సిరిసిల్ల, జూలై 5: చిన్నతరహా వ్యాపారాలను నెలకొల్పేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తున్నది. ఎస్సీ లబ్ధిదారులకు ఆర్థికంగా వెన్నుదన్నుగా నిలువాలన్న చిరువ్యాపారాలకు చేయూతనందిస్తున్నది. మంత్రి కేటీఆర్ చొరవతో రాజన్న సిరిసిల్ల జిల్లాలో చిరువ్యాపారాల స్థాపనకు ఆర్థిక సాయం అందించబోతున్నది. జిల్లాలో 124 మందిని ఎంపిక చేయగా, ఒక్కొక్కరికీ 50 వేల చొప్పున 62 లక్షలను గురువారం రాష్ట్ర ఎస్సీ, మైనార్టీ, దివ్యాంగుల సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్తో కలిసి మంత్రి కేటీఆర్ అందించనున్నారు. కలెక్టరేట్ ప్రాంగణంలో ఈ ఆర్థిక సాయాన్ని పంపిణీ చేయనున్నారు. లబ్ధిదారుల ఎంపికను పారదర్శకంగా పూర్తి చేసిన అధికారులు వారు చిరు వ్యాపారం చేసుకునేందుకు వీలుగా ఆర్థికంగా సాయం అందిస్తున్నారు. సిరిసిల్ల, వేములవాడ నియోజకవర్గాల్లో 124 మంది లబ్ధిదారులను ఎంపిక చేశారు. సిరిసిల్ల నియోజకవర్గంలో 79 మందికి 39.50 లక్షలు, వేములవాడలో 22 మంది లబ్ధిదారులకు 11 లక్షలు, మానకొండూర్ నియోజకవర్గంలోని ఇల్లంతకుంట మండలంలో 20 మందికి 10 లక్షలు ఆర్థిక సాయం అందించనున్నారు. చొప్పదండి నియోజవర్గంలోని బోయినపల్లిలో ముగ్గురికి 1.50 లక్షలు అందించనున్నారు.
ప్రభుత్వ సాయంతో వ్యాపారాల స్థాపన
ప్రభుత్వ నిబంధనలను అనుసరించి దరఖాస్తు చేసుకున్న వారిలో 124 మంది లబ్ధిదారులను ఎంపిక చేశారు. చిరు వ్యాపారాలను ప్రోత్సహించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం సహకారం అందిస్తున్నది. లబ్ధిదారులు చిన్న వ్యాపారాలను నెలకొల్పుతారు. ప్రభుత్వం అందించిన ఈ సాయంతో చిన్న వ్యాపారాలను నెలకొల్పి మంచిగా కొనసాగించాలి. మంత్రి కేటీఆర్ చొరవతో లబ్ధిదారులకు ఆర్థిక సాయం అందిస్తున్నాం.
-వినోద్కుమార్, ఈడీ ఎస్సీ కార్పొరేషన్ (రాజన్న సిరిసిల్ల జిల్లా)