పెద్దపల్లి కమాన్, మే 28 : ఇది చేతగాని ప్రభుత్వమని, అసమర్థ పాలనతో ధాన్యం కొనకుండా రైతులను గోస పెడుతున్నదని బీఆర్ఎస్ పెద్దపల్లి నియోజకవర్గ ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్రెడ్డి ధ్వజమెత్తారు. పంటలు సాగు చేసేటప్పుడు యూరియా, ఎరువులు దొరకక, రైతుబంధు అందక గోసపడ్డారని, ఇప్పుడు పంటలు అమ్ముకొనేందుకు అష్టకష్టాలు పడాల్సిన దుస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ ఇచ్చిన పిలుపు మేరకు గురువారం పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్ యార్డును పార్టీ శ్రేణులతో కలిసి ఆయన పరిశీలించారు. తడిసిన ధాన్యం, మక్కలు, తూకం వేస్తున్న వడ్లను పరిశీలించి, రైతుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రైతులు, మహిళలు తమ గోడు వెల్లబోసుకున్నారు.
అనంతరం దాసరి మనోహర్రెడ్డి మీడియాతో మాట్లాడారు. మార్కెట్లో ధాన్యం కుప్పలు పోసి నెలన్నర కావస్తున్నా 50 శాతం మేరకే కొనుగోళ్లు జరిగాయని, వానకాలం సమీపిస్తుండడంతో రైతులు ఆందోళనకు గురవుతున్నారని తెలిపారు. ఇటీవలి అకాల వర్షాలకు మార్కెట్లోని సగం మేరకు వరి ధాన్యం, మక్కలు తడిసిపోయాయని, దీంతో ధాన్యం రంగుమారి మొలకెత్తుతుండగా, మక్కలు ముక్కపట్టి వాసన వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. మార్కెట్లో కనీసం టార్ఫాలిన్లు కూడా లేవని మండిపడ్డారు. బార్దాని, సుతిల్ కూడా రైతులే సొంత ఖర్చులతో తెచ్చుకుంటున్నారని, మిల్లులకు తరలించేందుకు ట్రాక్టర్, వ్యాన్లు సొంతంగా ఏర్పాటు చేసుకోవాల్సిన దుస్థితి ఉన్నదని చెప్పారు.
తరుగు పేరిట మిల్లర్లు దోపిడీ చేస్తూ క్వింటాల్కు ఐదారు కిలోల వరకు నష్టాలపాలు చేస్తున్నారని ఆరోపించారు. ట్రక్ షీట్లలో మార్పులు చేస్తూ అక్రమాలకు పాల్పడుతున్న మిల్లర్లపై అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. వెంటనే మార్కెట్లలోని తడిసిన వడ్లు, మక్కలను కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే బీఆర్ఎస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు ఉప్పు రాజ్కుమార్, మండల అధ్యక్షుడు మర్కు లక్ష్మణ్, ఉపాధ్యక్షుడు సలేంద్ర రాములు, నాయకులు వెన్నం రవీందర్, పెంచాల శ్రీధర్, రెవెల్లి స్వామి, నాంసాని సరేశ్ బాబు, మేకల కుమార్ యాదవ్, ముత్యాల రాజయ్య, జుబేర్, పల్లె మధు, వైద శ్రీనివాస్, గండు రంగయ్య, లవన్కుమార్, నూగిళ్ల వీరేశం, బొడ్డుపల్లి రమేశ్, కుక్క మనోజ్కుమార్ తదితరులు పాల్గొన్నారు.