గోదావరిఖని, డిసెంబర్ 4: రామగుండం నియోజకవర్గ ప్రజలు ఇచ్చిన తీర్పును శిరసావహిస్తానని రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. గోదావరిఖని బీఆర్ఎస్ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బీఆర్ఎస్ గెలుపు కోసం నిరంతరం పని చేసిన కార్పొరేటర్లు, పార్టీ నాయకులు, కార్యకర్తలందరికీ రుణపడి ఉంటానని అన్నారు. నియోజకవర్గ ప్రజల సమస్యల పరిష్కారానికి నిరంతరం పోరాటం చేస్తానని స్పష్టం చేశారు.
కాంగ్రెస్ నేతల దుష్ప్రచారాన్ని ప్రజలు నమ్మడమే తన ఓటమికి కారణమని చెప్పారు. ఆ పార్టీ ఇచ్చిన హామీలను నెర వేర్చాలని డిమాండ్ చేశారు. ప్రజలు, కార్మికుల సమస్యల పరిష్కారం కోసం కాంగ్రెస్ నాయకులు కృషి చేయాలని కోరారు. సమావేశంలో నాయకులు కౌశికహరి, ఆముల నారాయణ, చల్ల రవీందర్ రెడ్డి, జేవీ రాజు, మూల విజయారెడ్డి, సరోజన పాల్గొన్నారు.