Odela | ఓదెల, జులై 17 : ఎల్నినో కారణంగా ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలని పెద్దపల్లి కలెక్టర్ కోయ శ్రీహర్ష రైతులకు సూచించారు. పెద్దపల్లి జిల్లా ఓదెల మండలంలోని పలు గ్రామాల్లో కలెక్టర్ కోయ శ్రీహర్ష శుక్రవారం విస్తృతంగా పర్యటించారు. ఓదెల మండలంలోని కొలనూరు, ఓదెల గ్రామాల్లో పర్యటించి రైతులతో మాట్లాడారు. రాష్ట్రంలో నెలకొన్న సూపర్ ఎల్నినో పరిస్థితుల నేపథ్యంలో రైతులు అధిక నీటి అవసరమయ్యే వరి పంట సాగుకు దూరంగా ఉండి, ప్రత్యామ్నాయ పంటలను సాగు చేయాలని కోరారు. అలాగే భారత ఎన్నికల సంఘం స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) కార్యక్రమంలో భాగంగా ప్రతీ ఓటరు ఎన్యూమరేషన్ ఫారాన్ని పూర్తి చేసి బీఎల్వోలకు అందజేయాలన్నారు. +
అలాగే ఓదెల జడ్పీహెచ్ఎస్ పాఠశాల, మోడల్ స్కూల్, జూనియర్ కళాశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం నూతనంగా నిర్మించిన తహసీల్దార్ కార్యాలయాన్ని పరిశీలించారు. కలెక్టర్ ప్రయాణంలో మార్గమధ్యంలో కొలనూరులో వరి పొలాలను సందర్శించారు. ఇక్కడ యువరైతు గీట్ల సుమన్ రెడ్డితో వరి, ఇతర పంటల సాగు గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు పల్లె కనకయ్య, కనికి రెడ్డి సతీష్, ఉపసర్పంచ్ లు పాకాల సంపత్ రెడ్డి, గోపతి శ్రీలత-ప్రవీణ్, తహసీల్దార్ బానోతు వనజా నాయక్, ఎంపీడీవో వెన్నపురెడ్డి అనిల్ రెడ్డి, ఏవో భాస్కర్, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.