‘అన్నదాతలు ఆరుగాలం శ్రమించి పండించిన పంటను అమ్ముకునేందుకు కరీంనగర్ మార్కెట్లో సర్వం సిద్ధం చేశాం. కొనుగోళ్లు సక్రమంగా, సజావుగా జరిగేలా అన్ని సౌకర్యాలూ కల్పించాం. రోజుల తరబడి నిరీక్షించే అవస్థ లేకుండా వ్యాపారులు వెనువెంటనే కొనేలా ప్రణాళికతో ముందుకెళ్తున్నాం. చేతిలో చిల్లిగవ్వ లేక మార్కెట్కు వచ్చే రైతులకు కడుపు నిండా భోజనం పెడుతాం. త్వరలోనే ‘మధ్యాహ్న భోజనం’ కార్యక్రమాన్ని అమలు చేయాలని మార్కెట్ కమిటీలో నిర్ణయించాం.’ అని కరీంనగర్ వ్యవసాయ మార్కెట్ చైర్మన్ రెడ్డవేని మధు తెలిపారు. వానకాలం ధాన్యం కొనుగోళ్లు ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఆయన ‘నమస్తే తెలంగాణ’కు ఇంటర్వ్యూ ఇచ్చారు. కొనుగోళ్లకు చేస్తున్న ఏర్పాట్లను వివరించారు.
ముకరంపుర, అక్టోబర్ 21: పంట ఉత్పత్తులు అమ్ముకునేందుకు కరీంనగర్ మార్కెట్ యార్డుకు వచ్చే రైతుల కోసం ‘మధ్యాహ్న భోజనం’ కార్యక్రమాన్ని త్వరలోనే అమలు చేస్తామని కరీంనగర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రెడ్డవేని మధు తెలిపారు. వానకాలం ధాన్యం కొనుగోళ్లు ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఆయన ‘నమస్తే తెలంగాణ’కు ఇంటర్వ్యూ ఇచ్చారు.
వానకాలం పంట కొనుగోళ్ల ఏర్పాట్లు పూర్తయ్యాయా..?
మార్కెట్కు ముందుగా పత్తి వచ్చే అవకాశమున్నందున ఆ మేరకు అన్ని ఏర్పాట్లు చేశాం. దీపావళి తర్వాత మార్కెట్కు పత్తి అధికంగా వస్తుంది. కొనుగోళ్లు వేగంగా జరిగేలా చర్యలు చేపట్టాం. బహిరంగ మార్కెట్లో పత్తికి ఎంఎస్పీకి మించి ధర పలుకుతుంది. ఒక వేళ ధర తగ్గితే సీసీఐ ద్వారా కొనేందుకు ఏర్పాట్లు చేశాం. ఆన్లైన్ విధానంలో పారదర్శకంగా కొనుగోళ్లు జరిగేలా పర్యవేక్షణ ఉంటుంది. ధాన్యం, పత్తి, మక్కలు, పప్పుదినుసులు, అపరాలు ఎంత వచ్చినా కొనుగోలు చేసేందుకు సిద్ధంగా ఉన్నాం.
మార్కెట్ పరిధిలో పంట దిగుబడి అంచనా ఎంత?
మార్కెట్ కమిటీ పరిధిలోని కొత్తపల్లి, కరీంనగర్ రూరల్, తిమ్మాపూర్ మండలాలు ఉన్నాయి. గతంతో పోలిస్తే వర్షపాతం ఎక్కువగా నమోదవడం, కాళేశ్వరం ప్రాజెక్ట్తో గ్రామాల్లోని చెరువులు, కుంటలు పూర్తిగా నిండడంతో సాగునీటి లభ్యత పెరిగింది. బీడు భూములు సాగయ్యాయి. వ్యవసాయ శాఖ లెక్కల ప్రకారం మార్కెట్ పరిధిలోని మండలాల్లో ధాన్యం 8.60 లక్షల క్వింటాళ్లు, పత్తి 29,327 క్వింటాళ్లు, మక్కలు 3,470 క్వింటాళ్లు, కందులు 600 క్వింటాళ్ల దిగుబడి వచ్చే అవకాశముందని అంచనా. అందుకు తగ్గట్లు ఏర్పాట్లు చేశాం.
కొనుగోళ్లలో జాప్యం లేకుండా తీసుకుంటున్న చర్యలేమిటీ?
మార్కెట్కు వచ్చిన పంట ఉత్పత్తులను త్వరగా కొనుగోలు చేసేలా ఏర్పాట్లు చేశాం. ఏ దశలోనూ జాప్యం జరుగకుండా అంతా సిద్ధం చేశాం. రైతు మార్కెట్ యార్డు గేట్ వద్దకు రాగానే పూర్తి వివరాలు నమోదు చేసుకుని కొనుగోళ్ల ప్రక్రియ అంతా ఆన్లైన్లో పారదర్శకంగా నిర్వహిస్తాం. ఎలక్ట్రానిక్ కాంటాలు, వేబ్రిడ్జి అందుబాటులో ఉంది. పత్తి, వడ్లు తేమశాతం చూసే యంత్రాలు, ప్యాడీ క్లీనర్లు, టార్పాలిన్లు ఉన్నాయి. హమాలీలు ఉన్నారు. రైతులు సైతం పత్తి, ఇతర ఉత్పత్తులను తేమ, నిర్దేశించిన ప్రమాణాలకు లోబడి మార్కెట్ తీసుకురావాలి.
రైతులకు సౌకర్యాలు ఎలా ఉన్నాయి?
మార్కెట్లో రైతులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడమే ప్రధాన లక్ష్యం. శుద్ధజలం, మూత్రశాలలు, మరుగుదొడ్లు అందుబాటులో ఉన్నాయి. పరిశుభ్రంగా ఉంచేలా చర్యలు తీసుకుంటున్నం. రైతు విశ్రాంతి భవనంలో అన్ని సౌకర్యాలు కల్పించాం.
బయట కొనుగోళ్లు, క్యాష్ కటింగ్పై తీసుకునే చర్యలేమిటీ?
కొనుగోళ్లపై నిరంతర పర్యవేక్షణ ఉంటుంది. క్యాష్ కటింగ్ విధానం లేదు. రైతులకు ఇబ్బంది, నష్టం కలిగించేలా వ్యవహరించే వారిని ఉపేక్షించేది లేదు. బాధ్యులపై కఠిన చర్యలు ఉంటాయి. మార్కెట్ బయట జరిగే కొనుగోళ్లపై నిఘా ఉంటుంది. మార్కెట్ కమిటీ ఆదాయానికి గండికొట్టే వారిపై చట్ట ప్రకారం చర్యలుంటాయి.
మార్కెట్లో రైతులకు ఎలాంటి వసతులు కల్పిస్తున్నారు?
పంట ఉత్పత్తుల అమ్మకానికి పల్లెల నుంచి మార్కెట్కు వచ్చే రైతులకు కడుపు నిండా భోజనం పెట్టాలని నిర్ణయించాం. మార్కెట్ కమిటీకి వచ్చే వారిలో కొంత మంది మధ్యాహ్నం ఆకలితోనే నిరీక్షిస్తుంటారు. బయటికి వెళ్లి తినడం వారికి భారమే. అందుకోసం ఈ సీజన్లోనే ప్రత్యేకంగా మార్కెట్ కమిటీలో రైతుల కోసం ‘మధ్యాహ్న భోజనం’ కార్యక్రమాన్ని అమలు చేస్తాం. ఈ దిశగా ప్రత్యేక కార్యచరణ రూపొందిస్తున్నాం.