కరీంనగర్ కార్పొరేషన్, జూలై 11 : మేడిగడ్డ వద్ద లక్షల క్యూసెక్కుల వరద కిందికి పోతున్నదని, కన్నెపల్లి పంపుహౌస్లో మోటర్లను ఆన్ చేసి నీటిని ఎత్తిపోయాలని మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ డిమాండ్ చేశారు. శనివారం స్థానిక ఓ ప్రైవేటు హోటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రైతుల పేరుతో సీఎం రేవంత్రెడ్డి చేపట్టిన సభ అట్టర్ ఫ్లాప్ అయ్యిందని ఎద్దేవా చేశారు. ఎన్నికల సమయంలో అడ్డగోలుగా దేవుళ్లపై ఒట్టు పెట్టి రైతులను మోసం చేసి అధికారంలోకి వచ్చారని దుయ్యబట్టారు.
ఆయనకు ఓటమి భయం పట్టుకుందని, అందుకే బీఆర్ఎస్పై అడ్డమైన కూతలు కూస్తున్నాడని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్కు 17 సీట్లు కూడా రావని, డిపాజిట్లు కూడా దక్కవని స్పష్టం చేశారు. అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నానని చెప్తున్న రేవంత్రెడ్డి మహిళలకు కేసీఆర్ కిట్ ఏమైందని, రైతు రుణమాఫీ ఎక్కడ పూర్తి చేశారని, నిరుద్యోగులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు ఏవని ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టు గురించి కాంగ్రెస్ మంత్రులు, నేతలకు వెంట్రుక కూడా తెలియదని ఎద్దేవా చేశారు. కాళేశ్వరంపై సీఎం బుద్ది లేకుండా ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని, 25 లక్షల క్యూసెక్కుల వరద వచ్చినప్పుడే భద్రాచలం కొట్టుకపోలేదని, ఇప్పుడు ఎలా కొట్టుకపోతుందని నిలదీశారు.
మేడిగడ్డ వద్ద ఇప్పటికీ 97 మీటర్ల మేరకు వరద నీరు ఆంధ్రాకు తరలిపోతున్నదని, కేవలం తమ గురువు కోసం కిందికి వదిలిపెడుతున్నాడని దుయ్యబట్టారు. కాంగ్రెస్ మంత్రులు, నాయకులు ఇసుక దోపిడీ చేయటానికి అవకాశం ఉండదనే కన్నెపల్లి మోటర్లు ఆన్ చేయడం లేదని విమర్శించారు. రాష్ట్రంలో మళ్లీ 2014కు ముందు పరిస్థితులు దాపురించాయని, ఓ వైపు కాళేశ్వరంలో లక్షలాది క్యూసెక్కుల నీరు వృథాగా పోతుంటే.. మరోవైపు రాష్ట్ర రైతులు సాగునీరు లేక అవస్థలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా వారి గోసను చూసి వెంటనే మోటర్లను ఆన్చేసి శ్రీరాజరాజేశ్వర జలాశయం నింపాలని డిమాండ్ చేశారు. లేకపోతే 50 వేల మందితో కన్నెపల్లి పంపుహౌస్ను ముట్టడిస్తామని హెచ్చరించారు. సమావేశంలో జిల్లా గ్రంథాలయ మాజీ చైర్మన్ ఏనుగు రవీందర్రెడ్డి, చొప్పదండి నియోజకవర్గ బీఆర్ఎస్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.