సిరిసిల్ల రూరల్, సెప్టెంబర్ 17 : రాజన్న సిరిసిల్ల జిల్లాలో రైతులకు యూరియా కష్టాలు తీరడం లేదు. యూరియా కోసం ఉదయాన్నే సింగిల్ విండో గోదాములు, రైతు వేదికలు, ఫర్టిలైజర్ దుకాణాల ఎదుట బారులు తీరుతున్నారు. ఒక్క బస్తా యూరియా కోసం తిండి తిప్పలు లేకుండా యూరియా కోసం అష్టకష్టాలు పడుతున్నారు. ఒక్క బస్తా యూరియా కోసం గంటల తరబడి క్యూ లైన్ లో ఉంటూ అలసి సొలసి పోతున్నారు.
తంగళ్ళపల్లి మండలం బద్దెనపల్లిలోనీ మహిళ గ్రూప్ ద్వారా చేపట్టిన దుకాణంలో 450 యూరియా బస్తాలు రాగా, బుధవారం ఉదయాన్నే బద్దెనపల్లిలోనీ రైతు వేదికకు చేరుకున్నారు. క్యూలైన్లో పాసుబుక్ పుస్తకాలు, ఆధార్ కార్డు జిరాక్స్ పత్రాలను క్యూలైన్లో ఉంచారు. రైతు వేదికలు వ్యవసాయ అధికారులు ఒక బస్తా టోకెన్ ఇవ్వడంతో, సుమారు 200మంది రైతులు క్యూ లైన్లో నుంచి నిరాశతో వెనుతిరిగారు. కాగా టోకెన్ తీసుకున్న రైతులు, మళ్ళీ మహిళ కమ్యూనిటీ భవనం వద్ద క్యూలో ఉన్నారు. టోకెన్ చూపించి యూరియా బస్తాలను పోలీసు పహారాలో అందించారు. ఉదయం ఐదు గంటలకు వచ్చిన గంటల తరబడి క్యూ లైన్లో ఉండాల్సి వచ్చిన దుస్థితి నెలకొంది. ప్రభుత్వం అధికారులు రైతులకు సరిపడా యూరియా అందివ్వలేకపోయారని, రైతులను గోసపెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 450 బస్తాలకు సుమారు 200 మందికి మంది పైగా రైతులు రాగా, టోకెన్ దొరకని వారు నిరాశ తిరిగి వెళ్లిపోవడం గమనార్హం. 10 ఎకరాలు ఉన్న రైతుకు ఒక్క యూరియా బస్తా ఏం సరిపోతుందని, వరి పొట్టుకొచ్చేదని, యూరియా దొరకకపోవడంతో ఆవేదన చెందుతున్నారు. యూరియా కోసం ఇంతలా ఎన్నడు గోస పడలేదని రైతులు పేర్కొనడం గమనార్హం.