మణాలకు పాల్పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఉద్యమ సమయంలో సిరిసిల్లకు వచ్చిన కేసీఆర్ ‘నేతన్నలు ఆత్మహత్యలు చేసుకోవద్ద’ంటూ గోడలపైన రాతలు చూసి చలించి పోయారని, చందాలు వసూలు చేసి 50లక్షలు పద్మశాలీ ట్రస్టుకు అందజేశారని గుర్తు చేశారు. స్వరాష్ట్రం సిద్ధించిన తర్వాత సిరిసిల్ల వస్త్ర పరిశ్రమను అన్ని విధాలుగా ఆదుకోవడంతోపాటు నేతన్నల బతుకులకు భరోసా కల్పించేలా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి కేటీఆర్ దేశంలో ఎక్కడా లేనివిధంగా పథకాలు అమలు చేశారని గుర్తు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న చేనేత, మరమగ్గాల కార్మికులకు రుణమాఫీ చేసిన ఏకైక ప్రభుత్వం కేసీఆర్దేనన్నారు.
నేతన్నలకు ప్రతి నెలా 15వేల నుంచి 20 వేలు కూలీ వచ్చేలా బతుకమ్మ చీరెల ఆర్డర్లు ఇచ్చారని, కార్మికులకు శాశ్వతంగా ఉపాధి కల్పించాలన్న ఉద్దేశ్యంతో ఆర్వీఎం, రంజాన్, క్రిస్మస్ వస్ర్తాల ఉత్పత్తులు సిరిసిల్లకే ఇచ్చారన్నారు. ఇతర రాష్ర్టాల నుంచి వలసలు వాపస్ వచ్చాయని, ఇతర రాష్ర్టాలకు చెందిన కార్మికులు ఇక్కడకు వచ్చి ఉపాధి పొందుతున్నారని తెలిపారు. కేసీఆర్ ప్రభుత్వం ప్రతి కార్మికుడికీ రైతు బీమా తరహాలో 5లక్షల బీమా సౌకర్యం కల్పించిందన్నారు.
ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా నేతన్న సంక్షేమం కోసం కృషి చేయాలని సూచించారు. కేసీఆర్ సర్కారు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు కొనసాగించాలని కోరారు. అలాగే వర్కర్టూ ఓనర్ పథకాన్ని వెంటనే అమలు చేయాలన్నారు. సమావేశంలో జడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ, టీపీటీడీసీ మాజీ చైర్మన్ గూడూరి ప్రవీణ్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, పట్టణాధ్యాక్షుడు జిందం చక్రపాణి, కార్యదర్శి మ్యాన రవి, మున్సిపల్ వైస్చైర్మన్ మంచె శ్రీనివాస్, నాయకులు చీటి నర్సింగరావు, న్యాలకొండ రాఘవారెడ్డి, బండ నర్సయ్య పాల్గొన్నారు.