మానకొండూర్, డిసెంబర్ 30: తండ్రీకొడుకుల అనుబంధాన్ని కండ్లకుకట్టినట్టు జర్నలిస్ట్ గడ్డం సతీశ్ రచించిన ‘బాపు’ పుస్తకం నేటి తరానికి ఆదర్శనీయమని కరీంనగర్ మాజీ ఎంపీ బీ వినోద్కుమార్ ప్రశంసించారు. శనివారం మానకొండూర్లోని మీనాక్షి కన్వెన్షన్ హాల్లో నమస్తే తెలంగాణ సీనియర్ జర్నలిస్ట్ గడ్డం సతీశ్ రాసిన ‘బాపు’ పుస్తక ఆవిష్కరణ సభకు వినోద్కుమార్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. రాష్ట్ర ప్రెస్ అకాడమీ మాజీ చైర్మన్ అల్లం నారాయణతో కలిసి ఈ పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వినోద్కుమార్ మాట్లాడుతూ, రచయిత సతీశ్ తండ్రి గడ్డం రామస్వామి ఆశయం గొప్పదని కొనియాడారు. తాను చదువుకోకున్నా తన పిల్లలను చదివించడానికి ఆయన పడిన కష్టాలు, బాధలు వెలకట్టలేనిన్నారు.
చదువుకుని మంచిగా ఉండాలని, సమాజంలో గౌరవంగా బతుకాలని తండ్రి చెప్పిన మాటలను తూచతప్పకుండా పాటించి ప్రయోజకుడైన కొడుకు, తండ్రీకొడుకుల మధ్య అనుబంధాన్ని చాటి చెప్పే ఈ పుస్తకం నేటి యువతరానికి స్ఫూర్తి దాయకమన్నారు. రాబోయే రోజుల్లో సమాజానికి ఉపయోగపడేలా.. నేటి తరానికి సామాజిక స్పృహ కలిగించే మరెన్నో రచనలు చేయాలని ఆకాంక్షించారు. ప్రెస్ అకాడమీ మాజీ చైర్మన్ అల్లం నారాయణ మాట్లాడుతూ, ఒక సామాన్యుడిని అసామాన్యుడిగా తీర్చిదిద్దిన సతీశ్ ఆశయం గొప్పదన్నారు. తెలంగాణలో బాపు పిలుపునకు ఒక ప్రత్యేకత ఉందన్నారు. బాపు వ్యక్తిత్వాన్ని పుస్తక రూపంలో కండ్లకు కట్టినట్లు చెప్పాడని గుర్తు చేశారు.
రామస్వామి పెద్దగా చదువుకోలేక పోయినా, తన పిల్లలు తనలా ఉండవద్దని ప్రయోజకులు కావాలని అతడు నిత్యజీవితంలో సాగించిన పోరాటం గొప్పదన్నారు. మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ మాట్లాడుతూ, సతీశ్తో తనకు ఉన్న అనుబంధం అన్నదమ్ముళ్లదని చెప్పారు. నేటి కాలంలో తండ్రుల ఆస్తులు, సంపాదన పంచుకుంటున్న వారు ఉంటున్నారని, కానీ సతీశ్ మాత్రం తండ్రి ఆశయాన్ని, ప్రేమను, జీవితాన్ని పంచుకున్నాడని గుర్తుచేశారు. తండ్రీకొడుకుల అనుబంధాన్ని చాటిన ఈపుస్తకాన్ని సినిమా గానీ, డాక్యుమెంటరీ గాని తీస్తానని వెల్లడించారు.
మాజీ ఎమ్మెల్సీ నారాదాసు లక్ష్మణ్రావు మాట్లాడుతూ, బాపు యాదిలో పుస్తకాన్ని రచించిన సతీశ్ను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నట్లు తెలిపారు. బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు మాట్లాడుతూ, తండ్రీకొడుకుల ఆప్యాయతను కండ్లకు కట్టినట్లు పుస్తక రూపంలో చెప్పడం గొప్ప విషయమన్నారు. రచయిత సతీశ్ మాట్లాడుతూ, తన తండ్రి సామాన్యుడని, ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువేనని చెప్పారు. బాపు పుస్తకాన్ని అందరికీ అందుబాటులోకి తీసుకువస్తానని అన్నారు. తనను అన్ని రకాలుగా ఆదుకుని సహాయ సహకారాలు అందిస్తున్న ‘నమస్తే తెలంగాణ’ యాజమాన్యానికి రుణపడి ఉంటానని కృతజ్ఞతలు తెలిపారు. ఇట్యాల వెంకటకిషన్ అధ్యక్షత వహించిన ఈ సభలో రాష్ట్ర ఈఆర్సీ చైర్మన్ తన్నీరు శ్రీరంగరావు, సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత సినీ విమర్శకులు వారాల ఆనంద్, రచయిత తల్లి గడ్డం అజ్జిరవ్వ, మాజీ మేయర్ సర్దార్ రవీందర్సింగ్, పలువురు కవులు, కథకులు జూకంటి జగన్నాథం, అన్నవరం దేవేందర్, కేఈవీ నరేందర్, గాజోజు నాగభూషణం, పెద్దింటి అశోక్కుమార్, బూర్ల వెంకటేశ్వర్లు, కూకట్ల తిరుపతి పాల్గొన్నారు.