తిమ్మాపూర్ రూరల్, డిసెంబర్ 22: కాంగ్రెస్ ఆరు గ్యారెంటీల అమలు కోసం పోరాటానికి సిద్ధంకావాలని బీఆర్ఎస్ శ్రేణులకు మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్కుమార్ పిలుపునిచ్చారు. బూటకపు హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ విధానాలపై గ్రామాల్లో చర్చపెట్టాలని సూచించారు. ఫస్ట్ క్యాబినెట్ సమావేశంలోనే గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పిన ఆ ప్రభుత్వం మాటమార్చిందని దుయ్యబట్టారు. నిరుద్యోగభృతి ఇస్తామని చెప్పి ఇప్పుడు చేతులెత్తేసిందని విమర్శించారు. తిమ్మాపూర్ మండలం కొత్తపల్లిలోని ఓ ఫంక్షన్హాల్లో శుక్రవారం నిర్వహించిన మానకొండూర్ నియోజకవర్గస్థాయి కార్యకర్తల సమావేశానికి మాజీ ఎమ్మెల్యే రసమయితో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా వినోద్ కుమార్ మాట్లాడారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికలకు కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని, బీఆర్ఎస్ పాలనలో జరిగిన అభివృద్ధి, సంక్షేమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని కోరారు. గత ఎన్నికల్లో సెంటిమెంట్తో గెలిచిన బండి సంజయ్ నియోజకవర్గానికి ఏం చేశాడో చెప్పాలని ప్రశ్నించారు. కేంద్రంలో వారి ప్రభుత్వం ఉన్నా సాధించిందేమీలేదని ఎద్దేవా చేశారు.
కార్యకర్తలు మన ప్రభుత్వంలేదని అధైర్యపడవద్దని, పార్లమెంట్ ఎన్నికల్లో సత్తాచాటాలన్నారు. రసమయి బాలకిషన్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ హామీలు అమలు చేసే వరకు పోరాటం ఆగబోదని తేల్చిచెప్పారు. తనను నియోజకవర్గ ప్రజలు గుండెల్లో పెట్టి చూసుకున్నారన్నారు. కాంగ్రెస్ చేసిన తప్పుడు ప్రచారంతో ఓడిపోయానని ఆవేదన వ్యక్తం చేశారు. అయినప్పటికీ కార్యకర్తలకు అండగా ఉంటానని చెప్పారు. రాబోయే స్వారత్రిక ఎన్నికల్లో కరీంనగర్ ఎంపీగా వినోద్ కుమార్ గెలుపే లక్ష్యంగా కార్యకర్తలు సైనికుల్లా పని చేయాలని కోరారు. ఎమ్మెల్యే సత్యనారాయణ భాష మార్చుకోవాలని హితవు పలికారు. ఐదేండ్లలో ఎంపీ బండి సంజయ్ అభివృద్ధికి ఐదు రుపాయాలు కూడా తేలేదని, వినోద్ ఎంపీగా ఉన్నప్పుడు తెచ్చిన నిధులతోనే కాలం వెల్లదీశాడని విమర్శించారు. సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు గడ్డం నాగరాజు, గూడేల్లి తిరుపతి, సిద్ధం వేణు, రావుల రమేశ్, కేతిరెడ్డి దేవేందర్ రెడ్డి పాల్గొన్నారు.