ఓదెల, జనవరి 26: కేసీఆర్ పాలనలోనే ఆలయాల అభివృద్ధి జరిగిందని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ స్పష్టం చేశారు. మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్రెడ్డితో కలిసి శుక్రవారం ఓదెల మల్లన్న ఆలయాన్ని దర్శించుకున్నారు. వారికి పాలకవర్గ సభ్యులు సాదర స్వాగతం పలికారు. వేద పండితులు ఆశీర్వచనం చేశారు. అనంతరం ఈశ్వర్, దాసరి స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించారు. అనంతరం మాజీ మంత్రి విలేకరులతో మాట్లాడారు.
ఓదెల మల్లన్న ఆలయానికి ఎంతో విశిష్టత ఉన్నదని, కోరిన కోర్కెలు తీర్చే స్వయంభూవుగా ప్రజలు కొలుస్తారని చెప్పారు. కేసీఆర్ సర్కారు యాదాద్రి, వేములవాడ, కొండగట్టు, కాళేశ్వరం లాంటి అనేక దైవక్షేత్రాలను అభివృద్ధి చేసినట్లు చెప్పారు. ఓదెల మల్లన్న ఆలయాభివృద్ధికి ప్రణాళికలు రూపొందించామని, ఇంతలోనే ప్రభుత్వం మారడం దురదృష్టకరమన్నారు.
ప్రస్తుత సర్కారు ఓదెల మల్లన్న క్షేత్రాభివృద్ధికి నిధులు కేటాయించాలని కోరారు. ఇక్కడ ఎంపీపీలు కునారపు రేణుకాదేవి, నూనేటి సంపత్, జడ్పీటీసీ గంట రాములు, ఆకుల మహేందర్, ఆలయ చైర్మన్ మేకల మల్లేశంయాదవ్, డైరెక్టర్లు ఆరెల్లి మొండయ్యగౌడ్, బత్తుల రమేశ్, రౌతు జలపతి, కనికిరెడ్డి సతీశ్, మ్యాడగోని శ్రీకాంత్, కర్రె కుమారస్వామి, చింతం మొగిలి ఉన్నారు.