చొప్పదండి, జనవరి 20: రైతులు ఆయిల్ పామ్ సాగుపై దృష్టిసారించాలని ఎంపీపీ చిలుక రవీందర్ సూచించారు. రుక్మాపూర్ ఉద్యానవన నర్సరీలో గురువారం రెండెకరాల్లో ఆయిల్ పామ్ మొక్కలు నాటారు. ముఖ్య అతిథిగా హాజరైన ఎంపీపీ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ఆయిల్ పాం పంటల సాగుపై రాయితీ ఇస్తూ రైతులను ప్రోత్సహిస్తున్నదని తెలిపారు. మండలంలో వారం పది రోజుల్లో ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో ఆయిల్ పామ్ సాగుపై రైతులకు శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేస్తారని పేర్కొన్నారు. రైతులు ఆయిల్ పామ్ సాగుపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. జిల్లా ఉద్యానవన శాఖ అధికారి శ్రీనివాస్ మాట్లాడుతూ, జిల్లాలో 50 వేల ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగులోకి తీసుకురావడానికి లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు తెలిపారు. వచ్చే సంవత్సరం నుంచి రైతులకు విడుతల వారీగా మొక్కలను సరఫరా చేస్తామని పేర్కొన్నారు. దీనికి సంబంధించి జిల్లాకు గోల్డ్డ్రాప్ కంపెనీని కేటాయించినట్లు తెలిపారు. చిగురుమామిడిలో 70 ఎకరాల్లో నర్సరీ ఏర్పాటు చేస్తామని చెప్పారు. సర్పంచ్ చిలుక లింగయ్య, ఉద్యానవన శాఖ అధికారులు రోహిత్, స్వాతి, మంజువాణి, పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.