మూడు రోజులుగా ముసురు కమ్ముకున్నది. ఎడతెరిపి లేకుండా జోరు వాన పడుతున్నది. దీంతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. చెక్ డ్యాంలు, చెరువులు, కుంటలు జలకళను సంతరించుకున్నాయి. పలు చెరువులు, కుంటలు మత్తడి దుంకుతున్నాయి. ప్రాజెక్టులు, జలాశయాల్లోకి భారీగా వరద వచ్చి చేరుతున్నది. దీంతో ఆయకట్టు రైతుల్లో ఆనందం నెలకొనగా, పల్లెల్లో వరినాట్లు జోరందుకున్నాయి. మరోవైపు భారీ వర్షాల నేపథ్యంలో అమాత్యుల ఆదేశాల మేరకు జిల్లావారీగా అధికారయంత్రాంగం అప్రమత్తమైంది. ముంపు ప్రాంతాల వివరాలు సేకరిస్తూ, కుంటలు, చెరువులు, ప్రాజెక్టుల వద్దకు ప్రజలు వెళ్లకుండా, ఎక్కడా ఇబ్బందులు జరుగకుండా చర్యలు తీసుకుంటున్నది.
– కరీంనగర్, జూలై 20(నమస్తేతెలంగాణ)
కరీంనగర్, జూలై 20(నమస్తే తెలంగాణ): మూడు రోజులుగా ఉమ్మడి జిల్లాలో ముసురు పడుతున్నది. ఎడతెరిపి లేకుండా వాన కురుస్తున్నది. దీంతో వరద పోటెత్తి, ప్రాజెక్టులు, చెరువులు, కుంటలు, చెక్డ్యాంలకు వచ్చి చేరుతున్నది. మెదక్, సిద్దిపేట, నిజామాబాద్ జిల్లాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు కూడెల్లి, పాల్వంచ వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ఈ రెండు వాగుల నుంచి రెండు వేల క్యూసెక్కుల నీరు నర్మాల ఎగువ మానేరులోకి చేరుతున్నది. 32 అడుగుల నీటిమట్టానికి గాను ప్రస్తుతం 22 అడుగులకు చేరింది. కాగా, శ్రీరాజరాజేశ్వర ప్రాజెక్టులోకి 9100 క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉన్నది.
కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి 8100 క్యూసెక్కులు, మానేరు, మూలవాగుల నుంచి వెయ్యి క్యూసెక్కులు వచ్చి చేరుతుండగా, 25.50 టీఎంసీల సామర్థ్యానికి ప్రస్తుతం 15.49 టీఎంసీలు ఉన్నది. ఈ ప్రాజెక్టు ఆరు గేట్లను ఎత్తి 9190 క్యూసెక్కులను ఎల్ఎండీకి వదులుతున్నారు. మిడ్మానేరుతోపాటు ఎల్ఎండీ ఎగువ ప్రాంతంలోని నుస్తులాపూర్, కొత్తపల్లి, రేణికుంట, తదితర గ్రామాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా మోయతుమ్మెద వాగు నుంచి వరద వస్తున్నది. ఈ ప్రాజెక్టులో ఉదయం వరకు 3,500 క్యూసెక్కుల వరద రాగా, సాయంత్రం వరకు 2,700 క్యూసెక్కులకు తగ్గింది. మానేరు, మూలవాగుల్లో నీటి ప్రవాహం పెరుగుతున్నది. అన్ని చోట్లా వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. చెరువులు, చెక్డ్యాంలు అలుగులు దుంకుతున్నాయి. ఆయకట్టు ప్రాంతాల్లో వరినాట్లు ఊపందుకున్నాయి.
రంగంలోకి అమాత్యులు
భారీ వర్షాల నేపథ్యంలో మంత్రులు రంగంంలోకి దిగారు. అప్రమత్తంగా ఉండాలని జిల్లాల వారీగా ఆదేశాలు జారీ చేశారు. సిరిసిల్ల కలెక్టర్ అనురాగ్ జయంతితో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి, పరిస్థితిని తెలుసుకున్నారు. కుంటలు, చెరువులు, ప్రాజెక్టుల వద్దకు ప్రజలను వెళ్లకుండా చూడాలని, ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకోవాలని నిర్దేశించారు. దీంతో కలెక్టర్ వివిధ శాఖల అధికారులను అప్రమత్తం చేశారు. ఇటు మంత్రి కొప్పుల ఈశ్వర్ కూడా ఒక ప్రకటన విడుదల చేశారు.
అధికారుల అప్రమత్తం
భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. కలెక్టరేట్లతోపాటు తహసీల్దార్ కార్యాలయాల్లో కాల్ సెంటర్లు ఏర్పాటు చేశారు. సహాయక చర్యల కోసం టోల్ఫ్రీ నంబర్లను అందుబాటులో ఉంచారు. ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తే వెంటనే సమాచారం ఇవ్వాలని సూచిస్తున్నారు. కరీంనగర్లో కలెక్టర్ ఆఫీస్ 18004254731, రామగుండం బల్దియాలో 18004257062, 9603666444 నంబర్లును అందుబాటులోకి తెచ్చారు.
అప్రమత్తంగా ఉండండి
భారీ వర్షాల కారణంగా ప్రజలు అతి జాగ్రత్తగా, అప్రమత్తంగా ఉండాలి. ప్రజలు తడిగా ఉండే కరెంట్ స్తంభాలు, సపోర్ట్ విద్యుత్ తీగెలు, ట్రాన్స్ ఫార్మర్లను తాకవద్దు. వరద నీటిలో మ్యాన్ హోల్స్, డ్రైనేజీలను గమనించి నడవాలి. ఉధృతంగా ప్రవహించే చెరువుల మత్తళ్లు, వాగులకు వద్దకు వెళ్లవద్దు. పాత ఇండ్ల గోడలు కూలి పోయే అవకాశం ఉంటుంది. తగిన జాగ్రత్తలు పాటించాలి. అత్యవసరం ఉంటేనే ప్రజలు బయటకు రావాలి.
– ఒక ప్రకటనలో మంత్రి కొప్పుల ఈశ్వర్ సూచన