గంగాధర, ఫిబ్రవరి 15 : గర్శకుర్తి గ్రామ పవర్ లూమ్స్ వస్త్ర పరిశ్రమకు బతుకమ్మ చీరల తరహా గుడ్డ ఉత్పత్తి ఆర్డర్లు ఇవ్వాలని, నేత కార్మికులను ఆదుకోవాలని మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం గర్శకుర్తిలోని పవర్ లూమ్స్ను ఆయన సందర్శించి, కార్మికులతో మాట్లాడారు. గ్రామ పవర్ లూమ్స్కు 2022లో అప్పటి కేసీఆర్ ప్రభుత్వం 17 ఎస్ఎస్ఐ యూనిట్లకు 20 లక్షల మీటర్లు, 2023లో 33 ఎస్ఎస్ఐ యూనిట్లకు 32 లక్షలా 26 వేలా 750 మీటర్ల బతుకమ్మ చీరల ఉత్పత్తికి ఆర్డర్లు కల్పించిందని గుర్తు చేశారు. అదేవిధంగా 2 లక్షలా 13 వేల 860 మీటర్ల సూల్ యూనిఫామ్ బట్ట, 24 వేల మీటర్ల రంజాన్ క్లాత్ ఆర్డర్ ఇచ్చిందన్నారు.
దీంతో కార్మికులు జీవనోపాధి పొందారన్నారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం బతుకమ్మ చీరల తరహా గుడ్డ ఉత్పత్తికి ఎలాంటి ఆర్డర్లు కల్పించకపోవడంతో కార్మికులు పనులు లేక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఓ వైపు బతుకమ్మ చీరల ఆర్డర్లు లేక నేతన్నలు ఇబ్బంది పడుతుంటే మరో వైపు చేనేత జౌళీ శాఖ విజిలెన్స్ అధికారులు పవర్ లూమ్స్ గుడ్డ ఉత్పత్తులపై దాడులు చేస్తూ కేసులు పెట్టడం హేయమైన చర్య అని మండిపడ్డారు. పరిస్థితులు ఇలాగే కొనసాగితే గతంలో మాదిరిగా నేత కార్మికుల ఆకలి చావులు, ఆత్మహత్యలు పునరావృతం అవుతాయని చెప్పారు. విజిలెన్స్ అధికారులు చేసిన కేసులు మాఫీ చేయాలని కోరారు. ఇక్కడ నాయకులు మేచినేని నవీన్రావు, అలువాల తిరుపతి, వేముల దామోదర్, రామిడి సురేందర్ పాల్గొన్నారు.