గంగాధర, ఫిబ్రవరి 19: అబద్ధాల పునాదులపై కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైందని, ఎన్నికలకు ముం దు ఇచ్చిన మాట మేరకు ఆరు గ్యారెంటీలతో పాటు 420 హామీలను అమలు చేయాలని కరీంనగర్ మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్కుమార్ డిమాండ్ చేశారు. ఈ యాసంగి ధాన్యానికి రూ. 500 బోనస్, గృహజ్యోతి కింద 200 యూనిట్ల వరకు ఫ్రీ కరెంట్, మహిళలకు ప్రతినెలా రూ. 2500 చొప్పున ఇవ్వాలన్నారు. గంగాధర మండలం గట్టుభూత్కూర్లో సోమవారం నిర్వహించిన ముఖ్య నాయకుల సమావేశంలో చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావుతో కలిసి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వినోద్ మాట్లాడుతూ ఐదేండ్లు ఎంపీగా పనిచేసిన బండి సంజయ్ కరీంనగర్ అభివృద్ధికి నయా పైసా కూడా తేలేదని ఎద్దేవా చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ రైతాంగం నీళ్లు, కరెంట్ కోసం అరిగోసపడ్డదన్నారు. యువకులను నక్సల్స్ పేరిట అంతమొందించే పరిస్థితులు ఉండేవన్నారు. తెలంగాణ ఇస్తే కరెంట్ తీగెలపై బట్టలు ఆరేసుకోవాల్సి వస్తుందని అప్పటి ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డి చెప్పారని గుర్తు చేశారు. తెలంగాణ సిద్ధించిన తర్వాత సీఎంగా బాధ్యతలు చేపట్టిన కేసీఆర్ రాష్ర్టాన్ని అన్నింటా అగ్రగామిగా నిలిపారని చెప్పారు.
7778 మెగావాట్లు ఉన్న విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని 26 వేల మెగావాట్లకు పెంచి 24 గంటల కరెంట్ ఇచ్చారన్నారు. 1.61 లక్షల ఉద్యోగాలను భర్తీ చేశారని పేర్కొన్నారు. ఎన్నికలకు వారం ముందే రైతుబంధు కోసం రూ.7,700 కోట్లను సమకూర్చిపెట్టారని, కానీ ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండు నెలలు దాటినా రైతుబంధు నగదు జమ చేయకపోవడం విడ్డూరమన్నారు. కేసీఆర్ బంగారు పల్లెంలో పెట్టి రాష్ర్టాన్ని అప్పగిస్తే, కాంగ్రెస్ సర్కారు పాలన చేతగాక నిర్వీర్యం చేస్తున్నదని మండిపడ్డారు. బీఆర్ఎస్ కార్యకర్తలు ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లి వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో గులాబీ జెండాను ఎగురవేయాలని పిలుపునిచ్చారు. కష్టపడ్డ కార్యకర్తలను కడపులో పెట్టి కాపాడుకుంటామని హామీ ఇచ్చారు.