కొత్తపల్లి, ఫిబ్రవరి 2 : కరీంనగర్ పార్లమెంట్ ఎన్నికల్లో ఎగిరేది బీఆర్ఎస్ జెండానేనని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్కుమార్ స్పష్టం చేశారు. ఆచరణకు సాధ్యం కాని, అబద్ధపు హామీలపై కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైందని విమర్శించారు. ఆరు గ్యారెంటీలు అమలయ్యేదాకా ప్రజల పక్షాన ఉద్యమిస్తామని తేల్చిచెప్పారు. చింతకుంటలోని ఎస్వీఆర్ గార్డెన్లో శుక్రవారం కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ స్థాయి ఎస్టీ సెల్ నాయకులతో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనానికి ఆయన హాజరై మాట్లాడారు. నాడు రాష్ట్ర సాధన ఉద్యమంలో బంజారాలు ముందున్నారని ప్రశంసించారు.
రాబోయే ఎన్నికల్లో తనకు ఓట్లు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. పోడు భూములకు పట్టాలిచ్చిన ఘనత, అలాగే తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చిన ఘనత కేసీఆర్ సర్కారుకే దక్కిందని కొనియాడారు. తెలంగాణలో బీఆర్ఎస్ను బొంద పెడతాం అని సీఎం రేవంత్రెడ్డి, మంత్రి వెంకట్రెడ్డి మాట్లాడుతున్నారని.. వీళ్లిద్దరి గురువులైన చంద్రబాబు, వైఎస్ఆర్తోనే ఏమీకాలేదని, వారి శిష్యులైన వీరితో ఏమవుతుందని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్కు ఒక సిద్ధాంతం ఉందని, అని వర్గాల అభివృద్ధి కోసం ఆరాటపడే పార్టీ అని స్పష్టం చేశారు. కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ దేశంలోనే అగ్రగామిగా నిలిచిందన్నారు.
2014లో బీఆర్ఎస్ సరారు కొలువుదీరే వరకు రాష్ట్రంలో కేవలం 7778 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అయ్యేదని, కేసీఆర్ సీఎం అయ్యాక పదేళ్లలో 26వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసే స్థాయికి చేరుకున్నదని, దీనివల్ల రాష్ట్రంలో నిమిషం పాటు కరెంట్ పోకుండా సరఫరా చేయవచ్చన్నారు. గోదావరి, కృష్ణా నదులపై కాళేశ్వరం, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులు నిర్మించడంతో కోటి ఎకరాలకు సాగునీరంది దేశానికి అన్నం పెట్టే స్థాయికి రాష్ట్రం చేరిందన్నారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో 1,60,083 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించామని, వారికి రెండు నెలలుగా వేతనాలు వేశారో లేదో చెప్పాలని సీఎంను డిమాండ్ చేశారు.
గత ప్రభుత్వ హయాంలో స్టాఫ్ నర్సు ఉద్యోగాలకు పరీక్ష నిర్వహిస్తే ఎన్నికల కోడ్లో నియామక పత్రాలు ఇవ్వడంలో ఆలస్యమైందని, ఇప్పుడు రేవంత్రెడ్డి సరారు నియామక పత్రాలు ఇవ్వడం విడ్డూరంగా ఉందన్నారు. కోదండరాం చెప్పినట్లుగా రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 2 లక్షల ఉద్యోగాల వివరాలపై ప్రభుత్వం స్పష్టతనివ్వాలని, డిసెంబర్ 24 వరకు వాటిని భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. బీజేపీ మత రాజకీయాలు చేస్తున్నదని, ఎన్నికలప్పుడే ఏదో ఒక కుట్రలకు తెరలేపి ఓట్లు దండుకొనే ప్రయత్నం చేస్తున్నదని విమర్శించారు.
ఎంపీ బండి సంజయ్ ఐదేళ్లలో కనీసం ఐదు కొత్తల అభివృద్ధి చేయలేదని మండిపడ్డారు. కనీసం పార్లమెంట్ పరిధిలోని గ్రామాల్లో కూడా తిరగలేదని, ఇప్పుడు వెళ్లి ఏ ముఖం పెట్టుకుని ఓట్లడుగుతాడని ప్రశ్నించారు. బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి ఎల్ రూప్సింగ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో కరీంనగర్ జడ్పీ చైర్పర్సన్ కనుమల్ల విజయ, బీఆర్ఎస్ కరీంనగర్, రాజన్న సిరిసిల్ల జిల్లాల అధ్యక్షులు జీవీ రామకృష్ణరావు, తోట ఆగయ్య, పౌరసఫరాల శాఖ కార్పొరేషన్ మాజీ చైర్మన్ రవీందర్సింగ్, ఎంపీటీసీ భూక్యా తిరుపతినాయక్, గుగులోత్ రవినాయక్, గుగులోత్ తిరుపతి నాయక్, రాజునాయక్, బీలునాయక్, లక్ష్మీవీరునాయక్, మంగ, మానస, రాంచందర్ నాయక్, కళావతి సురేశ్నాయక్ తదితరులు పాల్గొన్నారు.