శంకరపట్నం, మార్చి 10: గులాబీ జెండాకు గెలుపోటములు కొత్త కాదని మాజీ ఎమ్మెల్యే డాక్టర్ రసమయి బాలకిషన్ పేర్కొన్నారు. ఈ నెల 12న కదనభేరి ‘చలో కరీంనగర్’ సభ సన్నాహక సమావేశంలో భాగంగా మొలంగూర్ శివారులోని లక్ష్మీప్రసన్న ఫంక్షన్హాల్లో ముఖ్య కార్యకర్తల సమావేశం పార్టీ మండలాధ్యక్షుడు మహిపాల్ అధ్యక్షతన జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన డాక్టర్ రసమయి మాట్లాడుతూ.. ప్రజాస్వామ్య ఎన్నికల్లో గెలుపోటములు సహజమన్నారు. కార్యకర్తలు నిన్నటి ఓటమికి కుంగిపోక రేపటి విజయానికి రెట్టించిన ఉత్సాహంతో పని చేయాలన్నారు.
రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో బీ వినోద్కుమార్ను అత్యధిక మెజారిటీతో గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. గత ఎన్నికల్లో ఎంపీగా గెలిచిన బండి సంజయ్ ప్రజా యాత్రలతో, రాముడి పేరుతో కాలం గడుపుడు తప్పితే, నియోజకవర్గానికి నయా పైసా పని చేయలేదని విమర్శించారు. కాంగ్రెస్ అధికారం చేపట్టాక నీళ్లు లేక పచ్చని పొలాల్లో పశువులు మేసే మార్పు వచ్చిందని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ అధికారం చేపట్టాక మానకొండూర్ నియోజకవర్గంలో రూ.13 కోట్ల అభివృద్ధి పనుల నిధులను రద్దు చేసినట్లు వెల్లడించారు. తెలంగాణ అభివృద్ధిలో కేసీఆర్ పెద్దన్న పాత్ర పోషించారని కొనియాడారు. సీఎం రేవంత్రెడ్డి భాష సరికాదన్నారు.
గ్రామాల్లో రైతుల్లో అంతర్మథనం మొదలైందన్నారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్కు ఓట్లు పడవని స్పష్టం చేశారు. కదనభేరి బహిరంగ సభకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హాజరవుతారని, శంకరపట్నం మండలం నుంచి మూడు వేల మందిని తరలించి, సూపర్ సక్సెస్ చేయాలని పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేశారు. సమావేశంలో జడ్పీటీసీ లింగంపల్లి శ్రీనివాస్రెడ్డి, ఎంపీటీసీలు గాండ్ల తిరుపతి, మొయిన్, మెట్పల్లి, గద్దపాక సింగిల్ విండోల చైర్మన్లు పొద్దుటూరి సంజీవరెడ్డి, గుర్రాల తిరుపతిరెడ్డి, మాజీ సర్పంచ్ పల్లె సంజీవరెడ్డి, విండో వైస్ చైర్మన్ రవీందర్రెడ్డి, మాజీ సర్పంచులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
గన్నేరువరం, మార్చి10: కన్నీళ్లు తప్ప కాలువల్లో నీళ్లు చూడని గన్నేరువరం మండలాన్ని కాళేశ్వరం జలాలతో సస్యశ్యామలం చేసిన ఘనత బీఆర్ఎస్ పార్టీదేనని మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ స్పష్టం చేశారు. ఆదివారం మండలకేంద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో నిర్వహించిన ముఖ్య కార్యకర్తల సమావేశానికి నాఫ్స్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్ రావుతో కలిసి హాజరై మాట్లాడారు. కరీంనగర్లో 12న జరిగే కదనభేరి సభకు భారీ సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు. నాఫ్స్ కాబ్ చైర్మన్ రవీందర్ రావు మాట్లాడుతూ, బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వినోద్ కుమార్ గెలుపే లక్ష్యంగా ప్రతి కార్యకర్త పనిచేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జడ్పీటీసీ మాడుగుల రవీందర్ రెడ్డి, బీఆర్ఎస్ మండలాధ్యక్షడు గంప వెంకన్న, నాయకులు సుధాకర్, లక్ష్మణ్, శ్రీనివాస్, ప్రభాకర్, తిరుపతి రెడ్డి, గ్రామాధ్యక్షులు పాల్గొన్నారు.