Fire Accident | ఎలిగేడు : ఎలిగేడు మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ వెనకాల వైపు ఉన్న 11 కేవీ విద్యుత్ తీగలు తెగి ఇనుప ఫెన్సింగ్ పై పడి శుక్రవారం అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. పోలీస్ స్టేషన్ కు అతి సమీపంలో ఉన్న న్యాతరి శంకరయ్యకు చెందిన పశువుల కొట్టం, గడ్డివాముకు మంటలు వ్యాపించాయి. పోలీస్ స్టేషన్ లో ఉన్న ఎస్ఐ మధుకర్ తన సిబ్బందిని అప్రమత్తం చేసి మంటలను ఆర్పేందుకు తీవ్రంగా శ్రమించారు.
మంటలు అదుపు కాకపోవడంతో సుల్తానాబాద్ సీఐ రంజిత్ రావుకు స్థానిక ఎస్సై సమాచారం అందించడంతో సీఐ తక్షణమే స్పందించి హుటాహుటిన జూలపల్లి ఎస్సై మల్లేష్, సుల్తానాబాద్ ఎస్సై చంద్రకుమార్, అగ్నిమాపక సిబ్బంది ఫైర్ ఇంజన్ తో సహా సంఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు. ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా చుట్టుపక్కల ఇండ్ల, వాహనాలకు నిప్పు అంటుకోకుండా పోలీసులు అగ్నిమాపక సిబ్బంది తమ ప్రాణాలకు తెగించి భారీ ఎత్తున ఎగసిపడుతున్న మంటలను ఆర్పి వేయడం చూసిన గ్రామస్తులు పోలీస్ లకు కృతజ్ఞతలు తెలిపారు.