గంగాధర, ఫిబ్రవరి 11: నల్లగొండలో ఈ నెల 13న నిర్వహించనున్న బహిరంగ సభకు బీఆర్ఎస్ శ్రేణులు భారీగా తరలివెళ్లి విజయవంతం చేయాలని చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. కాంగ్రెస్ సర్కారు కేఆర్ఎంబీకీ శ్రీశైలం, నాగర్జునసాగర్ ప్రాజెక్టులను అప్పగించడాన్ని నిరసిస్తూ కేసీఆర్ ఆధ్వర్యంలో ఈ సభను నిర్వహిస్తున్నామన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వాకంతో నల్లగొండ, రంగారెడ్డి, పాలమూరు జిల్లాలు ఏడారిగా మారే ప్రమాదమున్నదని పేర్కొన్నారు. కేసీఆర్ ప్రభుత్వం పదేండ్లుగా కాపాడిన ప్రాజెక్టులను రేవంత్ సర్కారు ఏర్పాటైన రెండు నెలలకే కేంద్రంచేతిలో పెట్టడం బాధాకరమన్నారు. ఇలాంటి కృష్ణా జలాల కోసం మరోపోరాటానికి సిద్ధం కావాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. నల్లగొండ సభను అడ్డుకునేందుకు కాంగ్రెస్ కుటిల యత్నాలు చేస్తున్నదని, ఆరు నూరైనా సభ జరిగి తీరుతుందని స్పష్టం చేశారు.