చొప్పదండి, డిసెంబర్ 24 : వచ్చే లోక్సభ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పని చేయాలని, కేసీఆర్ పాలనలో చేసిన అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లాలని బీఆర్ఎస్ శ్రేణులకు కరీంనగర్ మాజీ ఎంపీ బీ వినోద్ కుమార్ పిలుపునిచ్చారు. కార్యకర్తలెవరూ అధైర్యపడొద్దని, అందరినీ కడుపులో పెట్టి చూసుకుంటామని భరోసా కల్పించారు. గుమ్లాపూర్ శివారులోని ఫంక్షన్ హాల్లో ఆదివారం మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ఆధ్వర్యంలో నిర్వహించిన చొప్పదండి మండల స్థాయి బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ఐదేండ్లలో నయా పైసా పని చేయలేదని విమర్శించారు. పనులు చేయడం చేతకాని వ్యక్తిని ఎంపీగా గెలిపించి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు.
కాంగ్రెస్ మోసపూరిత, సాధ్యం కాని హామీలు ఇచ్చి గెలిచిందని, అధికారంలోకి రాగానే ఆరు గ్యారెంటీల్లోని హామీలన్నీ అమలు చేస్తామని ప్రకటించి, ఇప్పుడు ఏవో ఒకటి రెండు అమలు చేసి చేతులు దులుపుకున్నదని విమర్శించారు. తెలంగాణ రాష్ర్టాన్ని మాజీ సీఎం కేసీఆర్ అన్ని రంగాల్లో రంగాల్లో ముందుకు తీసుకెళ్లారని, కాంగ్రెస్ మాత్రం తెలంగాణను ఆగం చేస్తున్నదని మండిపడ్డారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ వందేళ్ల ముందు చూపుతోనే రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు, విద్యుత్తు ప్రాజెక్టులు నిర్మించారని చెప్పారు. గత కాంగ్రెస్ పాలనలో రాష్ట్రంలో 3 మెడికల్ కాలేజీలు మాత్రమే ఉండేవని, కానీ స్వరాష్ట్రంలో ప్రతి జిల్లాకు మెడికల్ కళాశాల ఏర్పాటు చేసి ప్రతి ఏడాదికి 10వేల మంది వైద్యులను చేసే విధంగా కేసీఆర్ కృషి చేశారని కొనియాడారు.
తెలంగాణలో నిరుపేద, బడుగు బలహీన వర్గాల పిల్లలకు నాణ్యమైన విద్య అందించాలనే సంకల్పంతో వెయ్యికిపైగా గురుకులాలు ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఎప్పుడు అమలు చేస్తుందో చెప్పాలని డిమాండ్ చేశారు. అధికారంలోకి రాగానే అన్నీ అమలు చేస్తామన్న సీఎం రేవంత్ రెడ్డి హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. రాష్ర్టాన్ని కాంగ్రెస్ మళ్లీ ఎడారి చేస్తుందని దుయ్యబట్టారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికలే లక్ష్యంగా బీఆర్ఎస్ కార్యకర్తలు ప్రతి ఇంటికి వెళ్లి కాంగ్రెస్ వైఫల్యాలను ప్రజలకు తెలియజెప్పాలని సూచించారు. పార్లమెంట్ ఎన్నికల్లో కరీంనగర్ గడ్డపై గులాబీ జెండా ఎగురవేయాలని కోరారు. సమావేశంలో జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ ఏనుగు రవీందర్ రెడ్డి, ఎంపీపీ రవీందర్, పీఏసీఎస్ చైర్మన్ మల్లారెడ్డి, ఏఎంసీ చైర్మన్ చుకారెడ్డి, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు సాంబయ్య, వినయ్, చంద్రశేఖర్ గౌడ్, సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.