ధర్మపురి, డిసెంబర్15: ‘గెలిచినప్పుడు పొంగిపోలేదు. ఓడినపుపడు కుంగిపోను. ప్రజాతీర్పునకు శిరసావహిస్త్త. అధికారం ఉన్నా.. లేకున్నా ధర్మపురి ప్రజల కోసమే నా తపన’ అంటూ మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ భావోద్వేగానికి గురయ్యారు. బీఆర్ఎస్ కార్యకర్తలపై ఈగకూడా వాలనీయనని, కంటికిరెప్పలా కాపాడుకుంటానని భరోసానిచ్చారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత ధర్మపురిలోని శ్రీలక్ష్మీ నృసింహ గార్డెన్స్లో శుక్రవారం నిర్వహించిన బీఆర్ఎస్ కృతజ్ఞత సభకు ఆయన హాజరయ్యారు. ఈశ్వర్ రాగానే కార్యకర్తలు ఉద్వేగానికి గురయ్యారు.
ఉబికి వస్తున్న కన్నీళ్లను దిగమింగుకుంటూ అభిమాన నేతకు సాదర స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఈశ్వర్ మాట్లాడుతూ, నియోజకవర్గ కార్యకర్తల గురించి ఎంత చెప్పినా తకువే అన్నారు. ప్రతిఒక్కరూ తానే అభ్యర్థి అనుకుని పని చేశారని గుర్తుచేశారు. దురదృష్టశావత్తు తాను ఓడిపోయానని, రాష్ట్రంలో మనం అధికారం కోల్పోయామన్నారు. బీఆర్ఎస్కు ఒడిదొడుకులు కొత్త కాదని, రానున్న రోజుల్లో పార్లమెంట్ ఎన్నికల రూపంలో పరీక్షలు రాబోతున్నాయన్నారు. ఎన్నికలను ఎదుర్కొనేందుకు పక్కా కార్యాచరణతో ముందుకెళ్దామని పిలుపునిచ్చారు.
కేసీఆర్ పాలనలో తెలంగాణ ఎన్నో విజయాలు సాధించిందని, అయినప్పటికీ కాంగ్రెస్ మనకన్నా బాగా పనిచేస్తారని ప్రజలు నమ్మి అవకాశమిచ్చారన్నారు. దుష్ప్రచారం కూడా కొంతపై చేయి సాధించిందన్నారు. రాష్ట్రం తెచ్చిన పార్టీగా బీఆర్ఎస్ ఎపుడూ తెలంగాణ ప్రజల పక్షమేనని పేర్కొన్నారు, కాంగ్రెస్ అధికారంలోకి రాగానే పార్టీ కార్యకర్తలపై భౌతిక దాడులకు దిగడం హేయనీయమన్నారు. ఇలాంటి ఘటనలకు భయపడాల్సిన అవసరం లేదని, మిమ్మల్ని కాపాడుకునే బాధ్యత తనదేనని కొప్పుల భరోసా ఇచ్చారు.
ఈశ్వర్ అంటే సౌమ్యుడు, మెత్తటి మనిషి అనే భావనతో హద్దులు మీరితే ఊరుకునేది లేదని, మరో కోణం నుంచి చూస్తే తట్టుకోలేరని హెచ్చరించారు. కార్యకర్తలపై దాడులకు దిగినా, ఇబ్బందులకు గురుచేసినా ఎట్టిపరిస్థితుల్లో ఊరుకోబోనని స్పష్టం చేశారు. ధర్మపురి నుంచి నాలుగు సార్లు గెలిచిన ఎవరినీ నొప్పించలేదని, ఆ పరిస్థితి తీసుకురావద్దని కాంగ్రెస్ నాయకులకు హితవు పలికారు. ఓడినా, గెలిచినా ధర్మపురి నియోజకవర్గ ప్రజల కోసమే పనిచేస్తానని, తాను ఈ స్థాయికి అంత సులువుగా రాలేదని నిప్పుల్లో నడిచి వచ్చానని కొప్పుల గుర్తు చేశారు.
ప్రజలను మభ్య పెట్టి అధికారంలోకి వచ్చిన కొత్త ప్రభుత్వానికి కొంత టైం ఇద్దామని, హామీల అమలులో విఫలమైతే ప్రజా గొంతుక అవుదామన్నారు. ధర్మపురిలో మన నైతిక సె్థైర్యాన్ని దెబ్బ తీసేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని, ఏమైనా లోపాలు ఉంటే ఆత్మపరిశీలన చేసుకొని సమీక్షించుకుందామన్నారు. బీఆర్ఎస్ ఉద్యమ పార్టీ అని, పోరాటాలు కొత్త కాదన్నారు. భవిష్యత్ బీఆర్ఎస్దేనని, కేసీఆర్ దమ్మున్న నాయకుడు గనుకే తెలంగాణ సాధించారని గుర్తుచేశారు.
రాజకీయాల్లో జయాపజయాలు సహజమని, బీఆర్ఎస్ త్యాగాల పార్టీ అని, పదవులను గడ్డి పోచల్లా వదలి పెట్టామని గుర్తుచేశారు. బీఆర్ఎస్ పాలక పక్షంలో ఉన్నా విపక్షంలో ఉన్నా ఎపుడూ ప్రజల పక్షమేనని, కష్టపడి పని చేసి కలిసి కట్టుగా పనిచేసి ముందుకుసాగుదామని పిలుపునిచ్చారు. పార్టీ కోసం పని చేసిన అన్ని స్థాయిల నాయకులు, ప్రజాప్రతినిధులు, ప్రజలకందరికీ ధన్యవాదాలు తెలిపారు.
సమావేశానికి వస్తున్న ఈశ్వర్ను చూడగానే కార్యకర్తలకు ఉద్వేగానికి లోనయ్యారు. మహిళలు బోరున విలపించారు. ఈశ్వర్పై పడి కన్నీరుపెట్టుకున్నారు. ఈశ్వర్ కూడా కొంత ఉద్వేగానికి లోనయ్యారు. వీరిని ఈశ్వర్ సముదాయించారు. బీఆర్ఎస్ ఉద్యమపార్టీ అనీ, కార్యకర్తలు వీరసైనికులని, ఒక యుద్ధంలో ఒడగానే, మరో యుద్ధ్దానికి సన్నద్ధం కావడమే సైనికుల లక్షణమన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన ఆరు హామీలను నెరవేర్చకుంటే పోరాటం చేయడానికి సిద్ధంగా ఉండాలని కోరారు.
కార్యక్రమంలో డీసీఎమ్మెస్ చైర్మన్ డా.ఎల్లాల శ్రీకాంత్రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ సంగి సత్తెమ్మ, ఎంపీపీలు ఎడ్ల చిట్టిబాబు, బాధినేని రాజమణి, లక్ష్మి, నక్క శంకరయ్య, జడ్పీటీసీలు బాధినేని రాజేందర్, బత్తిని అరుణ, రాజేందర్రావ్, జలేందర్, ఏఎంసీ చైర్మన్లు అయ్యోరి రాజేశ్కుమార్, హనుమాండ్లు, పత్తిపాక వెంకటేశ్, మున్సిపల్ వైస్ చైర్మన్ ఇందారపు రామన్న తదితరులు ఉన్నారు.