గంగాధర, మార్చి 26 : సాగునీరు అందక ఎండిపోయిన పంటలకు ఎకరానికి రూ.25 వేల చొప్పున ప్రభుత్వం పరిహారం చెల్లించాలని మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ డిమాండ్ చేశారు. మండలంలోని మల్లాపూర్ గ్రామానికి చెందిన ఆకుల రాజయ్య అనే రైతు వేసిన నాలుగు ఎకరాల వరి పొలం ఎండిపోవడంతో మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, కేసీఆర్ పాలనలో వరదకాల్వ జీవనదిలా ఉండి వేలాది ఎకరాలకు సాగునీరు అందిందని గుర్తు చేశారు.
మూడు నెలల క్రితం అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం పదేండ్ల కిందటి కరువు పరిస్థితిని తిరిగి తీసుకువచ్చిందన్నారు. ఎకరం పంట కూడా ఎండి పోకుండా సాగునీరు అందజేయడానికి ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇక్కడ గంగాధర సింగిల్ విండో చైర్మన్ దూలం బాలాగౌడ్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ సాగి మహిపాల్రావు, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు మేచినేని నవీన్రావు, నాయకులు ఆకుల శంకరయ్య, నాగారపు సత్యనారాయణ, ముక్కెర మల్లేశం, తూం మల్లారెడ్డి, మల్లయ్య, ప్రశాంత్, రైతులు ఉన్నారు.