జగిత్యాల, ఫిబ్రవరి 2 : దేశంలో ఎమర్జెన్సీ విధించిన చరిత్ర కాంగ్రెస్ ప్రభుత్వానిదని, ఆ నాడు పత్రికలు, మీడియా సంస్థలపై ఉకు పాదం మోపి ప్రజాస్వామ్య గొంతు నులిమారని త్రిపుర రాష్ట్ర గవర్నర్ ఇంద్రసేనారెడ్డి గుర్తు చేశారు. ఆ సమయంలో ఇబ్బందిపడ్డ వారిని స్వాతంత్య్ర యోధులుగా గుర్తించి అన్ని రాయితీలు కల్పించేలా తన వంతు కృషి చేస్తానని స్పష్టం చేశారు. భారత సురక్ష సమితి రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఏసీఎస్ రాజు ఆధ్వర్యంలో జగిత్యాలలోని దేవిశ్రీ గార్డెన్లో శుక్రవారం నిర్వహించిన పౌరసన్మాన కార్యక్రమానికి ఆయన హాజరై మాట్లాడారు.
కొన్ని రాష్ట్రాల్లో ఎమర్జెన్సీ పోరాట వీరులను స్వాతంత్ర సమరయోధులుగా గుర్తింపు నిచ్చారని తెలిపారు. ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థి నాయకుడిగా ఉన్నప్పుడు జరిగిన ఘర్షణల్లో తాను కత్తిపోట్లకు గురయ్యానని, జగిత్యాల ప్రాంతానికి చెందిన రామన్న, గోపన్న, జితేందర్ రెడ్డి, మధుసూదన్గౌడ్, తదితరులు తీవ్రవాదుల అరాచకాలను ఎదిరించి వారి చేతుల్లో వీరమరణం పొందారని గుర్తు చేశారు.
ఎంతో మంది కార్యకర్తల త్యాగాలు, బలిదానాల వల్లే ఈ రోజు దేశంలో జాతీయవాదం బలపడిందని తెలిపారు. తనకు పౌర సన్మానం చేయడం ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు గుజ్జుల రామకృష్ణారెడ్డి, కాసిపేట లింగయ్య, భారత సురక్ష సమితి రాష్ట్ర అధ్యక్షుడు అశోక్ కుమార్ యాదవ్, ప్రధాన కార్యదర్శి కృష్ణ, ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధ్యక్షులు సత్య ప్రకాశ్, తదితరులు పాల్గొన్నారు.