టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డిపై కర్షకలోకం కన్నెర్ర జేసింది. ‘వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్ అవసరం లేదు. మూడు గంటల కరెంటు ఇస్తే చాలు” అంటూ విషం గక్కడంపై భగ్గుమంటున్నది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు రెండో రోజూ నిరసనలతో హోరెత్తించింది. బుధవారం బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి ఉమ్మడి జిల్లావ్యాప్తంగా రేవంత్రెడ్డి దిష్టిబొమ్మలకు శవయాత్ర చేసి, దహనం చేసింది. సబ్స్టేషన్ల వద్ద పిండ ప్రదానం చేసి, కాంగ్రెస్కు వ్యతిరేకంగా నినదించింది. తాము సంతోషంగా ఉంటే నచ్చడం లేదని, అందుకే నీచమైన వ్యాఖ్యలు చేస్తున్నారంటూ ఆగ్రహించింది. తమ జోలికి వస్తే ఊరుకునేది లేదని, వెంటనే క్షమాపణ చెప్పకుంటే రేవంత్ నీ తాటతీస్తమంటూ హెచ్చరించింది. మానకొండూర్లో ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, పెద్దపల్లిలో ఎమ్మెల్యే దాసరి మనోహర్రెడ్డి, ధర్మపురిలో ఎంపీ వెంకటేశ్ నేతకాని పాల్గొని, కాంగ్రెస్ తీరుపై ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పార్టీ అసలు స్వరూపం బయటపడిందని, రైతులు సంతోషంగా ఉంటే ఓర్వలేక మళ్లీ చీకట్లోకి నెట్టివేసే ప్రయత్నం చేస్తున్నదని మండిపడ్డారు.
– కరీంనగర్, జూలై 12 (నమస్తే తెలంగాణ)
కరీంనగర్, జూలై 12 (నమస్తే తెలంగాణ) : ‘రైతులకు 24 గంటల ఉచిత కరెంట్ అవసరం లేదు.. మూడు గంటల కరెంట్ ఇస్తే సరిపోతుంది” అని టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలపై రైతులు భగ్గుమన్నారు. బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి కదం తొక్కారు. మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు రెండో రోజూ బుధవారం ఉమ్మడి జిల్లావ్యాప్తంగా నిరసన తెలిపారు. నియోజకవర్గ కేంద్రాలతోపాటు పలుచోట్ల రేవంత్ దిష్టిబొమ్మలకు ముందుగా శవ యాత్రలు తీశారు. చౌరస్తాల వద్ద ఉంచి దహనం చేశారు. గంగాధర, మల్యాల, కొడిమ్యాల సబ్స్టేషన్ల ఆవరణల్లో రేవంత్ ఫొటోలకు పిండ ప్రదానం చేశారు. మానకొండూర్లో ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని కమాన్ వద్ద ఎమ్మెల్యే దాసరి మనోహర్రెడ్డి, ధర్మపురిలో ఎంపీ వెంకటేశ్నేతకాని, జగిత్యాల జిల్లా కేంద్రంలోని తహసీల్ చౌరస్తాలో జడ్పీ చైర్పర్సన్ దావ వసంత, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ డాక్టర్ చంద్రశేఖర్ గౌడ్, మున్సిపల్ చైర్మన్ గోలి శ్రీనివాస్ ఆధ్వర్యంలో దిష్టిబొమ్మలు దహనం చేశారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్లో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, జడ్పీటీసీ గుండం నర్సయ్య, బీఆర్ఎస్ మండల శాఖ అధ్యక్షుడు బొంపెల్లి సురేందర్రావు, రజక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అక్కరాజు శ్రీనివాస్ పాల్గొన్నారు. ఆయాచోట్ల రేవంత్కు వ్యతిరేకంగా రైతులు, నాయకులు నినదించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ రైతును రాజు చేసే లక్ష్యంతో ముందుకెళ్తోంటే.. కాంగ్రెస్ నేతలు జీర్ణించుకోవడం లేదని మండిపడ్డారు. కాంగ్రెస్ పాలనలో కరెంట్ కోసం పడిగాపులు కాసేటోళ్లమని, రాత్రి పూట ఎంతో మంది చనిపోయారని, ఆ నాటి గోసను మళ్లీ రావద్దని దుమ్మెత్తిపోస్తున్నారు. ఇప్పుడు 24గంటల కరెంట్తో సంబురంగా సాగు చేసుకుంటే వాళ్లకు నచ్చడం లేదని, అందుకే ఓర్వలేక కుట్రలు చేస్తున్నారని ఆగ్రహించారు. రైతుబంధు, రైతుబీమా, కాళేశ్వరం నీటితో తెల్లబడుతున్న రైతులను మళ్లీ చీకట్లోకి నెట్టే కుట్రలను సహించబోమని హెచ్చరిస్తున్నారు. కరెంట్ కష్టాల కాంగ్రెస్ పార్టీని తెలంగాణలో నామరూపాలు లేకుండా చేస్తామని ముక్తకంఠంతో నినదిస్తున్నారు.