కరీంనగర్ కలెక్టరేట్, మార్చి 30 : అధికారం కోసం తిరిగి కాంగ్రెస్ పంచన చేరుతున్న ఎమ్మెల్యే కడియం శ్రీహరి, రాజ్యసభ సభ్యుడు కే కేశవరావు మేక తోలు కప్పుకున్న తోడేళ్లని చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ఘాటుగా విమర్శించారు. తమ స్వార్థ రాజకీయాల కోసం రంగులు మార్చుతున్న వారిని చూసి ఊసరవెళ్లి సైతం సిగ్గుపడుతుందని ఎద్దేవా చేశారు. రాబోయే రోజుల్లో ప్రజల చేతిలో చావుదెబ్బ తిని చరిత్ర హీనులుగా మారుతారని జోష్యం చెప్పారు. దమ్ముంటే తమ పదవులకు రాజీనామా చేసి తిరిగి పోటీ చేసి గెలిచి చూపాలని సవాల్ విసిరారు.
కార్యకర్తల బలమున్న బీఆర్ఎస్ కొత్త నాయకులను తయారు చేస్తుందని స్పష్టం చేశారు. కరీంనగర్లోని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ నివాసంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కడియం, కేకేపై ఆయన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఏ పదవీ లేకుండా ఇంట్లో ఉన్న కడియంను బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దగ్గరకు తీసి ఉపముఖ్యమంత్రిగా, ఎంపీగా, ఎమ్మెల్యేగా అవకాశమిచ్చి ఉన్నత స్థాయికి తెచ్చారని, కేశవరావును కాంగ్రెస్ ఛీకొడితే కేసీఆర్ అక్కున చేర్చుకుని పార్టీ సెక్రటరీ జనరల్గా, రాజ్యసభ సభ్యుడిగా అవకాశమిచ్చారని గుర్తుచేశారు.
అడ్రస్ తెలవని కడియం కూతురికి టికెట్, అలాగే కేకే కూతురు హైదరాబాద్ మేయర్ పదవి కేసీఆర్ పెట్టిన భిక్షేనన్నారు. ఆ నాయకుల తీరు తల్లి పాలు తాగి రొమ్ము గుద్దిన చందంగా ఉందని మండిపడ్డారు. బీజేపీ, కాంగ్రెస్కు పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు అభ్యర్థులు కరువవడంతోనే బీఆర్ఎస్ నాయకులను లాక్కుంటున్నారన్నారు. ఇన్నాళ్లూ అధికారం అనుభవించి ఏ మాత్రం సిగ్గు లేకుండా ఇతర పార్టీల్లోకి పోతున్న వారి గురించి తెలంగాణ సమాజం ఆలోచించాలని పిలుపునిచ్చారు.
అసెంబ్లీ ఎన్నికల్లో రైతులకిచ్చిన హామీల్లో కొన్నైనా అమలు చేయకపోవడం కాంగ్రెస్ సర్కారు దుర్నీతికి నిదర్శనమన్నారు. ఇచ్చిన హామీలు అమలు చేయాలని ప్రశ్నిస్తుండడంతో కక్షగట్టి కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. తెలంగాణను దేశానికే రోల్మోడల్గా చేసిన వారిని మాత్రమే రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. సమావేశంలో బీఆర్ఎస్ నగరశాఖ అధ్యక్షుడు చల్ల హరిశంకర్, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ పొన్నం అనిల్, బీఆర్ఎస్ యువజన విభాగం నగర అధ్యక్షుడు దీకొండ కులదీప్, నాయకులు ఆరె రవిగౌడ్, షౌకత్అలీ, శ్రీనివాస్రెడ్డి, బొంకూరి మోహన్ పాల్గొన్నారు.