కరీంనగర్ కలెక్టరేట్, ఏప్రిల్ 12: ఓటు నమోదుకు మరో మూడు రోజులే గడువు ఉన్నది. ఈ నెల 15న పక్రియ ముగియనున్నది. అర్హులందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకొని మే 13న జరిగే లోక్సభ ఎన్నికల్లో ఓటు నమోదు చేసుకోవాలని అధికారులు కోరుతున్నారు. ఫిబ్రవరి నుంచి కొనసాగుతున్న ఓటరు నమోదు ద్వారా ఇప్పటికే జిల్లా ఎన్నికల యంత్రాంగానికి 8 వేలకు పైగా ఫాం-6 దరఖాస్తులు వచ్చినట్లు తెలుస్తున్నది. తుదిగడువు వరకు ఆన్లైన్లోగానీ, ఆఫ్లైన్లో గానీ స్వీకరించి, అనంతరం వాటిని క్షేత్రస్థాయిలో పరిశీలించనున్నారు.
ఈనెల 25న తుది జాబితాను ప్రకటించనున్నారు. ఇప్పటికే ఫిబ్రవరి 8న లోక్సభ ఎన్నికల ఓటర్ల తుది జాబితా విడుదల కాగా, కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా 10,71,792 మంది ఓటర్లు ఉన్నారు. తాజాగా ఇచ్చిన అవకాశంతో మరో పది వేల మంది వరకు పెరుగుతారనే ఎన్నికల అధికారులు అంచనా వేస్తున్నారు. ఓటరు నమోదుకు ప్రభుత్వ, ప్రైవేట్ విద్యా సంస్థల్లో స్వీప్ ద్వారా పలు అవగాహన కార్యక్రమాలను నిర్వహించారు. దీంతో, విద్యార్థుల్లో భారీ ఎత్తున స్పందన వచ్చిందని చెబుతున్నారు.
2006 మార్చి31లోగా జన్మించిన ప్రతి ఒక్కరూ విధిగా ఓటు హక్కు పొందాలని, ఫాం-6 ద్వారా దరఖాస్తు చేసుకోవాలని కరీంనగర్ అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి కే మహేశ్వర్ చెప్పారు. వయసు ధ్రువీకరణ పత్రం, పాస్పోర్టు సైజు ఫోటో జత చేసి సమీపంలోని పోలింగ్ స్టేషన్ బూత్ స్థాయి అధికారికి అందించాలని సూచించారు. ఇతర ప్రాంతాల నుంచి వలసవచ్చి, ఇక్కడే స్థిరపడ్డ వారు కూడా ఓటరుగా నమోదు చేసుకోవాలని, ఓట్లు గైల్లంతైనవారు వారు కూడా తిరిగి దరఖాస్తు చేసుకోవాలన్నారు.