కోల్సిటీ, మే 14: నగరంలోని ప్రభుత్వ స్థలాలు కొందరికి ఫలహారం అవుతున్నాయి. రాజకీయ పలుకుబడి ఉంటే చాలు… ఖాళీ జాగాలో పాగాలు వేసినా పట్టించుకునే నాథుడే ఉండడు. కార్పొరేషన్ ఐదో డివిజన్ పరిధి మల్కాపూర్లో గల సర్వే నం.56, 57 లోని ప్రభుత్వ భూములు ఆక్రమణలకు గురవుతున్నా కార్పొరేషన్ అధికారులు చోద్యం చూస్తున్నారు. కొందరు రేకుల షెడ్లు, మరికొందరు ఏకంగా ఇళ్లు యథేచ్ఛగా నిర్మిస్తున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. గతంలో ఇదే సర్వే నంబర్లో వెలిసిన అక్రమ నిర్మాణాలు నగర పాలక అధికారులు యుద్ధ ప్రాతిపదికన కూల్చివేశారు. ఈ ఆక్రమణలపై మాజీ కౌన్సిలర్ మామిడాల చంద్రయ్య స.హ చట్టం ద్వారా వెలుగులోకి తీసుకవచ్చి చర్యలకు న్యాయ పోరాటం చేస్తున్నా ఎవరూ పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఐదో డివిజన్కు చెందిన మాజీ కౌన్సిలర్ మామిడాల చంద్రయ్య సర్వే నం.56, 57లో వెలిసిన నిర్మాణాలకు అనుమతుల విషయమై నగర పాలక సంస్థ కార్యాలయంలోని టౌన్ ప్లానింగ్ విభాగంలో ఫిర్యా దు చేయగా పట్టించుకోలేదని వాపోతున్నాడు. దాంతో సమాచార హక్కు చట్టం ద్వారా దరఖాస్తు సమర్పించగా అధికారులు స్పందించి రామగుండం తహసీల్దార్కు పంపించారు. రెవెన్యూ అధికారులు పరిశీలించి అది ప్రభుత్వ భూమిగా నిర్ధారించారు. దీనితో కార్పొరేషన్ అధికారులు అది ప్రభుత్వ భూమేననీ, సర్వే నం.56లో 3.3 ఎకరాల నూమి, సర్వే నం.57లో 6.24 ఎకరాల భూమి ఉందనీ, వాటిలో ఏలాంటి నిర్మాణాలకు తాము అనుమతి ఇవ్వలేదంటూ గత నె 16న మామిడాల చంద్రయ్యకు వివరణ పత్రాలు అందజేశారు. అప్పటి నుంచి ప్రతి రోజూ కార్యాలయం చుట్టూ న్యాయం కోసం ప్రదక్షిణలు చేస్తున్నారు. స.హ చట్టం ద్వారా వెలుగులోకి వచ్చినా చర్యలు తీసుకోవడం లేదు. ఈ వ్యవహారంలో ఏమైనా చేతులు మారాయా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ అక్రమ నిర్మాణాలపై మాజీ కౌన్సిలర్ చంద్రయ్య రెండు రోజుల క్రితం స్థానిక ఎమ్మెల్యేను కలిసి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. కాగా, నగర పాలక సంస్థ కమిషనర్ (ఎఫ్ఏసీ) అరుణ శ్రీ స్పందించి తగు చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ విషయమై టౌన్ ప్లానింగ్ ఏసీపీ శ్రీహరిని వివరణ కోరగా, నెల రోజుల కిందటే తాను విధుల్లో చేరాననీ, వాటిని పరిశీలించాక చర్యలు తీసుకుంటామని తెలిపారు.